హైదారబాద్ : రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలనలో ఎస్సీ వెల్ఫేర్ కోసం రూ. 6,198 కోట్లు ఖర్చు పెట్టారు. మేం ఏడేండ్లలో రూ. 23,296 కోట్లు ఖర్చు చేశాం. ఎస్టీ వెల్ఫేర్ కోసం రూ. 3430 కోట్లు ఖర్చు పెడితే, మేం రూ.14,447 కోట్లు ఖర్చు చేశాం. బీసీ వెల్ఫేర్ కోసం కాంగ్రెస్ రూ. 6593 కోట్లు ఖర్చు పెడితే, టీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 19535 కోట్లు ఖర్చు చేశాం. మైనార్టీ వెల్పేర్ కోసం కాంగ్రెస్ రూ. 925 కోట్లు ఖర్చు చేస్తే, టీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 6971 కోట్లు ఖర్చు చేశాం. వుమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో కాంగ్రెస్ రూ. 4510 కోట్లు ఖర్చు చేస్తే, మేం రూ. 9916 కోట్లు ఖర్చు చేశాం. పదేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఖర్చు రూ. 21,663 కోట్లు, టీఆర్ఎస్ సర్కార్ మాత్రం రూ. 74,165 కోట్లు ఖర్చు చేశాం అని సీఎం కేసీఆర్ తెలిపారు.
ఏపీ తలసరి ఆదాయం రూ. 1.7 లక్షలు, తెలంగాణ తలసరి ఆదాయం రూ. 2.37 లక్షలు అని తెలిపారు. కేంద్ర తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణది రెట్టింపు. కేంద్రం దగ్గరే లేదు.. ఇక తెలంగాణకు ఏం ఇస్తారు? రాష్ట్ర హక్కు ప్రకారం కేంద్రం నుంచి రావాల్సింది వస్తుంది. తెలంగాణే కేంద్రానికి ఇస్తుంది.. కేంద్రం తెలంగాణకు ఇచ్చేది లేదు. దేశ ఖజానాకు నిధులు సమకూర్చేది కేవలం నాలుగైదు రాష్ట్రాలు మాత్రమే. కేంద్రానికి నిధులు సమకూర్చే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. కేంద్రం అసలు ఇస్తే కదా.. నిధులు మళ్లించడం జరిగేది అని సీఎం కేసీఆర్ తెలిపారు.