Telangana | కొండలను తొలుచుకొని.. సొరంగాలను ఈది.. గుట్టలను ఎగబాకి మైదానాల్లోకి బిరాబిరా పారేందుకు కృష్ణమ్మ సిద్ధమవుతున్నది. దశాబ్దాల కలను సాకారం చేస్తూ.. ఫ్లోరైడ్ బాధిత పల్లెవాసుల గొంతు తడిపి మురిసిపోవాలని ఉవ్విళ్లూరుతున్నది. నీటి చుక్కకోసం అల్లాడిన తల్లుల కాళ్లు కడిగి కష్టాలు మరిపించేందుకు సన్నద్ధమవుతున్నది. అపర భగీరథుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాశమంత సంకల్పం వాస్తవరూపం దాల్చుతున్నది. 16 నియోజకవర్గాల ప్రజలకు అతి త్వరలో జలకళ రానున్నది. 1,226 గ్రామాల్లో కుంటలు, చెరువులను ఏకం చేసి ప్రజల దాహార్తిని తీర్చేందుకు బిరబిరా కృష్ణమ్మ పరుగులిడేందుకు సిద్ధమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొదటి దశ తాగునీటి పనులు జోరందుకున్నాయి. జూలై మాసాంతానికి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు శ్రమిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ( ( Palamuru Rangareddy Lift Irrigation Scheme )పై ‘నమస్తే తెలంగాణ’ గ్రౌండ్ రిపోర్టు.
హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలో 12.30 లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు, తాగునీటిని అందించాలనే లక్ష్యంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (పీఆర్ఎల్ఐఎస్) రూ.35 వేల కోట్ల అంచనా వ్యయంతో 2015లో శ్రీకారం చుట్టింది. మొదటి దశలో తాగునీటికి సంబంధించిన పనులను, రెండో దశలో సాగునీటికి సంబంధించిన పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకొన్నది. ఇప్పటికే మొదటి దశలో చేపట్టిన తాగునీటి సరఫరాకు సంబంధించిన పనులను నాగర్కర్నూలు జిల్లా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి మొత్తం 21 ప్యాకేజీలుగా విభజించగా, కేపీ లక్ష్మీదేవిపల్లి మినహాయించి ప్రస్తుతం 18 ప్యాకేజీల పనులను ప్రభుత్వం చేపట్టింది. ఆ ఆయా ప్యాకేజీల పనులన్నీ దాదాపు తుదిదశకు చేరుకొన్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్దేశిత గడువులోగా మొదటి దశ పనులు పూర్తిచేసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. అప్రోచ్ చానళ్లు, పంప్హౌస్లు, సర్జ్పూల్స్, సొరంగాలు, రిజర్వాయర్లు, కాలువల నిర్మాణ పనులతోపాటు సబ్ స్టేషన్ల నిర్మాణం చకచకా సాగుతున్నాయి.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొత్తం లో సొరంగాలు అద్భుతమనే చెప్పాలి. రిజర్వాయర్లు, 50 కిలోమీటర్ల మేర ఓపెన్ కాలువలు, డెలివరీ సిస్టర్న్లు, సబ్స్టేషన్లు మినహా ప్రాజెక్టులోని మిగతా నిర్మాణాలన్నీ భూగర్భంలోనే ఉండడం విశేషం. ఒక్కో సర్జ్పూల్ సగటు లోతు 74 మీటర్లు కాగా, పొడవు పావు కిలోమీటరుకుపైగా పొడవుతో ఉన్నా యి. రిజర్వాయర్లను కలిపే ప్రధాన కాలువలు దాదాపు 62.21 కిలోమీటర్ల మేరకు టన్నెల్ ద్వారానే పారుతుంటాయి. పంప్హౌజ్లలోని మోటర్ల వద్దకు చేరుకోవాలంటే భూ ఉపరితలం నుంచి సగటును కిలోమీటర్ మేరకు సొరంగాల ద్వారా ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక ఏదుల వద్ద భూగర్భంలో నిర్మిస్తున్న సర్జ్పూల్ (కెవిన్) వెడల్పు 31 మీటర్లు, పొడవు 360 మీటర్లు. ఇది ఆసియాలోనే అతిపెద్ద కెవిన్గా రికార్డులకెక్కుతుందని అధికారులు అంటున్నారు.
