CM KCR | సిరిసిల్ల శిగమూగింది. ఆరు గ్యారెంటీలను కాదు.. సారు గ్యారెంటీలనే నమ్ముతామని తేటతెల్లం చేసింది. సిరిసిల్లలో మంగళవారం జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు తరలివచ్చిన జనాన్ని చూస్తే.. మరోసారి కారుదే సర్కారు అని ఖరారు కావాల్సిందే. కండ్లముందటి జనగంగను చూసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. మానేరుతో, చుట్టుపక్కల పల్లెలతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. నేతన్నల ఆత్మహత్యల సంక్షుభిత రోజుల్ని తలుచుకున్నారు. తొమ్మిదిన్నరేండ్ల పాలనలో సజీవ జలధారగా మారిన మానేరును, సిరులఖిల్లాగా మారిన సిరిసిల్లను చూసి సంబురపడ్డారు.
హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): విపక్ష కాంగ్రెస్, బీజేపీతో తెలంగాణకు పెను ప్రమాదమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ఆ పార్టీలు చెప్పే కల్లబొల్లి మాటలతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టి విపక్ష పార్టీలు ఇప్పుడొచ్చి అనేక హామీలిస్తాయని, వాటిని నమ్మి మోసపోతే గోసపడుతామని హెచ్చరించారు. మూడేండ్లు మేధోమథనం నిర్వహించి రైతుల కష్టాలు తీర్చేందుకు తెచ్చిన ధరణిపై వేటు వేసేందుకు కాంగ్రెస్ పార్టీ గొడ్డలి పట్టుకొని సిద్ధంగా ఉన్నదని ఆరోపించారు. రాష్ట్రంలో హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టేందుకు బీజేపీ కాచుకు కూర్చున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
సిరిసిల్లలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. దేశంలో 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పునరుద్ఘాటించారు. వ్యవసాయానికి రోజుకు 3 గంటల కరెంటు చాలు అని కాంగ్రెస్ అంటున్నదని సీఎం కేసీఆర్ విమర్శించారు. ‘సాగుకు 3 గంటల కరెంట్ చాలనేది కాంగ్రెస్ నినాదం.. 24 గంటల నాణ్యమైన విద్యుత్తు కావాలనేది మా విధానం. ఇందులో ఏది కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి’ అని సూచించారు. తాము అధికారంలోకి వస్తే ధరణిని రద్దుచేస్తామని కాంగ్రెస్ అంటున్నదని, అదే జరిగితే రైతులు మళ్లీ గోసపడటం తప్పదని హెచ్చరించారు.
ఇవాళ ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రంలోనూ 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదు. దేశంలో ఒక్క తెలంగాణలో మాత్రమే 24 గంటల కరెంట్ వస్తున్నది. ఇది ఆశామాషీగా ఏం సాధ్యం కాలేదు. కేసీఆర్ మొండి పట్టుదలతోనే సాకారమైంది. బాయిలకాడ మోటర్లకు మీటర్లు పెట్టకపోతే రూ.30 వేల కోట్లు కట్ చేస్తనని మోదీ చెప్పిండు. నీ రూ.30 వేల కోట్లు తీసుకుని మడిచి పెట్టుకో నాకు అవసరం లేదని చెప్పిన. ఇవన్నీ సత్యాలు. ఎన్నికలప్పుడు వచ్చి ఏదో అవాకులు, చెవాకులు చెప్పడం కాదు.
– సీఎం కేసీఆర్
‘ధరణిపై వేటువేసేందుకు కాంగ్రెస్ పార్టీ గొడ్డలి పట్టుకొని రెడీగా ఉన్నది. కావున రైతులంతా అప్రమత్తంగా ఉండాలి. సాక్షాత్తు పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నాయకుడు, కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్గాంధీ కూడా ఇదే విషయాన్ని గతంలో చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిని రద్దుచేస్తామని, బంగాళాఖాతంలో పడేస్తామని అన్నారు. ఇప్పుడు రైతులంతా కాంగ్రెస్నే బంగాళాఖాతంలో పడేయాలి. నేనూ రైతునే, రైతు బిడ్డనే. మూడేండ్లు మేధోమథనం చేసి, రాత్రింబవళ్లు కష్టపడి ధరణి పోర్టల్ను తీసుకొచ్చాం. రైతుల భూములు క్షేమంగా ఉండాలని, రైతుల ఆస్తి పక్కాగా ఉండాలని, కౌలుకిచ్చినంత మాత్రాన రైతు భూమి ఇంకొకరి పాలు కావొద్దని ధరణి పోర్టల్ తెచ్చాం. ధరణి రాకతో ఏ మండలంవారికి ఆ మండల కేంద్రంలోనే పావుగంటలోనే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి.
గతంలో రిజిస్ట్రేషన్ విధానం ఎట్లా ఉండేదో.. ఇప్పుడెట్ల్ల ఉన్నదో ఆలోచన చేయాలె. 98 శాతం రైతులకు ధరణితో న్యాయం జరిగింది. ప్రభుత్వ అధికారాన్నంతా రైతులకే కట్టబెట్టాం. మీ భూములపై మీ హక్కులను తీసేస్తామని ఈ సిగ్గుమాలిన కాంగ్రెస్ చెప్తున్నది. తెలంగాణలో భూముల ధరలు ఎన్నోరెట్లు పెరిగినయ్. ఇవాళ రాష్ట్రంలో ఏ మూలకు పోయినా ఎకరం రూ.30-40 లక్షలకు తక్కువ లేనేలేదు. ధరణి లేకుంటే ఈ దుర్మార్గులు పెట్టే తాకులాటలకు, పీకులాటలకు ఎన్ని హత్యలు జరుగుతుండె? ధరణి పుణ్యం వల్లే పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయి. మరి.. పల్లెలు ప్రశాంతంగానే ఉండాలా? లేకపోతే.. మళ్లీ పాతరోజులు కావాలా? అనేది ప్రజలే ఆలోచించుకోవాలి’ అని కేసీఆర్ సూచించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు కడుపులోఉన్నది కక్కేశాడు
దేశంలో అనేక రంగాల్లో తెలంగాణ నంబర్ వన్గా ఎదిగిందని సీఎం కేసీఆర్ తెలిపారు. తొమ్మిదిన్నరేండ్లలోనే కనీవినీ ఎరగని అభివృద్ధి సాధించిందని చెప్పారు. తలసరి ఆదాయం, తలసరి విద్యుత్తు వినియోగంలో నంబర్ వన్ స్థాయికి చేరిందని, ఇంటింటికీ నల్లానీళ్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు. కడుపు, నోరు కట్టుకొని నిజాయితీగా పనిచేసి సాగునీళ్లు, తాగునీళ్లు, కరెంట్.. ఇలా అన్నీ సాధించామని అన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కడుపులో ఉన్నది కక్కేశాడు. వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలు.. కేసీఆర్! ఎందుకండీ అన్నన్ని గంటలు కరెంట్ ఇచ్చేది? అని తన మనసులో మాట చెప్పాడు. 24 గంటల కరెంట్ కావాలో.. మూడు గంటల కరెంట్ కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి’ అని సూచించారు.
మోదీ సొంతరాష్ట్రంలో 24 గంటల కరెంట్ లేదు
‘ఇవాళ ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రంలోనూ 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదు. ఒక్క తెలంగాణలో మాత్రమే 24 గంటల కరెంట్ వస్తున్నది. ఇదంతా ఆశామాషీగా ఏం సాధ్యం కాలేదు. కేసీఆర్ మొండి పట్టుదలతోనే సాకారమైంది. ఇదే నరేంద్రమోదీ బాయిల కాడ మీటర్లు పెట్టకపోతే రూ.30 వేల కోట్లు కట్ చేస్తామని చెప్పిండు. నీ రూ.30 వేల కోట్లు తీసుకుని మడిచి పెట్టుకో నాకు అవసరం లేదని చెప్పిన. బాయిల కాడ మీటర్లు పెట్టలే’ అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.
