CM KCR | ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గురువారం కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన వర్షాలకు భారీగా పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే. పర్యటనలో వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించడంతో పాటు రైతులను పరామర్శించనున్నారు.
పర్యటనలో భాగంగా గురువారం మధ్యాహ్నం 12గంటలకు ఖమ్మం నుంచి హెలీకాప్టర్ ద్వారా మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం రెడ్డికుంటతండాకు చేరుకొని చేరుకొని అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను స్వయంగా పరిశీలిస్తారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. అక్కడే బాధితులతో మాట్లాడుతారని చెప్పారు. రెడ్డికుంట తండా నుంచి హెలీకాప్టర్ ద్వారా వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం, అడవి రంగాపురానికి చేరుకుని అకాలవర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి, బాధితులను ఓదారుస్తారని మంత్రి తెలిపారు.
ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, పోలీస్, వ్యవసాయ అధికారులు, సంబంధిత ఇతరశాఖల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మేల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరవుతారని మంత్రి వివరించారు.