హైదరాబాద్ : వనపర్తి జిల్లా ప్రజలను నిరంజన్రెడ్డి గెలిపించారని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. మంగళవారం వనపర్తిలో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ‘నిరంజన్రెడ్డి ఏంఏం పని చేసిండో.. ఆయన పడే తపన ఏందో.. ఘణపురం మండలం ఏమో నాకు తెల్వది. కర్నెతండా లిఫ్ట్ కావాలని వెంబండి పని మంజూరు చేయించాడు. నీళ్ల నిరంజన్రెడ్డి అని మీరు పేరు పెట్టిన్రు. ఆనాడు ఇంజినీరింగ్ కాలేజీ, రాజాగారి బంగ్లాలో ఎన్నికల సభలో ఒకటే హామీ ఇచ్చినా.
ఆ నాడు నిరంజన్రెడ్డిని గెలిపివ్వండి.. మీ ప్రాంతం పచ్చపడుతది లాభమైతది చెప్పాను. నిరంజన్రెడ్డిని మీరు గెలిపించారు.. మిమ్మల్ని వనపర్తి ప్రజలను నిరంజన్రెడ్డి గెలిపించారు. ఈ సారి నిరంజన్రెడ్డి నామినేషన్ వేస్తే లక్ష మెజారిటీతో గెలువాలి. నేను ఆలంపూర్ పోయినప్పుడు.. డాక్టర్ గారు అక్కడ పోటీ చేస్తే తుమ్మిళ్ల లిఫ్ట్ పెట్టినంక చెప్పిన. తుమ్మిళ్ల లిఫ్ట్లో నీళ్లు ఎట్ల దుంకుతున్నయో డాక్టర్ గారి డబ్బా అట్లా నిండాలని చెప్పా.. అదే పద్ధతిలో జనం గెలిపించారు.
ఇవాళ నన్ను పాడమని ఇచ్చారు.. కాకపోతే నేను రాసిన ‘వలసలతో వలవల విలపించిన కరువు జిల్లా.. పెండింగ్ ప్రాజెక్టులనే పూర్తి చేసి.. చెరువులన్నీ నింపి.. పన్నీటి జలకమాడి పాలమూరు తల్లి పచ్చ పైటగప్పుకున్నది’. ఏ నడిగడ్డలో నేను కన్నీళ్లు పెట్టుకున్ననో.. ఏ పాలమూరు ప్రొఫెసర్ జయశంకర్ గారు నేను కలిసి కన్నీళ్లు పెట్టుకున్నమో.. లక్ష్మారెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే నియోజకవర్గంలోని వాల్యానాయక్ తండాలో ఏ గిరిజనులను చూసి మా హృదయాలు ఏడ్చాయో ఇవాళ అన్నీ బ్రహ్మాండంగా చేసుకున్నాం. ఇవాళ గిరిజన గూడెలను, తండాలను గ్రామ పంచాయతీలు చేసుకున్నం. గొప్ప గ్రామాలు ఎక్కడున్నయ్ కేంద్ర ప్రభుత్వం లెక్క తీస్తే.. పది గ్రామాలకు ప్రైజ్ ఇచ్చారు. పదిట్ల ఏడు గ్రామాలు తెలంగాణవే సెలెక్ట్ అయ్యాయి.
12,769 గ్రామాలుంటే అన్ని గ్రామాల్లో ట్రాక్టర్ ఉన్నది ట్యాంకర్ ఉన్నది. ప్రతి గ్రామంలో నర్సరీ ఉన్నది. పచ్చని చెట్లున్నయ్. ఇంకా నాలుగు రోజులైతే అద్భుతమైన పల్లె తయారుకాబోతున్నయ్ స్వర్గసీమలాంటి పల్లెలు. పంటలు పండుతున్నయ్. ఇంత పాలమూరు పూర్తి చేసే 15-16లక్షల ఎకరాల నీటి పారుదలతోని అద్భుతమైన పంటలు పండే బంగారు తునక నా పాలమూరు. త్వరలోనే సాకారమైతది. 24 గంటల కరెంటు తెచ్చుకున్నం. ఒక క్షణం కూడా పోదు. అయాళ కరెంటు వస్తే వార్త.. ఇవాళ కరెంటు పోతే వార్త.. కరెంటు పోనేపోదు.. అద్భుతమైన పనులు జరుగున్నయ్. రాష్ట్ర తలసరి ఆదాయం దేశంలోనే నెంబర్ వన్. తలసరి విద్యుత్ వినియోగంలో నెంబర్. అనేక రంగాల్లో పురోగమిస్తున్నాం.
