హైదరాబాద్ : ఈ దేశానికి, ప్రపంచానికే దళితబంధు పథకం ఆదర్శం కాబోతోందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. దిశ దశ లేని అయోమయ పరిస్థితుల్లో ఉన్న తెలంగాణ.. ఈ రెండు దశాబ్దాల కాలంలో సుంపన్నమైన వనరులతో ఒక రాజకీయ పార్టీగా రూపుదిద్దుకున్నామని కేసీఆర్ తెలిపారు.
టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఆరేడు నెలల కాంలో దేశ రాజధానిలో మన కార్యాలయం తయారు కాబోతోంది.. గులాబీ జెండా రెపరెపలాడబోతోంది. 31 జిల్లాల్లో అద్భుతమైన కార్యాలయాలు కలిగి ఉన్నాం. ఇవన్నీ కూడా మన ఆస్తులు.. టీఆర్ఎస్ పార్టీనే తెలంగాణ ప్రజల ఆస్తి. తెలంగాణ ప్రజల కోసం అనుక్షణం కాపలాదారుగా ఉంటుంది. అనేక ఆవిష్కరణలు మనం చేసుకున్నామని సీఎం తెలిపారు.
అందరికీ సమాన అవకాశాలు ఉండాలనే స్థిరమైన నిర్ణయంతో, అవగాహనతో ఈ దేశానికే పాఠం నేర్పే బృహత్తరమైన కొత్త సిద్ధాంతానికి శ్రీకారం చుడుతున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. ఓట్ల కోసం కాకుండా.. అద్భుతమైన తెలంగాణ సమాజాన్ని సృష్టించే విధంగా దళితబంధు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం. ఇది ప్రపంచానికే, దేశానికే ఆదర్శంగా నిలవబోతుందన్నారు కేసీఆర్. ఇందులో ఎలాంటి సందేహం లేదు. దళిత బంధులో ఉన్న గొప్పదనం.. దీని ద్వారా మనం ఇచ్చే సందేశం, మనం పెట్టుకున్న లక్ష్యాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని కేసీఆర్ స్పష్టం చేశారు.
దళిత బంధులో మూడు పార్శ్వాలు ఉన్నాయి. పదిహేడున్నర లక్షల దళిత కుటుంబాలకు దశలవారీగా పది లక్షలు ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. ప్రభుత్వ లైసెన్స్లు ఇచ్చే అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నామని తెలిపారు. దళితబంధు పథకాన్ని చూసి కొంతమంది ఐఏఎస్ అధికారులు నిర్ఘాంతపోయారు. ఈ పథకం విజయవంతం కావాలి. దీంట్లో ఉన్న మరొక గొప్ప లక్ష్యం ఏంటంటే.. దళిత రక్షణ నిధి. మనం ఏ పని మొదలుపెట్టినా పట్టుదలతో, లక్ష్యశుద్ధితో పని చేస్తాం కాబట్టి.. కచ్చితంగా ఈ పథకం విజయవంతం అవుతుందన్నారు. ప్రతి గ్రామంలో ఈ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలి. అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.