ఖానాపూర్: రైతుబంధు ఇచ్చే బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తరో లేదంటే రైతుబంధు దుబారా అంటున్న కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తరో మీరే ఆలోచించుకోవాలని ఓటర్లను ఉద్దేశించి సీఎం కేసీఆర్ అన్నారు. పొరపాటున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్యాయం జరుగుతదని, పదేళ్లుగా జరిగిన అభివృద్ధి మళ్లీ వెనక్కి పోతదని హెచ్చరించారు. చెప్పుడు మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీని గెలిపించవద్దని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖానాపూర్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు.
‘బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినంక తెల్ల రేషన్ కార్డుదారులకు మనిషికి 6 కిలోల బియ్యం ఇస్తున్నం. ప్రస్తుతానికి దొడ్డు బియ్యం వస్తున్నయ్. ఈ ఎన్నికల్లో గెలిచినంక దొడ్డు బియ్యం స్థానంలో తెల్ల రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం ఇస్తమని నేను హామీ ఇస్తున్నా. తెలంగాణ ఇప్పుడు పంజాబ్ కంటే ఎక్కువగా మూడు కోట్ల టన్నుల వడ్లను పండిస్తున్నది. బీఆర్ఎస్ సర్కారు రైతు సంక్షేమానికి ఎంతో చేసింది. గతంలో రైతులు కరెంటు బిల్లులు కట్టలేక పోతే తలుపులు పీక్కపోయేటోళ్లు. కానీ ఏనాడు గత ప్రభుత్వాలు రైతులకు రూపాయి సాయం చేయలే. గతంలో పంటలకు నీళ్లిస్తే నీటి తీరువా వసూలు చేసేటోళ్లు. మా ప్రభుత్వం వచ్చినంక ఆ నీటి తీరువాను రద్దు చేసినం. పాత బకాయిలు మాఫీ చేసినం’ అని సీఎం చెప్పారు.
‘అదేవిధంగా రైతుల కోసం మేం 24 గంటలు నాణ్యమైన ఉచిత కరెంటు ఇస్తున్నం. దేశంలో రైతుబంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. రైతుబంధు ద్వారా ఏటా ఎకరానికి రూ.10 వేలు పెట్టుబడి సాయం చేస్తున్నం. అదృష్టం బాగాలేక రైతు చనిపోతే రైతుబీమా పేరుతో రూ.5 లక్షలు ఇస్తున్నం. ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు పండించిన పంటను కొంటున్నది. ఇయన్నీ మీ కండ్ల ముందు ఉన్నయ్. తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుబంధు దుబారా అంటున్నడు. కేసీఆర్కు ఏం పన్లేక ఇస్తున్నడు అని మాట్లాడుతున్నడు. మరె రైతుబంధు దుబారా అనే కాంగ్రెస్ను గెలిపిస్తరా..? రైతుబంధు ఇచ్చే బీఆర్ఎస్ను, ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ను గెలిపిస్తరా..? మీరే ఆలోచించాలె. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలువగానే రైతుబంధును ఎకరానికి రూ.16 వేలు చేస్తనని నేను మాట ఇస్తున్నా’ అన్నారు.
‘పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మూడు గంటలు కరెంటు చాలు అంటున్నడు. ఆయన తెలిసి మాట్లాడుతడో, తెలువక మాట్లాడుతడో భగవంతునికి ఎరుక. ఇక కర్ణాటక నుంచి డీకే శివకుమార్ వచ్చి మేం 5 గంటలు కరెంటు ఇస్తున్నం అంటున్నడు. ఆయన రేవంత్రెడ్డికి గురువు. మరె కాంగ్రెసోళ్లు చెప్పినట్లు మూడు గంటల కరెంటు ఇస్తే ఎట్ల సాల్తది అంటే.. 10 హెచ్పీ మీటర్లు పెట్టాలే అంటున్నరు. మరె 10 హెచ్పీ మీటర్లకు పైసలు ఎవడియ్యాలె. వాని అయ్య ఇస్తడా..? కాబట్టి తెలంగాణలో 24 గంటల కరెంటు కావాల్సిందే. మరె 24 గంటల కరెంటు కావాలె అంటే ఇక్కడ జాన్సన్ నాయక్ను భారీ మెజారిటీతో గెలిపించాలె. అంతేగానీ కత్తి ఒగనికి ఇచ్చి, యుద్ధం ఒగన్ని జెయ్యమంటే కానిపని. చెప్పుడు మాటలు నమ్మి కాంగ్రెస్కు ఓటేస్తే అన్యాయమైతరు. అయిటెంక నేను గూడా ఏం జెయ్యలేను’ అని సీఎం అన్నారు.