హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్లో బుద్ధవనం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నిర్మాణం పూర్తి చేశామని, కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిన వెంటనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు. రవీంద్రభారతిలోని పర్యాటక, సాంస్కృతిక మంత్రి కార్యాలయంలో బుధవారం గౌతమ బుద్ధుని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ టూరిజం, బుద్ధవనం ప్రాజెక్టు ఆధ్వర్యంలో జూమ్ యాప్ ద్వారా నిర్వహించిన వెబినార్లో మంత్రి బౌద్ధ భిక్షువులతో మాట్లాడారు. బుద్ధవనం ప్రాజెక్టుకు అనుబంధంగా అంతర్జాతీయ స్థాయి బుద్ధిజం ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయ ఏర్పాటుకు కృషిచేస్తున్నామన్నారు. బౌద్ధక్షేత్రాలైన కోటిలింగాల, నేలకొండపల్లి, ధూళికట్ట, ఫణిగిరిల్ల్లో బుద్ధిజం ఆనవాళ్ల పరిరక్షణకు చర్యలు చేపట్టామన్నారు. సమావేశంలో పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లెపల్లి లక్షయ్య, టూరిజం చైర్మన్ శ్రీనివాస్గుప్తా, ఎండీ మనోహర్, సాంస్కృతికశాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.