హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం త్రివర్ణ శోభితంగా విలసిల్లుతోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భం ఇది. ఈ చారిత్రక సంబంధాన్ని పురస్కరించుకొని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. ప్రతి ఇంటికి జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీ చేసింది. ప్రతి ఇంటిపై జాతీయ జెండాలను ఎగురవేయడంతో యావత్ తెలంగాణ త్రివర్ణ శోభితంతో మురిసి మెరిసిపోతోంది. దేశభక్తిని చాటే అనేక కార్యక్రమాలను జరుపుకుంటున్నాం. వేలాది మంది స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలు ఆర్పించి వెలుగును చాటారు. మహానీయుల త్యాగాల వల్లే స్వాతంత్ర్య ఫలాలు అనుభవిస్తున్నామని చెప్పారు. ప్రతి భారతీయుడి హృదయం ఉప్పొంగే సమయమిది అని తెలిపారు.
వజ్రోత్సవ సందర్భంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఉత్సాహంగా, ఉత్తేజంగా జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకూ, యావత్ భారతజాతికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రతి భారతీయుని హృదయం ఉప్పొంగిపోయే విశిష్ట సందర్భమిది.
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంతరించి, భారతదేశ స్వేచ్ఛకూ, సార్వభౌమాధికారానికీ ప్రతీకగా త్రివర్ణపతాకం ఆవిష్కృతమై నేటితో 75 సంవత్సరాలు పూర్తవుతున్నాయి.
ఈ చారిత్రిక సందర్భాన్ని పురస్కరించుకొని, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. అంతేకాకుండా 1 కోటి 20 లక్షల జెండాలను ప్రభుత్వమే మన తెలంగాణ కార్మికుల చేతులతోనే తయారు చేయించి ఇంటింటికీ ఉచితంగా అందజేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు ప్రతిస్పందించిన తెలంగాణ ప్రజానీకం ప్రతి ఇంటిపై జాతీయ పతాకాలను ఎగరేయటంతో నేడు యావత్ తెలంగాణ రాష్ట్రం త్రివర్ణశోభితమై మెరిసి మురిసి పోతున్నది. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా దేశం స్వేచ్ఛా వాయువులను పీల్చుకోవడం కోసం తమ ప్రాణాలను ధారపోసిన మహానీయుల త్యాగాలను ఘనంగా స్మరించుకోవటం మనందరి బాధ్యత. భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రనీ, ఆదర్శాలనీ, విలువలనీ నేటితరానికి సవివరంగా తెలియజేయాలనే సత్సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం పదిహేను రోజుల పాటు భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను సమున్నతంగా నిర్వహిస్తున్నది. ఆగస్టు 8వ తేదీన ఉత్సవాల ఉద్ఘాటనను ఉత్తేజపూరితంగా జరుపుకున్నాం. ఈనెల 22వ తేదీవరకు దేశభక్తిని చాటే అనేక కార్యక్రమాలను రాష్ట్రమంతటా జరుపుకుంటున్నాం.
1857 సిపాయిల తిరుగుబాటు సందర్భంలో వీరోచితంగా పోరాడిన ఝాన్సీలక్ష్మీబాయి మొదలుకొని వేలాది మంది స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలర్పించి స్వాతంత్ర్య జ్యోతిని వెలిగించారు. స్వాతంత్ర్యం నా జన్మహక్కని చాటిన లోకమాన్య బాలగంగాధర తిలక్, శాంతి, అహింసలతో స్వాతంత్ర్య పోరాటాన్ని శిఖరాగ్రానికి చేర్చిన మహాత్మాగాంధీ, ఆజాద్ హింద్ ఫౌజ్ ను నడిపి సమరసేనానిగా నిలిచిన సుభాష్ చంద్రబోస్, చిరునవ్వుతో ఉరికంబమెక్కిన ధీరోదాత్తుడు భగత్ సింగ్ వంటి ఎందరో మహనీయుల త్యాగఫలం నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం. స్వాతంత్ర్య పోరాటంలోనూ, నవభారత నిర్మాణంలోనూ మహోన్నతమైన పాత్ర పోషించిన తొలిప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, తొలి హోంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్, మహోన్నత తాత్వికుడు, సంస్కర్త, భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహానుభావుల సేవలు చిరస్మరణీయాలు.
భారత స్వాతంత్ర్య సముపార్జన కోసం దేశమంతటా జరిగిన పోరాటంలో మన తెలంగాణ వీరులు ఉజ్వలమైన పాత్రను నిర్వహించారు. తుర్రేబాజ్ ఖాన్, రాంజీ గోండు, మౌల్వీ అలావుద్దీన్, భారత కోకిల సరోజినీ నాయుడు, సంగెం లక్ష్మీబాయి, రామానంద తీర్థ, పీవీ నర్సింహారావు మొదలైన వారు సాహసోపేతంగా చేసిన పోరాటం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. స్వాతంత్రోద్యమ సమయంలో తెలంగాణ ప్రజల పిలుపు మేరకు హైదరాబాద్ ను సందర్శించిన గాంధీజీ తెలంగాణ ప్రజల సామరస్య జీవనశైలిని గంగా జమునా తెహజీబ్ గా అభివర్ణించారు. అది మనకు గర్వకారణం అని కేసీఆర్ పేర్కొన్నారు.