తమది నిబద్ధతతో రైతాంగం బాగుపడాలని, పల్లెలు చల్లగా ఉండాలని, అన్ని వర్గాల ప్రజలు బాగుండాలని ఆలోచించే ప్రభుత్వమని అన్నారు. ‘మాకు కులం, మతం, జాతి బేధం లేదు. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నాం. హిందువులు, ముస్లింల మధ్య పంచాయితీలు పెట్టే దుర్మార్గులున్నారు. కానీ.. తెలంగాణలో అటువంటి పరిస్థితి లేదని, అందరం కలిసి అన్నదమ్ముల్లా ఉన్నాం. గంగా జమునా తెహజీబ్ సంస్కృతికి తెలంగాణ నిదర్శనం. ఇదే సంస్కృతిని, సోదరభావాన్ని కొనసాగించాలి’ అని కోరారు. మంత్రి కేటీఆర్కు మంచి భవిష్యత్తు ఉన్నదని, మరోసారి దీవించి పంపాలని సిరిసిల్ల ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
సిరిసిల్ల ఆత్మహత్యలతో చలించిపోయా
సిరిసిల్లలో నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోవద్దన్న గోడ రాతలను చూసి తాను చలించిపోయానని సీఎం కేసీఆర్ అన్నారు. ‘ఒకనాడు సిరిసిల్ల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో హైదరాబాద్ వెళుతున్నప్పుడు ఆత్మహత్యలు పరిష్కారం కావు – చావులు పరిష్కారం కాదు, చావకండి’ అని గోడల మీద జాయింట్ కలెక్టర్ రాయించిన రాతలను చూసి నేను, ప్రొఫెసర్ జయశంకర్ కలత చెందాం. 70 ఏండ్ల స్వాతంత్య్ర దేశంలో ఇలాంటి గోడరాతలు చూడాల్సి వచ్చిందని కన్నీరు పెట్టుకుని బాధపడ్డాం. నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు సిరిసిల్ల ప్రజలు పెద్ద మనసుతో గెలిపించారు. ఆ సమయంలో ఒకే రోజు ఏడుగురు నేతన్నలు చనిపోయిన విషయాన్ని పత్రికల్లో చూసి చలించిపోయాను. సిరిసిల్ల నేతన్నలను ఆదుకోవాలని, ప్రభుత్వంలో లేకున్నా రూ.50 లక్షలు సేకరించి సహాయం చేశాం. అందరినీ కాపాడుకుంటానని ఆనాడు దండం పెట్టి విజ్ఞప్తి చేశాను. రూ.50 లక్షల సాయంతో నేతన్నలకు ఎంతో కొంత ఉపశమనం లభించింది’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
బతుకమ్మ చీరలను కాలుస్తారా?
ప్రతిపక్షాలు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నాయని సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు. ‘ప్రతి విషయాన్ని నీచాతినీచంగా రాజకీయం చేసే దుర్మార్గులు, చిల్లరగాండ్లు ఉంటారు. వాళ్లను పట్టించుకోవద్దు. చేనేత కార్మికులు బతకాలి.. మరమగ్గాలకు పని కల్పించాలని ప్రభుత్వమే బాధ్యత తీసుకుని రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ పండుగల సందర్భంగా నిరుపేదలకు కొత్త బట్టల పంపిణీ చేపట్టింది. కోటి కుటుంబాలకు, నిరుపేదలకు బట్టలు అందుతున్నాయి. ఈ పథకం ద్వారా రూ.300 కోట్ల విలువైన పని సిరిసిల్ల పరిశ్రమకు దొరుకుతున్నది. కానీ కొంత మంది దుర్మార్గులు ఆ చీరలను తీసుకుపోయి కాలబెట్టి మాకు ఈ చీరలు ఇస్తారా? ఆ చీరలు ఇస్తారా? అని అంటున్నారు. నిన్ను ఎవ్వరు కట్టుకోమన్నారు? ఎవరైనా బతిమిలాడారా? ఇష్టారీతిన మాట్లాడే దుర్మార్గుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’ అని కేసీఆర్ అన్నారు.
మీ భూములపై మీ హక్కులను తీసేస్తామని ఈ సిగ్గుమాలిన కాంగ్రెస్ చెప్తున్నది. తెలంగాణలో భూముల ధరలు ఎన్నోరెట్లు పెరిగినయ్. ఒకప్పుడు ఎకరం వేలల్లో ఉంటే ఇప్పుడు లక్షల్లోకి వెళ్లిపోయింది. ఏ మూలకు పోయినా ఎకరం రూ.30- 40 లక్షలకు తక్కువ లేదు. ధరణి లేకుంటే ఈ దుర్మార్గులు పెట్టే తాకులాటలకు, పీకులాటలకు ఎన్ని హత్యలు జరుగుతుండె! ధరణి వల్లే పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయి. మరి.. పల్లెలు ప్రశాంతంగా ఉండాలా? మళ్లీ పాతరోజులే కావాలా?
