హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయ నిర్మాణ పనుల పురోగతిని కేసీఆర్ పరిశీలిస్తున్నారు. సీఎం కేసీఆర్ వెంట రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్ అండ్ బీ శాఖ అధికారులతో పాటు తదితరులు ఉన్నారు. సచివాలయ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. ఇంటీరియర్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మూడు షిఫ్టుల్లో పనులు జరుగుతున్నాయి.
సచివాలయానికి వచ్చే కంటే ముందు ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో తెలంగాణలో రోడ్ల పరిస్థితిపై కేసీఆర్ సమీక్షించారు. అనంతరం ప్రజారోగ్యంపై వైద్యారోగ్య శాఖ మంత్రి, అధికారులతో సీఎం చర్చించారు. ఆ తర్వాత కొత్త సచివాలయం ప్రాంగణానికి కేసీఆర్ చేరుకుని పనులను పరిశీలిస్తున్నారు.
150-200 ఏండ్ల వరకు చెక్కుచెదరకుండా ఉండేలా సెక్రటేరియట్ను నిర్మిస్తున్నారు. దీనికోసం అధికారులు, నిర్మాణ సంస్థ ప్రత్యేక దృష్టి సారించాయి. చాంబర్ల నిర్మాణం, ఇంటీరియర్ డిజైన్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, వర్క్స్టేషన్ ఏర్పాటు, కలరింగ్, ఫ్లోరింగ్, మార్బుల్స్, పోర్టికోల నిర్మాణం.. ఇలా వివిధ రకాల పనులన్నీ ఏకకాలంలో చేపడుతున్నారు. రూ.617 కోట్లతో నిర్మితమవుతున్న నూతన సచివాలయ భవనాన్ని గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ పద్ధతిలో నిర్మిస్తున్నారు. నూతన సచివాలయ భవనంలోకి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా నిర్మిస్తున్నారు.