హైదరాబాద్, ఖమ్మం జనవరి 16 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ రెండో విడత శిబిరాల నిర్వహణపై ముందస్తు సమాచారం ప్రజలకు తెలియజేయాలని, ఇందుకు ప్రతి ఇంటికి ఆహ్వాన పత్రికను అందించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ఈ నెల 18న ఖమ్మంలో సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. 19న ఉదయం 9 గంటలకు జిల్లా ల్లో కంటి వెలుగు శిబిరాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
నాలుగు నెలల వరకు ఈ శిబిరాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. జిల్లాల్లో మంత్రు లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు వారివారి పరిధి లో కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించారు. కంటివెలుగు నిర్వహణ ఏర్పాట్లపై సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, వైద్య, ఇతర శాఖల అధికారులతో మంత్రి హరీశ్రావు ఖమ్మం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కంటి వెలుగును విజయవంతం చేయాలని సూచించారు. ఇందులో పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, ఆర్పీలు, వీఆర్ఏలను భాగస్వామ్యం చేయాలని తెలిపారు. శిబిరాలకు అందరూ ఒకేసారి రాకుండా ఉదయం, మధ్యాహ్న సమయాల్లో వచ్చేలా షెడ్యూల్ రూపొందించాలని స్పష్టం చేశారు.
ఆధార్కార్డు వెంట తెచ్చుకోవాలి
కంటి పరీక్షల కోసం వచ్చేవారు తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకొచ్చేలా అవగాహన కల్పించాలని మంత్రి హరీశ్రావు సూచించారు. జిల్లాల్లో కలెక్టర్, డీఎంహెచ్వోలు.. ప్రతి బృందం సకాలంలో క్యాంపులు ప్రారంభించేలా వాట్సాప్ ద్వారా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎంపీవోలు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మండల ప్రత్యేక అధికారులు రోజూ క్యాంపులను తనిఖీ చేయాలని చెప్పారు.
వైద్య బృందాలు సమీప పట్టణాలు, మండల కేంద్రాల్లో రాత్రి బస చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. బృందాలు పావుగంట ముందుగా ఉదయం 8:45 గంటలకే శిబిరానికి చేరుకోవాలని స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు తగిన భద్రత కల్పించాలని తెలిపారు. సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, కంటి వెలుగు నిర్వహణ కోసం 15 వేల మంది సిబ్బందిని నియమించినట్టు చెప్పారు. కంటి పరీక్షలకు కావలసిన ఏఆర్ యంత్రాలు, కండ్లద్దాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. వైద్య శిబిరాలకు హాజరయ్యే వారికి నాణ్యమైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
2018లో నిర్వహించిన కంటి వెలుగు మొదటి దశ రికార్డును సాధించిందని, దానిని అధిగమించేందుకు కృషి చేయాలని సూచించారు. డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ, శిబిరాలు రద్దీగా ఉండకుండా, స్రీనింగ్ సజావుగా జరిగేలా ఆరోగ్య, పోలీస్ శాఖల మధ్య సమన్వయం అవసరమని అభిప్రాయపడ్డారు. కార్యక్రమ నిర్వహణపై ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. క్యాంపు ఏర్పాట్లు, లాజిస్టిక్స్, వనరుల సమీకరణ తదితర అంశాలను వివరించారు. కార్యక్రమంలో ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, హెల్త్ సెక్రటరీ రిజ్వీ, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, డీఎంహెచ్వో బీ మాలతి తదితరులు పాల్గొన్నారు.