CM KCR | నాగర్కర్నూల్ : ఒకప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కడ చూసినా గంజి కేంద్రాలు ఉండేవి.. ఇప్పుడు ఆ గంజి కేంద్రాలు మాయం అయ్యాయి.. పంటల కొనుగోలు కేంద్రాలు ప్రత్యక్షం అయ్యాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసు, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
తెలంగాణ రాకపోయి ఉంటే నాగర్కర్నూల్ జిల్లా కాకపోయేది. ఎస్పీ, కలెక్టరేట్ కార్యాలయాలు వచ్చేది కాదు. అద్భుతంగా ఈ భవననాలు రూపుదిద్దుకున్నాయి. తెలంగాణ ఉద్యమానికి చరిత్ర ఉంది. ఒకప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో చాలా వెనుకబాటు తనం ఉంది. ఇబ్బందులు ఉన్నాయి. సాగు, తాగునీటికి , కరెంట్కు ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ అర్థం కావాలంటే పాలమూరు ఎంపీగా ఉండాలని నిర్ణయించుకున్నాను. జయశంకర్ సార్ సూచన మేరకు పాలమూరు ఎంపీగా పోటీ చేసి గెలుపొందాను. ఆ రోజు వాస్తవంగా పాలమూరు జిల్లాలో ఉద్యమం బలంగా లేకుండే. కానీ మీరు చూపించిన ఆదరణతో ఎంపీగా గెలిపించారు. ఉద్యమ చరిత్రలో పాలమూరు జిల్లా పేరు శాశ్వతంగా ఉంటుంది. ఈ జిల్లా ఎంపీగా ఉంటూనే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించాను. ఈ జిల్లాను ఎప్పటికీ మరిచిపోను అని కేసీఆర్ స్పష్టం చేశారు.
సాధించుకున్న రాష్ట్రంలో తొమ్మిదేండ్లు గడిచిపోయాయి. ఈ తొమ్మిదేండ్లలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుని, భారతదేశంలోనే అగ్రభాగానా ఉన్నాం. అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉన్నాం. తలసరి ఆదాయంలో మనమే నంబర్ వన్. కరెంట్ వస్తదో రాదో తెలియని పరిస్థితి. తలసరి విద్యుత్ వినియోగంలో కూడా మనమే నంబర్ వన్. సంక్షేమ రంగంలో కూడా రూ. 50 వేల కోట్లు ఖర్చు పెడుతూ ముందున్నాం అని కేసీఆర్ తెలిపారు.
అణగారిని దళిత జాతిని ఉద్దరించాలనే ఉద్దేశంతో ఎక్కడా లేని విధంగా కుటుంబానికి 10 లక్షలు ఇచ్చి దళితబంధు ద్వారా ఆదుకుంటున్నాం అని కేసీఆర్ తెలిపారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఒక నాడు ముంబై బస్సులకు ఆలవాలం పాలమూరు. గంజి కేంద్రాలు వెలిసేవి. పాలమూరులో ఈ గంజి కేంద్రాలు ఏంటని ఏడ్చేవాళ్లం. గంజి కేంద్రాల పాలమూరు జిల్లాలో అవి మాయమయ్యాయి. పంట కొనుగోలు కేంద్రాలు వచ్చేశాయి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయం ఇది. కేసీఆర్ రాకముందు ఇక్కడ్నుంచి మంత్రులు ఉన్నారు. కానీ మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. పాలమూరును దత్తతను తీసుకున్నారు. కనీసం మంచినీళ్లు ఇవ్వలేకపోయారు. ఈ రోజు బ్రహ్మాండంగా మిషన్ భగీరథ ద్వారా కృష్ణా నీళ్లు దుంకుతున్నాయి. ఐదు మెడికల్ కాలేజీలు వచ్చాయి. నాగర్కర్నూల్ మెడికల్ కాలేజీకి ప్రత్యేకమైన చరిత్ర ఉంది. మహబూబ్నగర్, వనపర్తికి మంజూరు చేయగానే మీ ఎమ్మెల్యే నా దగ్గరికి వచ్చి మెడికల్ కాలేజీ కోరిండు. అప్పుడే ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి.. మెడికల్ కాలేజీ మంజూరు చేయించాం. ఐదు మెడికల్ కాలేజీలు పాలమూరు జిల్లాలోవ స్తాయనికలగన్నమా..? అని కేసీఆర్ ప్రశ్నించారు.