ఇది దశాబ్ది ముంగిట నిలిచిన తెలంగాణ విప్లవాత్మక విజయ యాత్ర. ఉద్యమం నుంచీ ఉజ్వల ప్రగతి దాకా సాగిన జయ పరంపరల జనగాథ. నా రాష్ట్రం భారత వినీలాకాశంలో వెలుగులు విరజిమ్ముతున్న ధ్రువతార అని ప్రతి పౌరుని ఛాతీ ఉప్పొంగేలా ఖ్యాతి పొందే స్థాయికి తెలంగాణను తీసుకురాగలిగినందుకు నా జీవితం ధన్యమైందని భావిస్తున్నాను. స్వరాష్ట్ర సాధన ఉద్యమానికి, తెలంగాణ పునర్నిర్మాణానికి రెండింటికీ సారథ్యం వహించే సువర్ణావకాశాన్ని, అదృష్టాన్ని, పాత్రతను నాకు ప్రసాదించిన తెలంగాణ ప్రజానీకానికి నేను సర్వదా, శతధా, సహస్రధా కృతజ్ఞుడను. నాకు ప్రాణ సమానమైన తెలంగాణ రాష్ట్రం చేరాల్సిన గమ్యాలు, అందుకోవాల్సిన అత్యున్నత శిఖరాలు మరెన్నో ఉన్నాయి.
– ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): నిన్నటి ఉద్యమాల తెలంగాణ… నేడు ఉజ్వల తెలంగాణగా మారిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం మనసా వాచా కర్మణా అంకితమైందని తెలిపారు. 2014లో రాష్ట్ర అవతరణ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ‘తెలంగాణను దేశానికి తలమానికంగా మార్చుతా’ అని ప్రజలకు తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చానని ప్రకటించారు. తొమ్మిదేండ్ల అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రం దేశానికి స్ఫూర్తినిచ్చేలా అవతరించిందని చెప్పారు. ‘సంపద పెంచుదాం, ప్రజలకు పంచుదాం’ అనే నినాదంతో సంక్షేమంలో తెలంగాణ స్వర్ణయుగాన్ని ఆవిష్కరించినట్టు సీఎం పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. 60 ఏండ్ల పోరాట చరిత్రను, పదేండ్ల ప్రగతి ప్రస్థానాన్ని స్మరించుకొన్నారు. సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
ప్రజల ఆకాంక్షలు.. అమరుల ఆశయాలే లక్ష్యంగాప్రజల అభీష్టానికి భిన్నంగా తెలంగాణను ఆంధ్రాప్రాంతంతో కలిపినప్పటి నుంచి తెలంగాణ ప్రజలు అసమ్మతిని నిరంతరం తెలియజేస్తూనే ఉన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 1969లో ఎగిసిపడిన తెలంగాణ ఉద్యమం రక్తసిక్తమై దారుణమైన అణచివేతకు గురైంది. ఆ తర్వాత ఉద్యమం కోసం ప్రయత్నాలు జరిగినా నాయకత్వ లేమి, సమైక్య పాలకుల కుట్రల వల్ల ఆ ప్రయత్నాలు ఫలించలేదు. 2001 వరకూ తెలంగాణలో నీరవ నిశ్శబ్దం రాజ్యమేలింది. ఇంకెక్కడి తెలంగాణ అనే నిర్వేదం జనంలో అలుముకొన్నది. ఆ నిర్వేదాన్ని, నిస్పృహను బద్దలు కొడుతూ 2001లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది.