మొదటి దశ పనులు పూర్తయితే మొత్తం గా 16 నియోజకవర్గాలకు తాగునీరు అందుతుంది. నాగర్కర్నూల్, మహబూబ్నగర్, కొడంగల్, నారాయణపేట, మక్తల్, దేవరకద్ర, జడ్చర్ల, కల్వకుర్తి, అచ్చంపేట, పరిగి, వికారాబాద్, తాండూర్, చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లోని 70 మండలాల్లో 1,546 నీటి కుంటలు, చెరువులను నింపనున్నారు. తద్వారా 1,226 గ్రామాలకు తాగునీరు అందనున్నది. అందులో ఫ్లోరైడ్ బాధిత గ్రామాలు కూడా ఉన్నాయి.
గుట్టలను కలుపుతూ మట్టి కట్టలతో నాడు కాకతీయులు చెరువులను నిర్మించిన తరహాలోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో చేపట్టిన జలాశయాలన్నీ నిర్మించడం విశేషం. ఆయా రిజర్వాయర్లకు స్థానికంగా గుట్టలపై కొలువైన దేవుళ్ల పేర్లనే పెట్టడం మరోవిశేషం. ఇప్పటికే అంజనగిరి 8.51 టీఎంసీలు (నార్లాపూర్), వీరాంజనేయ 6.55 టీఎంసీలు (ఏదుల), వెంకటాద్రి 16.74 టీఎంసీలు (వట్టెం), కురుమూర్తి రాయ 17.34 టీంఎసీలు (కరివెన), ఉద్దండాపూర్ 16.03 టీఎంసీల సామర్థ్యంలో రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టారు. అందులో వీరాంజనేయ రిజర్వాయర్ పూర్తికాగా, మిగతా రిజర్వాయర్లకు సంబంధించి మట్టి పనులన్నీ పూర్తయ్యాయి. రివట్మెంట్ పనులు తుదిదశకు చేరుకొన్నాయి. అదీగాక అంజనగిరి, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా నిర్మించిన ఎల్లూర్ రిజర్వాయర్ ప్రస్తుతం జంట జలాశయాలుగా మారిపోయాయి. రెండింటినీ అనుసంధానం చేశారు. 338ఎఫ్ఆర్ఎల్ వద్ద రెండు జలాశయాలు సమంగా ఉండనున్నాయి. అక్కడ ఇప్పటికే మిషన్భగీరథ పనులు కూడా పూర్తయ్యాయి.
శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ను 2 కిలోమీటర్ల అప్రోచ్ చానల్ ద్వారా తొలుత హెడ్ రెగ్యులేటర్కు, అక్కడి నుంచి 3 సొరంగాల ద్వారా నార్లాపూర్ సర్జ్పూల్కు తరలిస్తారు. అక్కడి నుంచి 8 పంపుల ద్వారా 104 మీటర్ల ఎత్తున ఉన్న అంజనగిరి రిజర్వాయర్లోకి ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి ఓపెన్ కెనాల్, సొరంగ మార్గం ద్వారా ఏదుల పంప్హౌజ్ జలాలను తరలిస్తారు. అక్కడ 9 మోటార్ల ద్వారా 124 మీటర్ల ఎత్తున ఉన్న వీరాంజనేయ రిజర్వాయర్కు తరలిస్తారు. అక్కడి నుంచి ఓపెన్ సొరంగాల ద్వారా నీటిని వట్టెం పంప్హౌజ్కు తరలిస్తారు. అక్కడి నుంచి 9 మోటర్ల ద్వారా 121 మీటర్లపైకి వెంకటాద్రి రిజర్వాయర్లోకి జలాలను తరలిస్తారు. అటు నుంచి 14 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ద్వారా జలాలను కురుమూర్తి రిజర్వాయర్కు తీసుకెళ్తారు. కురుమూర్తి రిజర్వాయర్ నుంచి 8.5 కిలోమీటర్ల దూరం నిర్మించిన సొరంగాల ద్వారా జలాలను ఉద్దండాపూర్ సర్జ్పూల్కు తరలిస్తారు. అక్కడ 5 మోటర్ల ద్వారా 122 మీటర్లపై జలాలను ఎత్తి ఉద్దండాపూర్ రిజర్వాయర్లోకి ప్రస్తుతానికి తరలిస్తారు.
