జనగామ : జనగామ కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ జోనల్ వ్యవస్థ గురించి ప్రస్తావించారు. మారుమూల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో జోనల్ వ్యవస్థను తెచ్చుకున్నాం అని సీఎం స్పష్టం చేశారు. మారుమూల ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో పని చేసే ఉద్యోగులకు కావాలంటే అలవెన్సు ఇవ్వండి అని సీఎస్ సోమేశ్ కుమార్కు సీఎం కేసీఆర్ సూచించారు.
తమ ప్రాంతాలు అభివృద్ధి కావాలని ప్రజాప్రతినిధులు కోరుకుంటారు. భూపాలపల్లి జిల్లా చేయాలనుకుంటున్నాం అని ఛత్తీస్గఢ్కు చెందిన మాజీ సీఎస్తో మాట్లాడాను. ఆ జిల్లా పరిధిలో రెండే నియోజకవర్గాలు ఉన్నాయని చెప్తే.. వైశాల్యం ఎంత ఉంటుందని అడిగారు. భూపాలపల్లి, ములుగు జిల్లాలను కలిపితే.. 9 నియోజకవర్గాలు ఉన్న ఉమ్మడి నిజామాబాద్ కంటే భౌగోళికంగా భూపాలపల్లే పెద్ద జిల్లా. ఇది నాలుగు రాష్ట్రాల మధ్య ఉంది. అడవిలో ఉన్న ఆ జిల్లాకు కలెక్టర్, ఎస్పీ, ఉద్యోగులు వెళ్లి వెలుతురు తేవాలని ఆకాంక్షించాం. గిరిజన బిడ్డలు బాగుపడాలని అనుకున్నాం. ఛత్తీస్గఢ్ మాజీ సీఎస్ సూచన మేరకు వెంటనే భూపాలపల్లిని జిల్లా చేశాం. ఇక వెంటనే ములుగును కూడా జిల్లాగా ఏర్పాటు చేయాలన్నారు. వెంటనే ఛత్తీస్గఢ్కు చెందిన అదే పెద్ద మనిషిని అడిగాను. ఆయన కూడా చేయమని చెప్పారు. తర్వాత ములుగును కూడా జిల్లాగా ఏర్పాటు చేసుకున్నాం. ఈ మారుమూల ప్రాంతాలకు ఎవరూ వెళ్లరు. అమెరికా నుంచి వచ్చి అభివృద్ధి చేస్తారా? అని కేసీఆర్ ప్రశ్నించారు.
తెలంగాణ పౌరుల తలసరి ఆదాయం రూ. 2 లక్షల 70 వేలు కాబోతుందన్నారు. ఏపీది లక్షా 70 వేలు మాత్రమే ఉందన్నారు. ఎవరూ ఊహించనటువంటి పనులు మనం చేసుకున్నాం. మారుమూల ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో పని చేసే ఉద్యోగులకు అలవెన్సు కావాలంటే ఇవ్వండి. మేడ్చల్, జనగామ, హైదరాబాద్ లాగే భూపాలపల్లి, ములుగు, గద్వాల, దేవరకొండ ప్రాంతాలు డెవలప్ కావాలి. యావత్ తెలంగాణ అద్భుతమైన పద్ధతుల్లో ముందుకు పోవాలి. తెలంగాణ ధనిక రాష్ట్రం. బాధ్యత లేనోడు మాట్లాడితే పట్టించుకోవద్దు. ఎన్ని అద్భుతాలు జరుగుతాయో తనకు తెలుసని కేసీఆర్ అన్నారు.