CM KCR | అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులకు రూ.10వేల సాయం అందజేస్తున్నట్లు సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. మహబూబాబాద్ జిల్లాలోని పెద్దవంగర మండలం రెడ్డికుంటతండాలో దెబ్బతిన్న మిర్చి, మామిడి పంటలను పరిశీలించిన అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఇప్పటికే ఈ 10వేల సాయం ఖమ్మం జిల్లాలో ప్రకటించానని.. కానీ ఇక్కడ మరోసారి చెబుతున్నానని తెలిపారు. ఈ ప్రకటన హైదరాబాద్ నుంచే చేయొచ్చు.. కానీ మీ అందరికీ భరోసా నింపాలనే ఇక్కడి దాకా వచ్చానని రైతులతో స్పష్టం చేశారు.
రాష్ట్రంలో అన్ని రకాల పంటలు కలిపి 75 నుంచి 80 లక్షల ఎకరాలు సాగులో ఉందని.. ఒక్క వరే 56 లక్షల ఎకరాల్లో సాగవుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. వ్యవసాయంలో మంచి వృద్ధికి వచ్చామని తెలిపారు. ‘వ్యవసాయంతో కూడా జీడీపీకి లాభం ఉంటుందని కష్టపడి రుజువు చేశాం. రైతులు కూడా అప్పులు కట్టి ఇప్పుడిప్పుడే లాభపడుతున్నారు. పాత బాధలు పోయినయి. 24 గంటల కరెంట్ కానీ.. నీళ్లు కానీ.. అందుతున్నాయి. ఈ సందర్భంలో అనుకోకుండా గాళ్ల దుమారం వచ్చింది. ఈ నష్టానికి హైదరాబాద్ నుంచే ప్రకటన చేయొచ్చు.. ఇందాక ఖమ్మంలో కూడా ప్రకటించా. ఎకరానికి 3వేలు ఇస్తరు. కానీ 10వేలు ఇవ్వమని డబ్బులు సాంక్షన్ చేశా.’ అని తెలిపారు.
‘ నేను సొంతంగా రైతును కాబట్టి. మట్టిలో పుట్టినోడిని కాబట్టి.. ఇప్పటికీ వ్యవసాయం చేస్తా కాబట్టి.. ఆ బాధ నాకు తెలుసు. అందుకే వ్యవసాయాన్ని కిందికి పడనీయొద్దు. ఇంక పదెకరాలు ఎక్కువగానే పండించాలి. ముందుకెళ్లాలి కానీ ఎట్టిపరిస్థితుల్లో తెలంగాణ వెనక్కి చూడొద్దు. ఆనాడు రాష్ట్రం ఎలా సంపాదించుకున్నామో.. ఇయాళ వ్యవసాయాన్ని అలాగే పెంచుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి పోవద్దు. ఇంత ఎండలో కూడా వ్యవసాయ మంత్రి, చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర అధికారులు, జిల్లా అధికారులు నాయకులు ఇంత దూరం వచ్చింది మీకు ధైర్యం చెప్పడానికే. 10 వేలు హైదరాబాద్ నుంచే ప్రకటించొచ్చు. కానీ మీకు ధైర్యం చెప్పడానికే వచ్చాం. మునపటిలా అగో అంటే అర్నెల్లు అని.. దొంగలు పడ్డంక ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్టు కాకుండా తొందరగానే డబ్బులు అందజేస్తాం. ఇందుకోసం కలెక్టర్లు కూడా పిలుస్తారు.’ అని తెలిపారు.
కౌలు రైతులను కూడా ఆదుకోవాలని ఈ సందర్బంగా రైతులకు సీఎం కేసీఆర్ సూచించారు. పెట్టుబడి పెట్టినోళ్లు వాళ్లు కాబట్టి ప్రభుత్వం ఇచ్చే సాయంలో వాళ్లకు కూడా కొంత ఇచ్చి ఆదుకోవాలని కోరారు. దీనిపై రైతులను కౌలు రైతులను కలెక్టర్ పిలిచి మాట్లాడతారని తెలిపారు. తెలంగాణలో ఎవ్వలమైనా మంచిగ బతకాలి కానీ ఎవరూ నష్టానికి గురికావద్దని అన్నారు. రైతులంతా ధైర్యంగా ఉండాలని.. వాళ్లు ధైర్యంగా ఉంటేనే తనకు ధైర్యం అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇన్ని బాధలు వచ్చినప్పటికీ మనం ముందటికి పోవాలి తప్ప ఎట్టిపరిస్థితుల్లో ధైర్యం చెడొద్దని సూచించారు.