హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లి ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచార పర్వానికి ముగింపుపడుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నేడు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు నియోజకవర్గాలతోపాటు గజ్వేల్లో ప్రజా ఆశీర్వాద సభలు (Praja Ashirvada sabha) నిర్వహించనున్నారు.
మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీ మైదానంలో (KMC) ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరవుతారు. వరంగల్ పట్టణంలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల బీఆర్ఎస్ అభ్యర్థులు దాస్యం వినయ్ భాస్కర్, నన్నపునేని నరేందర్ తరఫున ప్రచారం నిర్వహిస్తారు. అనంతరం గజ్వేల్ బయల్దేరుతారు. అక్కడ నిర్వహిచనున్న ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని ముగించనున్నారు. దీంతో హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారం నిర్వహించినట్లవుతుంది. ఈ నెల 30న ఎన్నికల పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడుతాయి.