బెల్లంపల్లి: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ జోరుగా దూసుకుపోతున్నారు. ప్రత్యర్థి పార్టీలపై వాడిగా విమర్శలు గుప్పిస్తున్నారు. బుధవారం బెల్లంపల్లి నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు. నాటి కాంగ్రెస్ నేతల చేతగాని తనంవల్లే సింగరేణిలో కేంద్రానికి 49 శాతం వాటా కోల్పోవాల్సి వచ్చిందన్నారు. చేతగాని కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అమ్ముకుంటదని మండిపడ్డారు.
బెల్లంపల్లిలో సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘బెల్లంపల్లి, ఇల్లందు తర్వాత ప్రారంభించబడిన రెండవ గని సింగరేణి. నిజాం రాజు పెట్టిన కంపెనీ ఇది. ఈ సింగరేణికి 134 ఏళ్ల చరిత్ర ఉన్నది. తెలంగాణలో 10 కోట్ల బిలియన్ టన్నుల బొగ్గు ఉన్నది. ఇప్పటివరకు ఒకటిన్నర కోట్ల బిలియన్ టన్నుల బొగ్గు కూడా వెలికి తీయలే. ఇంకా 8.5 కోట్ల బిలియన్ టన్నుల బొగ్గు ఉన్నది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేతగాక కేంద్రం దగ్గర అప్పులు తెచ్చి్ంది. ఆ అప్పులు తిరిగి కట్టలేక సింగరేణిలో కేంద్రానికి వాటాను కట్టబెట్టింది. సింగరేణిని ఎవడమ్మిండు..? చేతగాక 49 శాతం వాటాను కేంద్రానికి కట్టబెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా..?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘తెలంగాణ ఏర్పడక ముందు సింగరేణికి రూ.414 కోట్ల లాభం వస్తుండె. తెలంగాణ వచ్చినంక ప్రణాళికతో ముందుకు పోవడంతో, కార్మికులు ఉత్సాహంగా పనులు చేయడంతో ఇప్పుడు రూ.2,200 కోట్ల లాభానికి సింగరేణి చేరుకుంది. కార్మికులకు దసరా, దీపావళి బోనస్ మునుపెన్నడూ మూడునాలుగు వందల కోట్ల రూపాయలు కూడా ఇవ్వలే. ఈ ఏడాది రూ.1000 కోట్ల లాభాలను కార్మికులకు పంచుతున్నం. కాంగ్రెస్ రాజ్యంల లాభాల్లో కార్మికులకు 18 శాతమే వాటా ఇచ్చిండ్రు. ఇప్పుడు 32 శాతం వాటా ఇస్తున్నం. ఒక్కో కార్మికునికి సగటున రూ.2.5 లక్షల వరకు వస్తున్నది’ అని చెప్పారు.
‘తెలంగాణను మునగగొట్టింది వాళ్లే. మీ అందరికి తెలుసు. అందుకే బాగా ఆలోచించి ఓటు ఎవరికి వేయాలో నిర్ణయం తీసుకోవాలని కోరుతున్న. సింగరేణిలో 45 వేల మంది కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇచ్చినం. ఇంక్రిమెంట్లు ఇచ్చినం. కాంగ్రెస్ పార్టీ సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను ఊడగొట్టింది. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినంకనే డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించినం. అంతకుముందు పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కల్పించిన ఉద్యోగాలు కేవలం 6,400. గత పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ కల్పించిన ఉద్యోగాలు 19,400. వాళ్లకు మాకు ఉన్న తేడా ఇది’ అని సీఎం అన్నారు.