హైదరాబాద్: సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ప్రగతిభవన్లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానున్నది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో లోక్సభ, రాజ్యసభల్లో టీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారుచేయనున్నారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన, కేంద్రం నుంచి సాధించాల్సిన పలు అంశాలపై ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్ర హక్కులను సాధించుకొనేందుకు అనుసరించాల్సిన పోరాటపంథాపై సూచనలు ఇవ్వనున్నారు.
రాష్ట్ర విభజన హామీలను అమలుచేయకుండా కేంద్రం నాన్చుడు ధోరణిని ప్రదర్శిస్తున్నది. ఈ అంశాలపై పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాన్ని సీఎం కేసీఆర్ వివరిస్తారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో విద్యుత్తు చట్ట సవరణ బిల్లును ఒకవేళ దొడ్డిదారిన తీసుకొస్తే ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న అంశంపై కూడా సీఎం కేసీఆర్ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తారు.