CM KCR | సూర్యాపేట : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం పూర్తయితే నల్లగొండ, సూర్యాపేట జిల్లాల రూపురేఖలు మారిపోతాయని సీఎం కేసీఆర్ అన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని, మంత్రి జగదీశ్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు.
జగదీశ్ రెడ్డి నాతో పాటు ఉద్యమకారుడు. 2001లో పిడికెడు మందిమి ఉంటిమి. పిడికెడు మందిలో ఆయన ఒకడు. ఉద్యమం స్టార్ చేసి కాంప్రమైజ్ కాకుండా, ఏ ప్రలోభానికి లోను కాకుండా తెలంగాణ ఉద్యమాన్ని నడిపాం. చివరకి ఏం దశ వచ్చింది. కాంగ్రెస్ డోఖా చేసింది. చివరకు నాకు తిక్కరేగి కేసీఆర్ శవయాత్రనా..? తెలంగాణ జైత్రయాత్రనా..? తేలాలని చెప్పి ఆమరణ దీక్షకు కూర్చొంటే అప్పుడు ప్రకటన చేశారు. అప్పుడన్న ఇచ్చారంటే ఇవ్వలేదు. మళ్లీ సకల జనుల సమ్మె, మీరంతా ఉప్పెనలాగా ఉద్యమం చేస్తే, 33 పార్టీలు మనకు మద్దతిస్తే అప్పుడు దిగొచ్చారు. ఇన్నిసార్లు డోఖా చేసి, ఇంత ఏడుపు ఏడిపించి, సాగు, మంచినీళ్లకు, కరెంట్కు ప్రతిదానికి బాధలు పెట్టి, రైతాంగాన్ని అప్పుల పాలు చేసినటటువంటి కాంగ్రెస్సా..? పదేండ్ల స్వల్ప కాలంలో ఇన్ని మంచి పనులు చేసిన బీఆర్ఎస్సా..? అధికారంలో ఉండాల్సింది.. దయచేసి ఆలోచించాలి అని కేసీఆర్ సూచించారు.
ఈ జిల్లాలో ఎంత మంది మంత్రులు కాలేదు..? జగదీశ్ రెడ్డి చేసిన పని ఒక్క మంత్రన్న చేసిండా..? దక్షిణ తెలంగాణలో మెగా పవర్ స్టేషన్ పెట్టాలంటే నల్లగొండలో పెట్టాలని కోరిండు. కృష్ణా నది ఒడ్డున జాగ చూసి 30 వేల కోట్లతో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణం అవుతోంది. నల్లగొండ, సూర్యాపేట జిల్లా రూపరేఖలు మారిపోతాయి. ఆర్థిక శక్తి పెరుగుతది అని కేసీఆర్ తెలిపారు.
ఇప్పుడిప్పుడే తెలంగాణ ఒక దరిన పడుతున్నది. కాంగ్రెస్ వస్తే పదేండ్లు మేం చేసిన కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతది. ఈ కాంగ్రెస్ నాయకులు ఎంత దద్దమ్మలంటే..? వట్టిగా గడబిడ చెడమాడ మాటలు మాట్లాడి పొద్దునోటి సాయంత్రంవోటి మాట్లాడి గోల్ మాల్ చేయడం తప్ప ఎప్పుడన్న వీరు ప్రజల బాధలు పట్టించుకున్నారా.? ఒకప్పుడు నల్లగొండ జిల్లాకు వస్తే లక్షల ఎకరాల్లో ఎక్కడ చూసిన ఆముదం పంటలు కనిపించేవి. ఇవాళ ఎక్కడ చూసిన బ్రహ్మాండమైన వరి చేన్లు, వరి కుప్పలు కనబడుతున్నాయి. మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిస్తున్నారు. ఇంతకు ముందు ఏమన్నరు. మీ తెలంగాణలో వడ్లు పండవు. మీది కరువు ప్రాంతం, వెనుకబడ్డ ప్రాంతం, మీరు జొన్నలు, సజ్జలు పండించుకోవాలి. మీకు అదే బతుకు అని చెప్పారు. 50 ఏండ్ల కాంగ్రెస్ రాజ్యంలో అదే దారి. ఈ జిల్లాలో ఉన్న ఒక్క కాంగ్రెస్ నాయకుడు నోరు తెరవలేదు. కొట్లాడలేదు. మా నీళ్లు ఏవి అని అడగలేదు. అడిగితే ఈ దుస్థితి ఉండేది కాదు. ఈ దద్దమ్మలు 50 ఏండ్లు మనల్ని ఎండబెట్టారు. ఇవాళ పదేండ్ల స్వల్పకాలంలో కరెంట్ మంచి చేశాం. మంచి నీళ్లు తెచ్చాం. సంక్షేమం చేస్తున్నాం. లక్షల ఎకరాల్లో పంటలు పండే నీళ్లు తెచ్చాం. దయచేసి ఆగమాగం కావొద్దు. ఆలోచించి ఓటు వేయాలని మనవి చేస్తున్న అని కేసీఆర్ కోరారు.
ఇవాళ పుల్లారెడ్డి చెరువు, నల్ల చెరువు, సద్దుల చెరువు ఎంత మంచిగా అయ్యాయి. నేనే ఆశ్చర్యపోయాను మొన్న సూర్యాపేటలో కట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ హైదరాబాద్లో మల్టీప్లెక్స్ ఉన్నట్టు ఉన్నది. గతంలో కాంగ్రెస్ హయాంలో కాలవెట్టుకుందామంటే జాగ లేదు. ఇవాళ గ్రామాలు బాగుపడ్డాయి. పచ్చదనం పెరిగింది. పరిశుభ్రంగా ఉన్నాయి. లక్షల కిలోమీటర్ల సీసీరోడ్లు వేసినం. ఎన్నికలంటే ఆగమాగమై ఓట్లు వేయొద్దు. ఇవన్నీ గమనంలోకి తీసుకొని ఓటు వేయాలి. సూర్యాపేట మరింత బాగుపడాలంటే ఈ దరిద్రం కాంగ్రెస్ను గంగల పారేయాలి. కచ్చితంగా బీఆర్ఎస్సోళ్లను గెలిపించాలి. 12కు 12 సీట్లు గెలిపించాలి. డబ్బు కట్టల మదమున్నోని.. కోట్ల విలువ చేసే ఓటుతోని గుద్ది కింద పడగొట్టాలి. నల్లగొండ వ్యాప్తంగా ఈ చైతన్యం, విప్లవం రావాలి అని కేసీఆర్ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేదే లేదు మన్ను లేదు. అంత వట్టిదే గ్యాస్. 70 నియోజకవర్గాలు తిరిగి చెప్తున్నా ఈ మాట.
మళ్ల పోయినసారి కంటే ఇంకో నాలుగు సీట్లు ఎక్కువతో వందకు వంద శాతం బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. జగదీశ్ రెడ్డి మంచి స్థానంలోనే ఉంటడు. డ్రై పోర్టుతో పాటు ఆయన కోరిన పనులన్నీ చేయించే బాధ్యత నాది. కమిట్ మెంట్ ఉన్న నాయకుడిని జారవిడుచుకోవద్దు అని కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.