– సీఎం కేసీఆర్
మేం అడ్డగోలు అబద్ధాలు చెప్పం
ఎన్నికల సందర్భంగా అడ్డగోలు అబద్ధాలు చెప్పే సంస్కృతి బీఆర్ఎస్ పార్టీది కాదని సీఎం కేసీఆర్ అన్నారు. ‘ఇటీవలే మ్యానిఫెస్టో ప్రకటించాం. మేం ఆదరా బాదరాగా, అడ్డగోలు అబద్ధాలు చెప్పలేదు. ఆ అవసరం బీఆర్ఎస్ పార్టీకి లేదు. గత ప్రభుత్వంలో కల్యాణలక్ష్మి పథకానికి రూపకల్పన చేసినప్పుడు రూ.50 వేలతో ప్రారంభించాం. ఆదాయం పెరిగిన కొద్ది రూ.75 వేలకు, రూ.1లక్ష పదహారు రూపాయలకు పెంచాం. పెన్షన్లను సైతం ఒక స్కీమ్లా మొదట రూ.1,000తో ప్రారంభించి రూ.1 వేలకు పెంచాం. ప్రతిపక్షాల మాదిరిగా మోసం చేసేలా కాకుండా మొదటి సంవత్సరంలో పెన్షన్ను రూ.3 వేలకు, ఆ తర్వాత ఏటా రూ.500 పెంచుతూ రూ.5 వేలకు పెంచుతాం’ అని వివరించారు.
రైతన్న సన్నబియ్యం తినాలనే..
రైతుబంధు, ఇతర పథకాలతో ఏటా మూడు కోట్ల టన్నుల బియ్యం పండించి దేశానికి అన్నం పెడుతున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఎక్కడ అవసరముంటే అక్కడి వారికి అన్నం సమకూరుస్తున్నామని చెప్పారు. మూడు కోట్ల టన్నుల బియ్యం పండించే బిడ్డలు సన్నం బియ్యం తినాలన్న ఆలోచనతోనే రేషన్ కార్డుదారులందరికి సూపర్ఫైన్ సన్నబియ్యం ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. ఒకప్పుడు సిద్దిపేట నుంచి సిరిసిల్ల వరకు అంతా కరువుతో తండ్లాడారని, ఇప్పుడు ఎక్కడ చూసినా బెత్తెడుజాగ ఖాళీ లేకుండా పచ్చని పంటపొలాలతో అద్భుతంగా ఉన్నదని, పంటలు ఈనుతున్న దృశ్యాలు తనకు ఎంతో సంతోషానిచ్చాయని తెలిపారు. అనేక అబద్ధాలు, మోసపూరిత మాటలతో ప్రజలను మోసం చేసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయని, వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మానేరును చూస్తుంటే కండ్ల సంబురం
70 ఏండ్ల జీవితంలో సిరిసిల్ల తనకు సుపరిచితమున్న ప్రాంతమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తాను 170 సార్లు సిరిసిల్ల ప్రాంతంలో తిరిగానని గుర్తు చేసుకున్నారు. ఈ ప్రాంతంలో బంధుత్వాలు, బంధువులు, ఆత్మీయులు, క్లాస్మేట్స్ ఉన్నారని తెలిపారు. ‘హెలికాప్టర్లో వస్తుంటే అప్పర్ మానేరు నుంచి సిరిసిల్ల వరకు సజీవ జలధారను చూసి సంతోషం కలిగింది. 40 -50 ఏండ్ల క్రితం చిన్నప్పుడు గూడెం, ముస్తాబాద్, ఆవునూరు నుంచి సైకిల్, బైక్లపై సిరిసిల్లకు వచ్చినప్పుడు మానేరులో నీళ్లు కనిపించేవి కావు. సమైక్య పాలనలో మొత్తం నాశనమైంది. దుమ్ములేసే పరిస్థితిని స్వయంగా చూశాను. ముస్తాబాద్ మండలంలోని గూడూరుకు అనుకుని ఉన్న అప్పర్మానేరు కాల్వలో అనేకసార్లు ఊత కొట్టిన. పోతుగల్లో 15 -20 రైస్ మిల్లుండేవి. సమైక్య పాలకుల దౌర్జన్యం, దోపిడీతో ఒక్కో మిల్లు మాయమయ్యాయి. అప్పర్ మానేరు ప్రాజెక్ట్ అడుగంటింది. అప్పర్మానేరు ప్రాజెక్ట్లోనే తెలంగాణ ఉద్యమ సభను జరిపిన పరిస్థితులు కండ్ల ముందు కదలాడుతున్నాయి. స్వరాష్ట్రంలో సజీవ జలధారలతో కలగన్నట్టుగానే అప్పర్మానేరు మత్తడి ఎండాకాలంలో కూడా దుంకుతుంటే ఆత్మ సంతృప్తి కలిగింది’ అని పేర్కొన్నారు.
బతుకమ్మ చీరలు కాలుస్తారా? ఎందుకింత దుర్మార్గం? చేనేత కార్మికులు బతకాలని, మరమగ్గాలకు పని కల్పించాలనే గొప్ప సంకల్పంతో ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సిరిసిల్ల ఎమ్మెల్యేగా కేటీఆర్ ఈ పథకాన్ని ప్రతిపాదిస్తే క్యాబినెట్ ఆమోదించింది. రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ పండుగలకు సుమారు కోటి నిరుపేద కుటుంబాలకు బట్టలు పంపిణీ చేయడం ద్వారా చేనేత కార్మికులకు పని కల్పించాం. ఈ పథకం ద్వారా రూ.300 కోట్ల విలువైన పని సిరిసిల్ల పరిశ్రమకు దొరుకుతున్నది. చివరకు దీనిని కూడా రాజకీయం చేస్తున్నారు. కొంతమంది దుర్మార్గులు ఆ చీరలను తీసుకుపోయి కాలవెడుతున్నరు. ఇది ఎంత దుర్మార్గం!
– సీఎం కేసీఆర్
సిరిసిల్లను సోలాపూర్ చేస్తం
కేటీఆర్ ఎమ్మెల్యే కావడం సిరిసిల్ల ప్రజల అదృష్టమని సీఎం కేసీఆర్ అన్నారు. చేనేత మంత్రిగా ఉండి, ఎన్నోసార్లు చేనేత కార్మికుల అవసరాలు తీర్చారని తెలిపారు. ‘సిరిసిల్ల ఎంత గొప్పగా అభివృద్ధి సాధించిందో మీ ముందే ఉన్నది. మంత్రి కేటీఆర్ను పొగిడితే నన్ను నేనే పొగిడినట్టు ఉంటది. కేటీఆర్ గుణగణాలు నాకంటే మీకే ఎక్కువ తెలుసు. అంతా కలిసి పనిచేస్తున్నందున కేటీఆర్ను ప్రత్యేకంగా పొగడాల్సిన అవసరంలేదు. ఇప్పటికే అనేక హంగులు సమకూర్చాం. భవిష్యత్తులో విద్యాకేంద్రంగా సిరిసిల్ల విరాజిల్లుతుంది. చేనేత కార్మికులకు కావాల్సిన మర మగ్గాలను ఆధునీకరించడానికి డబ్బులు సమకూర్చడమే కాకుండా ఇతర సదుపాయాలను కేటీఆర్ కల్పించారు. చేనేత కార్మికుల పరిస్థితిని మార్చి, ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నుంచి చల్లగ బతికే రోజులు తెచ్చినందుకు కేటీఆర్ను అభినందిస్తున్నా. సోలాపూర్ తరహాలో సిరిసిల్లను తీర్చిదిద్దాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ కోరారు. సిరిసిల్లను సోలాపూర్లా తీర్చిదిద్దుతాం. సిరిసిల్ల ప్రజల ఆశీస్సులతో రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పడబోతున్నది. చేనేత కార్మికుల అవసరాను తీర్చేందుకు ప్రభుత్వం పాటుపడుతుంది’ అని హామీ ఇచ్చారు.