CM KCR | ఇండస్ట్రీలు, ఐటీకారిడార్లతో భవిష్యత్లో జనగామ అభివృద్ధి అయ్యే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. జనగామ వైద్యకళాశాల మైదానంలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు. ‘జనగామ అన్నాదమ్ముళ్లు, అక్కాచెల్లెలకు వందనం శుభాభివందనం. పల్లా రాజేశ్వర్రెడ్డి షురు ఉన్నడు అని తెలుసుకని.. ఇంత హుషారు ఉన్నడని తెల్వది. మీరు ఏం లేదు.. సభ పెట్టిపోతే చాలు.. గెలిచి వచ్చాక అన్ని అడిగి తీసుకుంటు అన్నడు. గొడ్లకు వచ్చిన గోద పెండ పెట్టకపోతదా అన్నట్టు పెద్ద లిస్టు పెట్టిండు. ఈయన కంటే ముత్తిరెడ్డే నయం ఉండే. ఇలాంటి నాయకుడు ఉంటేనే మంచిది. ఎమ్మెల్యే కాక ముందే సమస్యలు తెలుసుకొని చాలా విషయాలు చెప్పారు. ఇవన్నీ చేయదగిన విషయాలే చేసి పెడుతాను. మెడికల్ కాలేజీ వచ్చిందంటే నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు వస్తాయ్. వాటికి ఇబ్బంది లేదు వస్తాయ్. నేను ఒక విషయం చెప్పాలి. చెర్యాల డివిజన్ కావాలని ఉంది. పెద్ద సమస్య కాదు. రాజేశ్వర్రెడ్డిని ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించి తీసుకొని రండి.. నెల రోజుల్లో చేర్యాల డివిజన్ చేసి పెడుతాను’ అన్నారు.
‘జనగామను యాది చేసుకుంటేనే భయమయ్యే పరిస్థితి, కండ్లకు నీళ్లచ్చే పరిస్థితి. ఉద్యమం జరిగే సమయంలో అన్ని జిల్లాలు, అన్ని మండలాలు తిరిగినా. ఎనిమిది, పదిచోట్ల కండ్లకు నీళ్లు తీసుకొని ఏడ్చాను. అలా భావోద్వేగానికి గురైన ప్రాంతాల్లో బచ్చన్నపేటలో ఒకటి. సూర్యాపేట వెళ్తున్న సమయంలో బచ్చన్నపేటలో మాట్లాడి వెళ్లాలని పలువురు కోరారు. అక్కడ ఆగి జీపులో మాట్లాడాను. అక్కడ అందరూ ముసలివారే ఉన్నారు. ఒక్క యువకుడు లేడు. ఎనిమిదేళ్ల కరువుతో బచ్చన్నపేట చెరువు అడుగంటింది. బావుల్లో నీళ్లు లేవు. బోర్లు సరిగా పోస్తలేవు. ఎనిమిది కిలోమీటర్లు పోయి నీళ్లు తెచ్చుకుంటున్నమని చెబుతూ రోదించారు. నాకు కూడా దుఃఖం ఆగలేదు. ఇంత దగ్గర గోదావరి ఉంటది.. మనకు హక్కు ఉంటుందని కానీ.. వారానికి ఒకరోజు స్నానం చేయలేని పరిస్థితుల్లో.. యువకులు పొట్టచేత పట్టుకొని అన్నమో రామచంద్ర అంటూ పోయిన దుస్థితిని ఆ రోజు చూసి ఏడ్చాను. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపారు.
కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేటప్పుడు చాలా మంది చెప్పారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే మార్గంలో ఒకటి, రెండు ఎకానమిక్స్ గ్రోత్ సెంటర్స్ కావాలని చెబితే.. వేరే ప్రదేశాలు చెప్పారు. నేను నా పాయింట్ పెట్టి జనగామ పాయింట్ పెట్టాను. రెండోది భువనగిరిపై పెట్టాను. ఈ రెండు గ్రోత్ కారిడార్లు అయ్యాయి. ఈ రోజు నీళ్లు వచ్చిన తర్వాత జనగామలో పాత వరంగల్ జిల్లాలో మొత్తంగా చూస్తే అత్యధికంగా వడ్లు పండించే తాలూకనే జనగామ. అప్పుడప్పుడు తెలుసుకుంటున్న బచ్చన్నపేట చెరువు సంగతి. ఆనాడు ఎండిపోయింది గానీ.. ఇప్పుడు 365 రోజులు నిండే ఉంటుందని అధికారులు, ముత్తిరెడ్డి, మిత్రులు సైతం చెప్పడం సంతోషం అనిపించింది. జనగామలో ఏదైతే జరుగాలనుకున్నామో.. ఏ మంచినీళ్లు అమ్ముకునే దుకాణాలు మాయమైపోయి.. మంచి పద్ధతిలో జనగామ అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్కు సమీప ప్రాంతం కావడంతో భవిష్యత్లో ఇండస్ట్రీలు, ఐటీకారిడార్లతో అద్భుతంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది’ అన్నారు.