హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకున్నది. మరో రెండు రోజుల్లో ప్రచార సందడి ముగియనుంది. ఇప్పటికే విపక్షాల కంటే ఎన్నికల ప్రచారంలో ముందున్న బీఆర్ఎస్ (BRS) మరింత దూకుడు పెంచింది. ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు (CM KCR) పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్, మంత్రి హరీశ్ రావు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం సీఎం కేసీఆర్ నాలుగు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు (Praja Ashirvada Sabha) నిర్వహించనున్నారు. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, వేములవాడ, సిద్దిపేట జిల్లాలోని దుబ్బాకలో నేడు పర్యటించనున్నారు.
తొలుత ఖానాపూర్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ అధినేత హాజరవుతారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఖానాపూర్లో బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ విజయం కోసం ప్రచారం చేస్తారు. అనంతరం జగిత్యాలకు చేరుకుంటారు. జిల్లా కేంద్రంలోని గీతా విద్యాలయం గ్రౌండ్లో నిర్వహించనున్న ప్రజా ఆశ్వీరాద సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభ అనంతరం వేములవాడ బయల్దేరుతారు. 3 గంటలకు వేములవాడ కోర్టు సమీపంలోని మైదానంలో ప్రజా ఆశ్వీరాద సభలో పాల్గొంటారు. బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావుకు మద్దతుగా ప్రచారం చేస్తారు. చివరగా సాయంత్రం 4 గంటలకు దుబ్బాక నియోజకవర్గంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొంటారు.