CM KCR | మానకొండూరు : వచ్చే ఐదేండ్లలో యుద్ధ ప్రతిపాదికన ఇండ్లు కడుదాం.. ఇల్లు లేని మనిషి లేకుండా చేసుకుందాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. మానకొండూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని రసమయి బాలకిషన్కు మద్దతుగా ప్రసంగించారు.
తెలంగాణలో కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుంది కాబట్టి.. తాలుకాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడుతాం. స్థానిక పిల్లలకు ఉద్యోగాలు, పనులు దొరుకుతాయి. ఇక ఇండ్లు లేని వారికి ఇండ్లు కట్టేది ఉంది. ఒక యుద్ధ ప్రతిపాదికన కడుదాం. డబుల్ బెడ్రూం ఇండ్లు కానీ, గృహలక్ష్మీ కానీ ఈ వచ్చే ఐదేండ్లలో ముమ్మరంగా కడుదాం. తెలంగాణలో వడ్లు ఎలా పండుతున్నాయో ఇండ్ల నిర్మాణం కూడా అట్లనే జరుతది వచ్చే ఐదేండ్లు. మనం పడితే గట్టిగ పడుతం కదా..? ఇండ్ల జాగాలు లేనోళ్లకు జాగాలు ఇప్పిద్దాం. సొంత జాగ ఉన్నోళ్లకు డబ్బులు ఇద్దాం. ఇల్లు లేని మనిషి లేకుండా చేసుకుందాం. ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్దాం అని కేసీఆర్ పేర్కొన్నారు.
మానకొండూరు నియోజకవర్గంలో మీకు నలుదిక్కులా నాలుగు రిజర్వాయర్లు ఉన్నాయి. అటు అన్నపూర్ణ, మిడ్ మానేరు, ఇటు లోయర్ మానేరు, తోటపల్లి. మిడ్ మానేరు కాలువ తోటపల్లిలో పారేస్తే 35 వేల ఎకరాలు పారుతుంది నియోజకవర్గంలో. ఇదంతా మీ కళ్ల ముందుంది. బెజ్జంకి మండలంలో ఎంత కరువు ఉండే. ఎంత దెబ్బతిన్నాం. ఎంత అవస్థ ఉండే. ఇవాళ కొంత ముఖం తెలివి అయినం. ఇంకా నీళ్లు రావాలి. ఇంకా చేసుకుందాం. ముందకు పోదాం అని పిలుపునిచ్చారు కేసీఆర్.
హుజురాబాద్లో పెట్టిన మాదిరిగానే మానకొండూరులో దళితులందరికీ ఒకేసారి ఇవ్వాలని బాలకిషన్ కోరారు. 80 వేల మెజార్టీతో గెలిపించండి.. గ్యారెంటీగా పెడుతాం. మొత్తం దళిత కుటుంబాలకు దళితబంధు ఇచ్చే బాధ్యత నాది. స్కీం సాంక్షన్ చేయడమే కాదు.. హుజురాబాద్కు పోయిన మాదిరిగానే నేనే మానకొండూరు వచ్చి అమలు చేయిస్తాను. దళిత బిడ్డలు తరతరాలుగా వివక్షకు గురయ్యారు. వెలివేయబడ్డారు, అణిచివేయబడ్డారు. నెహ్రూ ఆ రోజు దళితుల గురించి ఆలోచించి ఉంటే 75 ఏండ్ల తర్వాత ఇంత దరిద్రం ఎందుకు ఉంటుండే ఈ దళిత జాతిలో. దేశానికి ఈడికెళ్లి బుద్ది చెప్పాలని చెప్పి దళితబంధు తీసుకొచ్చిన. ఆ పథకం ఇవాళ కాంతులు నింపుతుంది దళితుల ఇండ్లలో. ఎన్నో రాష్ట్రాల నుంచి హుజరాబాద్కు వచ్చి ఆ పథకాన్ని పరిశీలిస్తున్నారు. మనం ఉదాహరణ అయ్యాం. మన స్కీంలు చాలా వరకు అట్లనే ఉన్నాయి. ఓట్లు అనగానే ఆగమాగం కాకుండా చెప్పుడు మాటలు వినకుండా, ఆలోచించి ఓటేయండి అని కేసీఆర్ సూచించారు.