CM KCR | సూర్యాపేట : సూర్యాపేట, తుంగతుర్తికి నాలుగు దశాబ్దాల పాటు సాగునీళ్లు రాకుండా పెండింగ్ పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. సూర్యాపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని, మంత్రి జగదీశ్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు.
జగదీశ్ రెడ్డి నా సహచర ఉద్యమకారుడే. ఆనాడు ఏ విధంగా పోరాటం చేశామో మీకు తెలుసు. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. 58 ఏండ్లు ఏడిపించింది మనల్ని. కొంత మీద గెలికి సూర్యాపేటకు, తుంగతుర్తికి సాగునీళ్లు రాకుండా నాలుగు దశాబ్దాలు పెండింగ్ పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఈ విషయం మీ అందరికీ తెలుసు. ఖాళీ కాల్వలు ఏన్నేండ్లు మనం చూసినం. ఉద్యమంలో కూడా ఆ కాల్వ వెంబడి నడిచి మన మునిమనవండ్లు కూడా నీళ్లు చూస్తర ఇండ్ల అని మాట్లాడిన అని కేసీఆర్ గుర్తు చేశారు.
మీ ఆశీర్వాదంతో బీఆర్ఎస్ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఆర్థిక నిపుణులతో చర్చించి ఒక లైన్ వేసుకున్నాం. సంక్షేమానికి మార్గం వేసుకున్నాం. రైతులకు ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు ఇవ్వాలి.. పంటలు పండించాలని నిర్ణయం తీసుకున్నాం. పెన్ పహాడ్కు పోయే కాల్వ ఏదైతే ఉంటదో.. నేను ఒకరోజు ఆ కాల్వ వెంట పోతా ఉంటే ఆ తండా వాళ్లొచ్చి నన్ను అడిగారు. ఎప్పటిదాకా నీళ్లు వస్తాయని అడిగారు. నువ్వు ఎన్ని రోజులు అంటే అన్ని నీళ్లు రోజులు వస్తాయని చెప్పాను. అదే పద్ధతిలో సంవత్సరంలో 10 నెలలు నిండా కాల్వలు పారుతున్నాయి. మీ కండ్ల ముందు మీరు చూస్తున్నారు. నేను చెప్పాల్సిన అసవరం లేదు.
సూర్యాపేటలో పంట ఎంత..? తుంగతుర్తిలో పంట ఎంత..? ఇవాళ ఎన్ని లక్షల ఎకరాలు సాగు అయితా ఉన్నది. ఒక్క సూర్యాపేట నియోజకవర్గంలోనే 2 లక్షల 15 వేల ఎకరాలు సాగు అవుతున్నది అని కేసీఆర్ తెలిపారు.
మూసీ ప్రాజెక్టు కూడా కాంగ్రెస్ కాలంలో నాశనం చేస్తే, గేట్లు కూడా పట్టించుకోకపోతే జగదీశ్ రెడ్డి వెంబడి పడి చేస్తే దాన్నుంచి కూడా నీళ్లు వస్తున్నాయి. మూసీ కింద, కాళేశ్వరం కింద పారుతున్న నీటికి నీటి తిరువా రద్దు చేశాం. పాత బకాయిలు రద్దు చేశాం. నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందిస్తున్నాం. 7500 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా పండించిన ధాన్యాన్ని కొంటున్నాం. ప్రభుత్వానికి నష్టం వచ్చినా మద్దతు ధర ఇస్తున్నాం. రైతు దురదృష్టవశాత్తు చనిపోతే 5 లక్షల బీమా ఇస్తున్నాం. ఇవన్నీ కూడా మేం చేసినం. కాల్వల్లో నీళ్లు వస్తున్నాయి, పంటలు పండుతున్నాయి. రైతుల ముఖాల్లో చిరునవ్వు ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.