CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో టీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని సర్కారుపై ధ్వజమెత్తారు.. సమైక్య రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నరు. వలసలు పోయారు. బతుకపోయారు. ఆగమగమైనం. కాబట్టి వ్యవసాయాన్ని స్థిరీకరించుకోవాలని రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు ఇంకా ఎన్నో సదుపాయాలు చేసుకుంటున్నాం. దేశంలోని ఏ రాష్ట్రంలో ఉచితంగా కరెంటు సరఫరా చేయరు. చేసినా 24 గంటలు ఇవ్వరు. పట్టుపట్టి మనం చేసుకుంటున్నం.. ఒకటి కాదు అనేక రంగాల్లో చేసుకుంటున్నం.
ఈ మధ్య దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం వాళ్లకు పిచ్చి ముదురుతున్నది. పిచ్చి ముదిరి పిచ్చిపిచ్చి పాలసీలు తెస్తున్నరు. వ్యవసాయ చట్టాలు తెచ్చిన్రు. ఒక యాడాది పాటు రైతులను ఏడిపించింన్రు. ఢిల్లీ దగ్గర రైతులను అవమానపరిచారు. ఇన్సల్ట్ చేసి మాట్లాడారు. వాళ్లు ఖలిస్తాన్ ఉగ్రవాదులని అవమాన పరిచారు. లాఠీచార్జీలు చేశారు. గుర్రాలతో తొక్కించారు.. చివరకు ఉత్తరప్రదేశ్లో ఒక మంత్రి రైతుల ధర్నా మీదికి తీసుకెళ్లి తొక్కిచ్చిన విషయం టీవీల్లు, పేపర్లో చూశారు. మళ్లీ ఐదు రాష్ట్రాల ఎన్నికల వస్తే ప్రజలకు భయపడి ఆ బిల్లులు వాపస్ తీసుకొని.. ప్రధాని స్వయంగా క్షమాపణ కోరుతున్నా అని మాట్లాడిండు.
ఇవాళ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో చాలా ఇబ్బందుల్లో ఉన్న కరెంటు.. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఇంకా బాగు కాలేదు.. తెలంగాణలో బాగా కష్టపడి చేసుకున్నం. మన సొంత పైసలు పెట్టి 24 గంటలు అన్ని రంగాలకు కరెంటు ఇస్తున్నం. ఎవరో అడిగితే.. అసెంబ్లీలో నేను మా రైతులపరంగా 10వేలకోట్లయినా.. 15వేల కోట్లయినా రాష్ట్ర ప్రభుత్వం కడుతది అని చెప్పినా. మా రైతుల ఇంకా బాగుపడాలే. ఇంకో ఐదారేళ్లు రైతుబంధు, ఫ్రీ కరెంటు, ఫ్రీగా నీళ్లు ఇస్తే అప్పులు పోయి రైతులు మంచిగై.. గ్రామాలు చల్లగుంటయ్. రైతు పండించే పంటతో ఒక రైతే బతుకడు కాబట్టి మేం చేసుకుంటుం.. మీరు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పినా. కానీ నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం మెడమీద కత్తిపెట్టి కరెంటు సంస్కరణలు పేరు మీద.. ప్రతి బాయికి, బోరుకు, మోటరుకు మీటరు పెట్టాలే అంటున్నది.. రైతులకు డైరెక్ట్ సబ్సిడీ ఇయ్యద్దు.
గ్రీన్ పవర్ కొనాలే. ఆయన దోస్తులు.. పెట్టుబడిదారులు ఎవరో.. 30వేల మెగావాట్ల సోలార్ పవర్ పెడుతడట.. మనం కొనాల్నట. నాగార్జున సాగర్, శ్రీశైలంలో ఇదే జిల్లాలో పులిచింతలకాడ మనకు హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ఉంటే.. అది ఉన్నా కూడా దాన్ని బంద్ పెట్టి.. ఆయన తరఫున పెట్టుబడిపెట్టే షావుకార్లు ఇచ్చేదే కొనాల్నట. దానికి అంతమైన పేరు విద్యుత్ సంస్కరణ. విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తేనే మీకు డబ్బులు ఇస్తం.. లేకుంటే ఇయ్యం.. ఇదీ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి పిచ్చిక్కి రైతులతో పెట్టుకుంటున్నరు.. దీన్ని ఒప్పుకుందమా? తెలంగాణ అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా జనం ఫ్రీగానే కరెంటు ఇవ్వాలంటూ జనం నినదించారు. ఇంకా సీఎం స్పందిస్తూ.. ఫ్రీగా కరెంటు ఇవ్వాలంటే.. మరి ఏం చేద్దాం.. నరేంద్ర మోదీని.. తరిమితిరిమి కొట్టాలి’ అంటూ పిలుపునిచ్చారు. మాకు ఇవ్వకున్నా పర్లేదు.. ఉన్నంతలో మేం ఇచ్చకుంటామంటే.. అలా ఇవ్వడానికి లేదు అంటున్నారని.. మరి కొట్లాడాలన్నా.. ఇంట్ల పండాల్నా అనగా.. సభకు తరలివచ్చిన అశేష జనవాహిని కొట్లాడాలంటూ నినదించారు.