తాగునీటికి కేటాయించిన జలాలు : 7.15 టీఎంసీలు
లబ్ధి చేకూరే నియోజకవర్గాలు : 16
మండలాలు :70
గ్రామాలు : 1,226
నింపనున్న చెరువులు : 1,546
ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక సామర్థ్యం గల పంపులను కాళేశ్వరం ప్రాజెక్టులో వినియోగిస్తుండగా, ఆ రికార్డును పాలమూరు రంగారెడ్డి పథకం బద్దలు కొట్టనున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో రామడుగు (గాయత్రి) పంప్హౌజ్లో 139 మెగావాట్ల కెపాసిటీ గల మోటర్లను వినియోగించడమే ఇప్పటివరకు అత్యధికం. వాటిని బాహుబలి మోటర్లుగా పిలుస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అంతకు మించి ఏకంగా 145 మెగావాట్ల సామర్థ్యం గల మోటర్లను వినియోగిస్తుండటం విశేషం. నార్లాపూర్ నుంచి ఉద్దండాపూర్వరకు మొత్తంగా 34మోటర్లను బిగిస్తున్నారు. ఈ మోటర్లన్నింటినీ ప్రఖ్యాత ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ తయారుచేసింది. పంప్హౌజ్లకు విద్యుత్తును సరఫరా చేసేందుకు మూడు 400/11 కేవీ సబ్స్టేషన్లను నిర్మిస్తున్నారు. అందులో ఒకటి ఇప్పటికే పూర్తికాగా, మరో రెండు చోట్ల నిర్మాణ పనులు వేగం పుంజుకొన్నాయి. ట్రాన్స్మిషన్ పనులు కొనసాగుతున్నాయి.
పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే రిజర్వాయర్ల నిర్మాణం పూర్తయింది. ఏదుల, వట్టెం పంప్హౌజ్ల నిర్మాణం, 4 చొప్పున మోటర్ల బిగింపు పూర్తయింది. నార్లాపూర్ పంప్హౌజ్ నిర్మాణం పూర్తికాగా మోటర్ల బిగింపు ఇటీవలనే ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం.
– నాగర్కర్నూల్ చీఫ్ ఇంజినీర్ హమీద్ ఖాన్
ప్యాకేజీ -1: శ్రీశైలం రిజర్వాయర్లో 2 కిలోమీటర్ల అప్రోచ్ చానల్, 8 గేట్లతో హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం పూర్తయింది. అక్కడి నుంచి 885 మీటర్ల పొడవుతో 9.2 మీటర్ల వ్యాసార్థ్యంతో మూడు మహా సొరంగాలు నిర్మించారు. సర్జ్పూల్ నిర్మాణం పూర్తికాగా, లైనింగ్ పనులు కొనసాగుతున్నది. 355 మీటర్ల పొడవుతో పంప్హౌస్ నిర్మాణం పూర్తయింది. 145 మెగావాట్ల సామర్థ్యం గల మొత్తం 8+1 మోటర్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా, ప్రస్తుతం తాగునీటికి సంబంధించి 2 మోటర్ల బిగింపు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కిలోమీటర్ మేర ప్రెషర్ మెయిన్ పైప్లైన్ నిర్మాణం పూర్తికాగా, అంజనగిరి రిజర్వాయర్ వద్ద డెలివరీ సిస్టర్న్ పనులు చురుగ్గా సాగుతున్నాయి.