నిరంజన్రెడ్డిలాంటి మిత్రుడు నాకు స్నేహితుడిగా ఉన్నందుకు గర్వపడుతున్న. తపన ఉండే వ్యక్తులు.. ప్రజల కోసం పని చేయాలి. తండ్లాడాలే. మీరు చెబితే నేను నమ్మరు. నిన్న అసెంబ్లీ ఉంటే హైదరాబాద్ వచ్చిండు. నిన్న కూడా వదిలిపెట్టలే నన్ను. సార్ లాంబాడి తండాల్లో రోడ్లు ఉన్నయ్.. రూ.18కోట్లు ఉన్నయ్ సంతకం పెట్టుమని నా మెడపై కత్తి వెట్టి సంతకం పెట్టిచ్చిండు. వనపర్తి పట్టణంలో బస్సులో తిరుగుతూ రోడ్ల వెంట ధర ఎంతంటే.. రూ.5కోట్లు, రూ.3కోట్లు ధర. రూ.30వేలు, రూ.3లక్షలకు ఎకరం అమ్ముకున్న వనపర్తిలో ఇవాళ రూ.3కోట్లకు ఎకరమా?.. ఒక్క మెడికల్ కాలేజీ లేని పాలమూరులో ఐదు మెడికల్ కాలేజీలా? ఇదంతా ఎట్ల సాధ్యమైంది. ఇంత అద్భుతమైన భూముల ధరలు, రూ.24 గంటల కరెంట్, మన సాగునీళ్లు, తాగునీళ్లు అద్భుతం.
పట్టుపడితే, జట్టుకడితే.. పిడికిలి బిగిస్తే న్యాయం కోసం పురోగమిస్తే ఇవాళ ఏ తెలంగాణ కనపడుతున్నదో.. భారతదేశం మొత్తం కూడా తయారు కావాలి. తెలంగాణ కోసం కోట్లాడాం. తెచ్చుకున్నం. కొంత కొంత మొఖం తెల్లగైనం. ఇవాళ నా తెలంగాణలో ఆకలి చావులు లేవు. ఆత్మహత్యల్లేవ్. ఇగ కరువులు రావ్. వలసలు ఉండవ్. మంది మన వద్ద వచ్చి బతుకాలి తప్ప మనం బతుకబోం. మన కరెంటు పోదు. బ్రహ్మాండంగా ఉంటది. నిరంజన్రెడ్డి ఇంతకు ముందే చూపించారు.
నేను వచ్చిన బైపాస్ రోడ్డుకు రూ.100 – 200కోట్లయినా మంచిదే.. ఈ ఎండకాలంలోనే పనులు పూర్తి చేయాలి. ఇగో సొంత రాష్ట్రం వస్తే ఇట్ల బతుకుతమని సొంత రాష్ట్రం అడిగినం. ఇక్కడ మంజూరు చేసిన పనులు చేస్తే మర్రి జనార్దన్రెడ్డి కొడుతడు. గువ్వల బాలరాజు కొడుతడు.. అంతటా తండ్లాడుతున్నరు. అద్భుతమైన ఎమ్మెల్యేలున్నరు’ అన్నారు. పాలమూరు జల్ది కావాలని మా శ్రీనివాస్గౌడ్ అంటడు. ప్రతి వాళ్లు ఎక్కడి వారు అక్కడ అన్ని నియోజకర్గాల్లో తండ్లాడుతున్నరు. మహబూబ్నగర్ జిల్లా మీ దీవెనతో.. ఈ ప్రజాప్రతినిధుల సేవతో ఇంకింత పురోగమించాలే’ అన్నారు.