హైదరాబాద్: అడవి బిడ్డల హక్కుల పోరాట యోధుడు, కుమ్రం భీం ఆశయ సాధనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. “మా గూడెం, మా తాండాలో మా రాజ్యం” అనే ఆదివాసీల తరతరాల ఆకాంక్షను తెలంగాణ ప్రభుత్వం నిజం చేసిందని ఆయన చెప్పారు.
ఆదివాసీల ఆరాధ్య దైవం కుమ్రం భీం జయంతి సందర్భంగా కుమ్రం భీం సేవలను స్మరించుకున్న సీఎం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఆదివాసీల అభివృద్ది, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని ఈ సందర్భంగా కేసీఆర్ తెలిపారు.
కుమ్రం భీం జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. అమరుడు కుమ్రం భీం పోరాట ప్రదేశం జోడేఘాట్ను అన్ని హంగులతో అభివృద్ది పరిచామని చెప్పారు. కుమ్రం భీం స్మారక చిహ్నం, స్మృతి వనం, గిరిజన మ్యూజియం ఏర్పాటు చేసి, భీం పోరాట పటిమను భవిష్యత్ తరాలకు తెలియపరిచే విధంగా, అన్ని మౌలిక వసతులను జోడెఘాట్లో కల్పించామన్నారు.
హైదరాబాద్ నడిబొడ్డున ఆదివాసీల ఆత్మగౌరవాన్ని తెలిపేలా ఆదివాసీ భవన్ నిర్మాణం చేపట్టినామని, అది ప్రారంభోత్సవానికి సిద్దమైంది అని సీఎం వెల్లడించారు. ‘జల్ జంగల్ జమీన్’ అనే కుమ్రం భీం నినాదంలోని స్ఫూర్తి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ, స్వరాష్ట్ర అభివృద్ధి పథంలోనూ ఇమిడి ఉందని తెలిపారు.
అడవులు, ప్రకృతి పట్ల ఆదివాసీ బిడ్డలకు వుండే ప్రేమ గొప్పదని, వారి స్ఫూర్తిని ప్రతీ ఒక్కరూ కలిగి వుండాలని సీఎం ఆకాంక్షించారు.