ఆ ఉద్యమానికి నాయకత్వం వహించే చరిత్రాత్మక అవకాశం నాకు లభించినందుకు నా జీవితం ధన్యమైంది. శాంతియుత పంథాలో, వ్యూహాత్మకంగా సాగిన మలిదశ ఉద్యమంలో తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు సిద్ధాంతరాద్ధాంతాలకు తావివ్వకుండా ఏకోన్ముఖులై కదిలారు. ఉద్యమంలో కలిసి వచ్చిన వారందరికీ దశాబ్ది ఉత్సవం సందర్భంగా సవినయంగా తలవంచి నమస్కరిస్తున్నా. స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన త్యాగధనులైన అమరులకు హృదయపూర్వకంగా నివాళులర్పిస్తున్నా. 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం అమరుల ఆశయాలను, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మనసా వాచా కర్మణా అంకితమైంది.
రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలో ఏ రంగంలో చూసినా విధ్వంసమే. అంతటా గాఢాంధకారమే అలుముకున్నది. అలాంటి అస్పష్టతలను, అవరోధాలను అధిగమిస్తూ నేడు తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యంత బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదగడం ఒక చరిత్రాత్మక విజయం. తెలంగాణ ఏయే రంగాల్లో ధ్వంసం అయిందో ఆ రంగాలను అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యతను ప్రభుత్వం నిజాయితీగా చేపట్టింది. తెలంగాణను పునరన్వేషించుకోవాలి, తెలంగాణను పునర్నిర్మించుకోవాలి అనే నినాదంతో ముందడుగు వేసినం. ప్రజల తక్షణ అవసరాలు, వనరులు, వాస్తవాలతో తెలంగాణ దృక్పథంతో నూతన విధానాలకు రూపకల్పన చేశాం.
2014 జూన్ 2న పరేడ్ గ్రౌండ్లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేనొక వాగ్దానం చేశాను. తెలంగాణ రాష్ర్టాన్ని చూసి దేశం నేర్చుకొనే విధంగా, భారతదేశానికే తలమానికంగా ఉండే విధంగా తెలంగాణను తీర్చిదిద్దుతానని ఆనాడు నేను ప్రజలకు హామీ ఇచ్చాను. ఆ ఉక్కు సంకల్పాన్ని ఏ క్షణమూ విస్మరించలేదు. ఏమాత్రం చెదరనివ్వలేదు. తొమ్మిదేండ్ల అనతికాలంలోనే అనేక రంగాల్లో మన తెలంగాణ దేశానికే స్ఫూర్తినిచ్చే రాష్ట్రంగా అవతరించింది.
తెలంగాణ ఉద్యమంలో ప్రజలు వ్యక్తం చేసిన ఆకాంక్షల పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంపూర్ణ అవగాహన ఉన్నది. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన అనుభవం ప్రాతిపదికగా తెలంగాణ ప్రజల ఆర్తిని ప్రతిబింబించే విధంగా మ్యానిఫెస్టోను రూపొందించుకొని చిత్తశుద్ధితో అమలు చేసింది.
ప్రభుత్వ కృషితో ఇవాళ రాష్ట్రంలో కరెంటు కోతలు లేవు. ఎటుచూసినా వరికోతలే కనిపిస్తున్నాయి. తలసరి విద్యుత్తు వినియోగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఎత్తిపోతలతో తరలించిన నదీ జలాలతో తెలంగాణ బీడుభూములన్నీ తరిభూములయ్యాయి. మిషన్ భగీరథ తెలంగాణ తాగునీటి వ్యథలకు చరమగీతం పాడింది. కుల వృత్తులకు ఆర్థిక ప్రేరణతో తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పరిపుష్టి చేకూరింది. పల్లె ప్రగతితో గ్రామీణ జీవన ప్రమాణాలు పెరిగాయి. మన ఆదర్శ గ్రామాలు జాతీయ స్థాయిలో అనేక అవార్డులందుకొంటున్నాయి. పట్టణాలు, నగరాలు పరిశుభ్రతకు, పచ్చదనానికి నిలయాలై ప్రపంచస్థాయి గుర్తింపు పొందుతున్నాయి. ఏ విషయంలో చూసినా, ఏ కోణంలో చూసినా అనేక రంగాల్లో తెలంగాణ నంబర్ వన్గా నిలుస్తున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే.. నిన్నటి ఉద్యమ తెలంగాణ.. నేడు ఉజ్వల తెలంగాణగా వాసికెక్కింది.
తెలంగాణ రాష్ట్రం ఆరేండ్ల స్వల్ప కాలంలోనే వాయువేగంతో ప్రగతి శిఖరాలను అధిరోహించింది. ఇప్పుడు ఇది నవీన తెలంగాణ. నవనవోన్మేష తెలంగాణ. దేశంలో ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా తెలంగాణ మాడల్ అనే మాట మార్మోగుతున్నది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ అభివృద్ధి నమూనా మన్ననలందుకొంటున్నది. అనేక సవాళ్లు, అవరోధాల మధ్య నెమ్మదిగా ప్రారంభమైన తెలంగాణ ప్రగతి ప్రస్థానం, నేడు పరుగులు తీస్తోందంటే అందుకు అంకితభావంతో పనిచేస్తున్న ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం, ప్రభుత్వోద్యోగులు, ప్రజా సహకారమే కారణం.
అభివృద్ధి సాధించడమేకాదు.. ఆ అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించడంలో కూడా మన రాష్ట్రం నూతన ఒరవడిని సృష్టించింది. మానవీయకోణంలో రూపొందించిన పథకాల పట్ల నేడు దేశమంతటా ఆదరణ వ్యక్తమవుతున్నది. తెలంగాణ ప్రభుత్వ పథకాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా, ఆచరణీయంగా నిలవడమే కాదు.. ఆయా రాష్ర్టాల ప్రజలు తమకు కూడా తెలంగాణ తరహా అభివృద్ధి కావాలని కోరుకొంటున్నారు. మన రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఇతర రాష్ర్టాల సీఎంలు, అధికారులు మన పథకాలకు ఆకర్షితులై, వారి రాష్ర్టాల్లో కూడా వీటిని అమలు చేస్తామని ప్రకటించినప్పుడు నాకు ఎంతో గర్వంగా అనిపిస్తుంది.
సంపద పెంచుదాం.. ప్రజలకు పంచుదాం అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రం సంక్షేమంలో స్వర్ణయుగాన్ని ఆవిష్కరించింది. 2014లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,104 మాత్రమే. తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రగతితో నేడు రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,17,115కు పెరిగింది. పదేండ్ల చిరుప్రాయంలో ఉన్న తెలంగాణ… తలసరి ఆదాయంలో దేశంలోని పెద్ద రాష్ర్టాలకన్నా మిన్నగా ఉన్నది. 2014లో రాష్ట్ర జీఎస్డీపీ రూ.5,05,849 కోట్లు మాత్రమే. నేడు రాష్ట్రంలోని అన్నిరంగాలూ ఆర్థికంగా పరిపుష్టి కావడంతో రాష్ట్ర జీఎస్డీపీ రూ.12,93,469 కోట్లకు పెరిగింది. కరోనా, నోట్ల రద్దు వంటి సంక్షోభాలు ఏర్పడినప్పటికీ తట్టుకొని 155 శాతం వృద్ధిరేటును నమోదు చేస్తూ అప్రతిహతంగా ముందుకు సాగుతున్నది.
హరితహారం కింద తొమ్మిదేండ్లలో 273 కోట్ల మొక్కలు నాటాం. 2015-16లో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 19,854 చదరపు కిలోమీటర్లు ఉండగా, 2023 నాటికి 26,969 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. తెలంగాణలో 24.06 శాతం మేర అడవులు విస్తరించి ఉన్నాయి. చెట్ల సాంద్రత 2014లో చదరపు కిలోమీటర్కు 2,549 ఉండగా, ప్రస్తుతం 2,848కి పెరిగింది. మొత్తం రాష్ట్రంలో 7.70 శాతం పచ్చదనం పెరిగింది. ప్రతి గ్రామంలో నర్సరీతోపాటు, 19,472 పల్లె ప్రకృతి వనాలు, 2,725 బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశాం. లక్ష కిలోమీటర్ల పొడవున రహదారి వనాలు పూర్తిచేశాం. పట్టణాల్లో రూ.700 కోట్లతో 179 అర్బన్ ఫారెస్టు పార్కులు ఏర్పాటుచేశాం. ఫలితంగా హైదరాబాద్ నగరం ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్గా రెండుసార్లు గుర్తింపు పొందింది. రానున్న వర్షాకాలంలో హరితహారంలో 20 కోట్ల మొక్కలు నాటనున్నాం. హరితనిధి ఏర్పాటుతోపాటు స్థానిక సంస్థలు తమ బడ్జెట్లో 10 శాతం పచ్చదనం అభివృద్ధికి ఖర్చు చేయాలన్న నిబంధనను అమలు చేస్తున్నాం. ‘దారులు పూల తీరులయి.. తావులు నింపును నేత్ర శోభలన్’ అన్న కవి అయాచితం నటేశ్వరశర్మకు కృతజ్ఞతలు.
2014లో అంపశయ్య మీద ఉన్న ఆరోగ్యరంగం నేడు దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. అన్ని దవాఖానల్లో మౌలిక వసతులు పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకొన్నాం. నాడు 1,400 ఆక్సిజన్ పడకలు ఉంటే, ఇప్పుడు 27,966కు (20 రెట్లు) పెంచాం. ఇటీవలే 950 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 1,442 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం జరిగింది. హైదరాబాద్ నగరం నలువైపులా నాలుగు ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ దవాఖానలు, నిమ్స్లో అదనంగా రెండు వేల పడకల భవనం, వరంగల్లో రూ.1,100 కోట్లతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మిస్తున్నాం. బస్తీ పేదల కోసం హైదరాబాద్లో 256 బస్తీ దవాఖానలు సేవలందిస్తున్నాయి. త్వరలో పల్లె దవాఖానలు ప్రారంభం కాబోతున్నాయి.
కేసీఆర్ కిట్స్, న్యూట్రిషన్ కిట్స్, ఆరోగ్యలక్ష్మి తదితర పథకాల వల్ల ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల రేటు 30 శాతం నుంచి 69 శాతానికి పెరిగింది. మాతృ మరణాల సంఖ్య 92 నుంచి 43కు, శిశు మరణాల సంఖ్య 35 నుంచి 21కి తగ్గింది. రాష్ట్రంలో వంద దవాఖానల్లో ఆరోగ్య మహిళ పేరుతో ఉమెన్ స్పెషల్ క్లినిక్స్ నిర్వహిస్తున్నాం. రాష్ట్రం ఏర్పాటైనప్పుడు తెలంగాణలో 5 మెడికల్ కాలేజీలుంటే, నేడు బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాకు ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తున్నది. ఈ ఏడాదితో రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్య 26కు చేరుతుంది. 2014లో మెడికల్ సీట్లు 850 ఉండగా, 2022-23 నాటికి 2,790కి పెరిగింది. పీజీ సీట్లు రెట్టింపయ్యాయి. ప్రతి లక్ష జనాభాకు సగటున 19 ఎంబీబీఎస్ సీట్లతో వైద్య విద్యలో తెలంగాణ దేశంలో మొదటి స్థానంలో, 7 పీజీ సీట్లతో రెండో స్థానంలో ఉన్నది.
ఒక్క జూనియర్ కాలేజీ స్థాపన కోసం దశాబ్దాల తరబడి వేచి చూసే దుర్గతి అనుభవించిన తెలంగాణలో.. నేడు 1,002 గురుకుల జూనియర్ కళాశాలలు కొలువుదీరాయి. 5.59 లక్షల మంది విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యనందిస్తున్నాయి. గురుకుల కళాశాలల విద్యార్థుల కోసం కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ వంటి బహుళజాతి సంస్థలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించే స్థాయికి ఎదిగాయి. మన ఊరు -మన బడి కింద రాష్ట్రవ్యాప్తంగా 26,065 పాఠశాలల్లో డిజిటల్ విద్యతోపాటు 12 రకాల మౌలిక వసతులను కల్పిస్తున్నాం. విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకొనే విద్యార్థులకు రూ.20 లక్షల ఉపకార వేతనం అందిస్తున్నాం.
ఒకనాడు ఎక్కడ చూసినా చెత్తా చెదారం, పాడుబడిన ఇండ్ల శిథిలాలు, ప్రమాదకరంగా ఉన్న బావులు, విద్యుత్తు తీగలు, మురికి కూపాలతో అస్తవ్యస్తంగా తయారైన గ్రామీణ, పట్టణ ప్రాంతాలు.. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో నేడు సంపూర్ణ పరివర్తన సాధించాయి. రాష్ట్రంలోని 12,769 గ్రామాలు (100 శాతం) ఓడీఎఫ్ ప్లస్ సాధించి దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఇటీవల మన పల్లెలకు 13 జాతీయ అవార్డులు వచ్చాయి. స్వచ్ఛ సర్వేక్షణ్- 2022లో 23 పట్టణ స్థానిక సంస్థలు అవార్డులను గెలుచుకొన్నాయి. ఇంతటి మార్పు సాధించిన గ్రామ, పట్టణ ప్రజాప్రతినిధులందరికీ శుభాభినందనలు.
ఇది దశాబ్ది ముంగిట నిలిచిన తెలంగాణ విప్లవాత్మక విజయ యాత్ర. ఉద్యమం నుంచి ఉజ్వల ప్రగతిదాకా సాగిన జయ పరంపరల జన గాథ. నేడు నా రాష్ట్రం భారత వినీలాకాశంలో వెలుగులు విరజిమ్ముతున్న ధ్రువతార అని ప్రతి తెలంగాణ పౌరుని ఛాతీ ఉప్పొంగేలా ఖ్యాతి పొందే స్థాయికి తెలంగాణను తీసుకురాగలిగినందుకు నా జీవితం ధన్యమైందని భావిస్తున్నాను. స్వరాష్ట్ర సాధన ఉద్యమానికి, తెలంగాణ పునర్నిర్మాణానికి రెండింటికీ సారథ్యం వహించే సువర్ణావకాశాన్ని, అదృష్టాన్ని, పాత్రను నాకు ప్రసాదించిన తెలంగాణ ప్రజానీకానికి నేను సర్వదా, శతధా, సహస్రధా కృతజ్ఞుడను. నా ప్రాణ సమానమైన తెలంగాణ రాష్ట్రం చేరాల్సిన గమ్యాలు, అందుకోవాల్సిన అత్యున్నత శిఖరాలు మరెన్నో ఉన్నాయి. మీ అందరి దీవెనలతో నా శరీరంలో సత్తువ ఉన్నంతవరకూ నేను తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసం పరిశ్రమిస్తూనే ఉంటానని మాట ఇస్తున్నాను. ధర్మస్య విజయోస్తు.. అధర్మస్య నాశోస్తు.. ప్రాణేషు సద్భావనాస్తు.. విశ్వస్య కల్యాణమస్తు.. జై తెలంగాణ.. జై భారత్ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
ఇది దశాబ్ది ముంగిట నిలిచిన తెలంగాణ విప్లవాత్మక విజయ యాత్ర. ఉద్యమం నుంచి ఉజ్వల ప్రగతిదాకా సాగిన జయ పరంపరల జన గాథ. నేడు నా రాష్ట్రం భారత వినీలాకాశంలో వెలుగులు విరజిమ్ముతున్న ధ్రువతార అని ప్రతి తెలంగాణ పౌరుని ఛాతీ ఉప్పొంగేలా ఖ్యాతి పొందే స్థాయికి తెలంగాణను తీసుకురాగలిగినందుకు నా జీవితం ధన్యమైందని భావిస్తున్నాను. స్వరాష్ట్ర సాధన ఉద్యమానికి, తెలంగాణ పునర్నిర్మాణానికి రెండింటికీ సారథ్యం వహించే సువర్ణావకాశాన్ని, అదృష్టాన్ని, పాత్రను నాకు ప్రసాదించిన తెలంగాణ ప్రజానీకానికి నేను సర్వదా, శతధా, సహస్రధా కృతజ్ఞుడను. నా ప్రాణ సమానమైన తెలంగాణ రాష్ట్రం చేరాల్సిన గమ్యాలు, అందుకోవాల్సిన అత్యున్నత శిఖరాలు మరెన్నో ఉన్నాయి. మీ అందరి దీవెనలతో నా శరీరంలో సత్తువ ఉన్నంతవరకూ నేను తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసం పరిశ్రమిస్తూనే ఉంటానని మాట ఇస్తున్నాను. ధర్మస్య విజయోస్తు.. అధర్మస్య నాశోస్తు.. ప్రాణేషు సద్భావనాస్తు.. విశ్వస్య కల్యాణమస్తు.. జై తెలంగాణ.. జై భారత్ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
పాలన పారదర్శకంగా, సులభంగా సాగేందుకు 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా మార్చుకున్నాం. కొత్తగా 153 మండలాలు, 35 రెవెన్యూ డివిజన్లు, 8 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 కొత్త మున్సిపాలిటీలు, 4,914 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశాం. సకల సౌకర్యాలతో సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయాలను నిర్మిస్తున్నాం.
రాష్ట్రం అవతరించిన వెంటనే ప్రభుత్వోద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఇంక్రిమెంట్ను ఇచ్చాం. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 43 శాతం ఫిట్మెంట్, కరోనా కాలంలోనూ 30 శాతం ఫిట్మెంట్ ఇచ్చాం. దీనిని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కూడా వర్తింపజేశాం. 2014లో అంగన్వాడీ టీచర్ల వేతనం రూ.4,200, సహాయకులకు రూ.2,200 ఉండగా, ఇప్పుడు టీచర్లకు రూ.13,650, మినీ అంగన్వాడీ టీచర్లకు రూ.7,800, హెల్పర్లకు రూ.7,800 ఇస్తున్నాం. ఆశ వర్కర్లకు 2014లో రూ.1,500 పారితోషికం ఉండగా, ఇప్పుడు రూ.9,750 ఇస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 20 వేల మంది వీఆర్ఏల సర్వీసు క్రమబద్ధీకరణ ప్రక్రియ కొనసాగుతున్నది. 9,355 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసులను క్రమబద్ధీకరించేందుకు కమిటీ వేశాం. నిరుద్యోగుల ఆకాంక్షలకు తగ్గట్టుగా భారీగా ఉద్యోగ నియామకాలు చేస్తున్నాం.
హైదరాబాద్ నగరం ఒక మినీయేచర్ ఆఫ్ ఇండియా. హెచ్ఎండీఏ పరిధిలో మురుగునీటి నిర్వహణ కోసం సీవరేజ్ మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నం. నిరంతర తాగునీటి సరఫరా కోసం రూ.2,214 కోట్లతో చేపట్టిన సుంకిశాల ఇన్టేక్ వెల్ పనులు త్వరలో పూర్తి కానున్నాయి. హైదరాబాద్ నలుమూలల నుంచి విమానాశ్రయానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.6,250 కోట్ల సొంత నిధులతో మెట్రోరైలు ఏర్పాటు చేస్తున్నం. దీనిని మూడేండ్లలో పూర్తి చేస్తాం. ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు ఎస్సార్డీపీ కింద రూ.67,149 కోట్లతో 42 కీలక రహదారులు, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్లు, ఆర్వోబీల అభివృద్ధి చేపట్టాం. రూ.275 కోట్లతో 22 లింక్ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశాం.