హైదరాబాద్, జూన్ 27(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని రైతుల ఫోన్లకు మంగళవారం ఉదయం 11 గంటల నుంచి టింగ్ టింగ్మంటూ మెసేజ్లు రానున్నాయి. రైతుబంధు సాయం డబ్బులు ఖాతాల్లో జమ కానున్నాయి. ఎప్పటిలాగే తొలిరోజు ఎకరం భూమి ఉన్న రైతులకు పెట్టుబడి పైసలు పడనున్నాయి. తర్వాత క్రమపద్ధతిలో రైతులందరికీ జమ చేయనున్నారు. ఈ ఏడాది కొత్తగా 3.64 లక్షల మంది రైతులకు కూడా రైతుబంధు సాయం అందనున్నది. గత సీజన్తో పోల్చితే లబ్ధిదారులైన రైతుల సంఖ్య భారీగా పెరగడంతో పాటు నిధుల మొత్తం కూడా పెరిగింది. ఈ వానకాలం సీజన్కు రైతుబంధుకు అర్హులైన రైతుల సంఖ్య 68.94 లక్షలుగా ప్రభుత్వం లెక్కతేల్చింది. ఈ సీజన్లో రైతుబంధు పంపిణీ కోసం రూ.7,654.43 కోట్లు అవసరమని వ్యవసాయశాఖ తెలిపింది. 1.53 కోట్ల ఎకరాలకు ప్రభుత్వం రైతుబంధు జమ చేయనున్నది. తొలిరోజైన మంగళవారం ఎకరం భూమి ఉన్న 19.98 లక్షల మంది రైతులకు రూ.586.65 కోట్లు ఖాతాల్లో జమవుతాయి.
కేంద్రం కుట్రలు ఛేదించి సాయం
సీఎం కేసీఆర్కు రైతుల ప్రయోజనాలే మొదటి ప్రాధాన్యం. రైతుల తర్వాతే ఏదైనా. ఇది మరోసారి రుజువైంది. ఈ సీజన్లో రైతుబంధు పంపిణీ చేయకుండా కేంద్రంలోని బీజేపీ సర్కారు అనేక కుట్రలు పన్నింది. రాష్ర్టానికి న్యాయంగా దక్కాల్సిన రుణాలను సమీకరించకుండా అడ్డుకొన్నది. రైతులకు పెట్టుబడి సాయం కోసం అందించే రైతుబంధుకు రుణం లభించకుండా చేసింది. అయినప్పటికీ సీఎం కేసీఆర్.. కేంద్రం కుట్రలను ఛేదించారు. రైతులకు ఇబ్బంది లేకుండా రైతుబంధు సాయం అందించేందుకు నిధులను సమకూర్చారు. కేంద్రం తీరుతో రాష్ట్రం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ రైతుబంధుకు నిధులను సమకూర్చడం గమనార్హం.
సంతోషంలో రైతన్న
సీజన్ ప్రారంభం కాగానే రైతన్నలంతా రైతుబంధు సాయం కోసం ప్రభుత్వం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. వారి ఆశను వమ్ము చేయకుండా ప్రభుత్వం కూడా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం సీజన్ ప్రారంభ సమయంలోనే రైతుబంధు నిధులను అందిస్తున్నది. మంగళవారం నుంచి రైతుబంధు పైసలు జమవుతుండడంతో రైతుల్లో సంతోషం కనిపిస్తున్నది. పెట్టుబడి భారం తీరిందనే భరోసా వారిలో కనిపిస్తున్నది. గత సీజన్ వరకు రికార్డు స్థాయిలో రైతుబంధు కింద రూ. 50,448 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసింది. ఈ సీజన్లో పంపిణీ చేయబోయే రూ. 7,654.43 కోట్లతో కలిపితే ఇప్పటివరకు అందించిన సాయం రూ. 58,102 కోట్లకు చేరనున్నది.
జాబితాలోకి 1.5 లక్షల ఎకరాల భూమి
గత సీజన్తో పోల్చితే ఈసారి 3.64 లక్షల మందికి పైగా కొత్తగా రైతుబంధు అందనున్నది. సుమారు 1.5 లక్షల ఎకరాల భూమి కొత్తగా జాబితాలో చేరింది. భూముల క్రయవిక్రయాలు, బదలాయింపు, కోర్టు కేసుల పరిష్కారాలు, వివాదంలోని పార్ట్-బీ జాబితాలోని భూ సమస్యల పరిష్కారం వంటి కారణాలతో రైతుల సంఖ్యతో పాటు భూమి కూడా పెరిగింది. గత యాసంగిలో సుమారు 63 లక్షల మంది రైతులకు చెందిన 1.48 కోట్ల ఎకరాలకు రూ.7,411.52 కోట్లు అందింది. ఇందులో 1.71 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతా వివరాలు అందుబాటులో లేవు. మరో 1.70 లక్షల మంది రైతులు రైతుబంధు నిధులను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు. 96 లక్షల ఎకరాల ఆర్వోఎఫ్ఆర్ భూములకు కూడా రైతుబంధు సాయం అందనున్నది.
కేంద్రం కుట్రలు దాటి రైతుబంధు పంపిణీ
కేంద్రప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు సృష్టించినా వాటన్నింటినీ దాటుకొని రైతుల కోసం సీఎం కేసీఆర్ రైతుబంధు నిధులను మంజూరు చేశారు. రైతులపై సీఎం కేసీఆర్కు గల ప్రేమకు ఇది నిదర్శనం. రైతుబంధు వార్తతో రైతుల్లో సంతోషం నెలకొన్నది. ఈ సీజన్లో సమృద్ధిగా పంటలు పండి రైతులు సంతోషంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా.
–నిరంజన్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి
పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం నుంచి రైతుబంధు పంపిణీకి వ్యవసాయశాఖ తరుపున ఏర్పాట్లు పూర్తిచేశాం. ఉదయం పూటే రైతుల ఖాతాల్లో రైతుబంధు పైసలు జమయ్యేలా చర్యలు తీసుకొన్నాం. రైతులకు ఏమైనా సమస్యలుంటే స్థానిక ఏఈవోను కలిసి ఫిర్యాదు చేస్తే సమస్యలను పరిష్కరిస్తాం.
–రఘునందన్రావు, వ్యవసాయశాఖ కార్యదర్శి