ప్యాకేజీ -2: అంజనగిరి రిజర్వాయర్ నిర్మాణం దాదాపు పూర్తయింది. మూడు రీచ్లలో 268 లక్షల క్యూబిక్ మీటర్ల పనికి గాను 264 క్యూబిక్ మీటర్ల మట్టిపని పూర్తయింది. కాంక్రీట్ పనులు తుది దశకు చేరుకొన్నాయి.
ప్యాకేజీ -3, 4: అంజనగిరి రిజర్వాయర్ నుంచి 8.35 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్ నిర్మాణం పూర్తయింది. 11.5 మీటర్ల వ్యాసార్థంతో రెండు సొరంగాలను 15 కిలోమీటర్ల పొడవు నిర్మించారు. లైనింగ్ పనులు సాగుతున్నాయి.
ప్యాకేజీ -5: ఏదుల పంప్హౌజ్, సర్జ్పూల్ నిర్మాణం పూర్తయింది. 145 మెగావాట్ల సామర్థ్యంగల 9+1 మోటర్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా, అందులో 2 మోటర్ల బిగింపు పూర్తయి డ్రై రన్కు సిద్ధమయ్యాయి. మరో 2 మోటర్ల బిగింపు పనులు కొనసాగుతున్నాయి.
ప్యాకేజీ -6, 7: వీరాంజనేయ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయింది. జలాశయం నుంచి 6.4 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్, 11.5 డయాతో 19 కిలోమీటర్ల పొడవుతో 2 సొరంగాల తవ్వకం పనులు కూడా పూర్తయ్యాయి.
ప్యాకేజీ -8: వట్టెం పంప్హౌజ్ నిర్మాణం పూర్తయింది. 145 మెగావాట్ల సామర్థ్యంతో 9+1 మోటర్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా 4 మోటర్ల బిగింపుతోపాటు డెలివరీ సిస్టర్న్ పనులు కూడా పూర్తయ్యాయి.
ప్యాకేజీ -9, 10, 11:వెంకటాద్రి రిజర్వాయర్ నిర్మాణం 98% పూర్తి.
ప్యాకేజీ -12: వెంకటాద్రి రిజర్వాయర్ నుంచి కురుమూర్తి రిజర్వాయర్కు నిర్మించాల్సిన 14 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ పనులు దాదాపు 88 శాతం పూర్తయ్యాయి.
ప్యాకేజీ -13, 14, 15:కురుమూర్తి రాయ రిజర్వాయర్ను మూడు రీచ్లుగా విభజించగా, ఒక రీచ్ పూర్తయింది. మరో రెండు రీచ్లు 90 శాతం పూర్తయ్యాయి.
ప్యాకేజీ -16: కురుమూర్తి నుంచి ఉద్దండాపూర్ రిజర్వాయర్కు కిలోమీటర్ల పొడవుతో 8.5 డయాతో 2 సొరంగాల నిర్మాణం పూర్తయింది. పంప్హౌజ్ నిర్మాణం పూర్తయింది. సర్జ్పూల్ తవ్వకం పూర్తికాగా, కాంక్రీట్ పనులు కొనసాగుతున్నాయి. 145 మెగావాట్ల సామర్థ్యంతో 5 పంపుల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి.
ప్యాకేజీ -17, 18: ఉద్దండాపూర్ రిజర్వాయర్ నిర్మాణాన్ని రెండు రీచ్లుగా చేపట్టారు. ఒక రీచ్ 80 శాతం, మరో రీచ్ 60% పూర్తి.
– (మ్యాకం రవికుమార్)