హైదరాబాద్ : రాజకీయాలంటే ఒక పార్టీ ఎన్నికల్లో గెలవడం, ఓడిపోవడం కాదు. ఎన్నికల్లో ప్రజలు గెలవాలె. ప్రజా ప్రతినిధులు గెలవాలె. సరిగ్గా ఇదే పరివర్తన కోసం ఏర్పాటైందే బీఆర్ఎస్ పార్టీ. ఎన్నో విమర్శలను అధిగమించి ఇంతదూరం వచ్చినం. ఎవరో ఒకరు చైతన్య దీపం వెలిగించకపోతే ఈ దేశంలో కారు చీకట్లు కొనసాగుతునే ఉంటయి. ఈ చీకట్లో వెలిగించిన చిరుదీపమే బీఆర్ఎస్ పార్టీ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ పతాకాన్ని ఎగుర వేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది. అందరికీ శుభాకాంక్షలు. ఆనాడు పిడికెడు మందిమి వేలై, లక్షలై ఉప్పెనలా ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నం. ఊహించని రీతిలో దేశానికే మార్గదర్శనం చేస్తున్నం. అద్భుతమైన ప్రగతితో ముందుకు పోతున్నం. ఇవాళ మన టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల సంఖ్య 60 లక్షలు. ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, చైర్మన్లుగా, సర్పంచులుగా లక్షలాదిమంది నాయకత్వం తయారైంది అని కేసీఆర్ పేర్కొన్నారు.
కరోనా క్లిష్ట సమయంలో దేశమంతా ఆర్థికంగా వెనుకకు పోయినా, తెలంగాణ రాష్ట్రం మాత్రం ఆర్థిక క్రమశిక్షణ, నియంత్రణతో నిలదొక్కుకున్నది అని సీఎం స్పష్టం చేశారు. ఒకనాడు కరువు కాటకాలతో కునారిల్లిపోయి, పల్లె పల్లెనా పల్లేర్లు మొలిసే అని పాడుకున్న మనం నేడు పాలమూరు తల్లి సాగునీటితో, అద్భుతమైన పంటలతో పచ్చని పైట కప్పుకున్నది అని పాడుకుంటున్నం. ఎక్కడివాళ్లం అక్కడ పనిచేసుకుంటూ ముందుకు సాగితేనే ఇంత అభివృద్ధి సాధ్యమైంది. ఇంత వెనుకబడిన ఇబ్బందులు పడిన తెలంగాణ ప్రాంతాన్నే ఇంత గొప్పగా మనం అభివృద్ధి చేసుకున్నపుడు రత్నగర్భ అయిన భారతదేశాన్ని ఇంకెంత గొప్పగా అభివృద్ధి చేసుకోగలం. అద్భుతమైన జల వనరులు, సాగు భూమి, సమ శీతోష్ణ వాతావరణం ఈ ప్రపంచంలో మరే దేశానికీ లేదు. మనకున్న వసతులకు ప్రపంచంలోనే అతిపెద్ద ఫుడ్ చైన్ దేశంగా ఇండియా మారాల్సి ఉండే. మానవ వనరులను వాడుకోలేక పోతున్నం అని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
అద్భుతమైన యువ సంపత్తి నిర్వీర్యమై పోతున్నది. యువతను మతోన్మాదులుగా మార్చే కుట్రలు జరుగుతున్నాయని కేసీఆర్ ధ్వజమెత్తారు. దీన్ని మార్చాల్సిన అవసరం ఉన్నది. ఇది బీఆర్ఎస్ నుంచే ప్రారంభం కావాలె. ఇందులో భాగంగా దేశంలో భావజాల వ్యాప్తిని, దేశ ప్రజలను చైతన్యం చేయాల్సి ఉంది. ఉత్తమమైన, గుణాత్మకమైన మార్పు కోసం ఉన్నతస్థాయికి చేరుకునే ఆర్ధిక ప్రగతి కోసం బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తది. ఇన్నాళ్లూ మనం కొనసాగిస్తూ వచ్చిన అదే అంకితభావంతో ముందుకు పోదాం అని కేసీఆర్ పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గ విధానాలకు వ్యతిరేకంగా, నూతన విధానాలను అమల్లోకి తెద్దాం. 40 కోట్ల ఎకరాల సాగు భూమి ఉండి, 70 వేల టీఎంసీల నీటి వనరులుండి, రైతుల ధర్నాలు ఇంకెంత కాలం? ఆకలి ఇండెక్సులో మనం ఎందుకు ముందు వరుసలో ఉన్నాం? ఎన్నో ఉద్యమాలు వచ్చినా ఈ దేశంలో పరిస్థితి ఎందుకు మారడం లేదు? రాజకీయాలంటే ఒక పార్టీ ఎన్నికల్లో గెలవడం, ఓడిపోవడం కాదు. ఎన్నికల్లో ప్రజలు గెలవాలె. ప్రజా ప్రతినిధులు గెలవాలె. సరిగ్గా ఇదే పరివర్తన కోసం ఏర్పాటైందే బీఆర్ఎస్ పార్టీ. ఎన్నో విమర్శలను అధిగమించి ఇంతదూరం వచ్చినం. ఎవరో ఒకరు చైతన్య దీపం వెలిగించకపోతే ఈ దేశంలో కారు చీకట్లు కొనసాగుతునే ఉంటయి. ఈ చీకట్లో వెలిగించిన చిరుదీపమే బీఆర్ఎస్ పార్టీ అని కేసీఆర్ పేర్కొన్నారు.