హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో దమ్మున్న ప్రధాని ఉంటేనే నిరంతర కరెంటు అందుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘కేంద్రం లెక్కల ప్రకారం దేశంలో 36,100 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. బొగ్గును తవ్వి తీసేటప్పుడు అంచనా వేసిన మొత్తంలో 40-50 శాతం మాత్రమే వస్తుంది. 40 శాతమే లెక్క వేసుకున్నా దేశంలోని బొగ్గు నిల్వలతో 125 ఏండ్లకు సరిపడా విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు.
ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్లో అత్యుత్తమ బొగ్గు ఉత్పత్తి చేసే మూడు బొగ్గుగనుల కోసం 250 కిలోమీటర్ల రైల్వే లైన్ వేయాలని కోల్ ఇండియా డబ్బు డిపాజిట్ చేసింది. ఒక దగ్గర 50 కిలోమీటర్లు, ఒక దగ్గర 120 కిలోమీటర్లు, ఒక దగ్గర 80 కిలోమీటర్లు వేయాల్సి ఉన్నది. 15 ఏండ్లయినా, కోలిండియా డబ్బు ఇచ్చినా రైల్వే లైన్ వేస్తలేరు’ అని కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వ్యాపార మిత్రులకు లాభం చేకూర్చేందుకు ఆస్ట్రేలియా నుంచి 30 కోట్ల టన్నుల బొగ్గును దిగుమతి చేస్తున్నారని మండిపడ్డారు.
‘రైల్వే లైన్ పూర్తి చేస్తే 30 కోట్ల టన్నులు ఉత్పత్తి అవుతుంది. కానీ ఉద్దేశపూర్వకంగా వ్యాపార మిత్రుల కోసం ఆస్ట్రేలియా నుంచి బొగ్గు తెస్తున్నరు. దేశంలో 3,500 టన్ను దొరికే బొగ్గును కాదని, 30 వేలకు టన్ను చొప్పున విదేశీ బొగ్గును కొనాలని మెడమీద కత్తిపెడుతున్నది, వాడకపోతే ఫైన్ వేస్తామని బెదిరిస్తున్నది మోదీ ప్రభుత్వం కాదా?’ అని ప్రశ్నించారు. తమకు బెంగాల్ నుంచి రైలులో తక్కువ ఖర్చుతో బొగ్గు రవాణా చేసుకునే వెసులుబాటు ఉన్నా.. పడవలో తీసుకొచ్చి, అదానీ పోర్టులో దించి, తీసుకుపోవాలని కేంద్రం ఒత్తిడితెస్తున్నదని పంజాబ్ సీఎం తనతో వాపోయారని చెప్పారు. ‘ఇట్లా అయితే దేశం బాగుపడుతదా? దేశానికి కరెంటు వస్తదా?’ అని ప్రశ్నించారు. ‘తెలంగాణలో రాలేదా? అట్లే దమ్మున్న ప్రధాని అయితే దేశం మొత్తం కరెంటు రాదా?’ అని అడిగారు.
కేసీఆర్ వచ్చిండు కదా.. నిమిషం కూడా కరెంటు పోదు
రాష్ట్రంలో ఐటీ, పారిశ్రామిక రంగం పెరుగుతున్నదని, వ్యవసాయం విస్తీర్ణం కూడా పెరిగిందని, ఈ ఏడాది అత్యధిక విద్యుత్తు డిమాండ్ వస్తుందని, సిద్ధంగా ఉండాలని విద్యుత్తు శాఖ మంత్రికి కొన్నాళ్లుగా చెప్తున్నానని అన్నారు. ‘ఐదారేండ్లుగా 24 గంటల కరెంటు ఇస్తున్నాం. అయినా కొందరు విజ్ఞత లేకుండా, ఇంగితం లేకుండా కరెంటు 24 గంటలు వస్తలేదు అని విమర్శిస్తున్నారు. అందుకే నాలుగు రోజుల కిందట సమీక్ష చేశా’ అని తెలిపారు.
‘గ్రిడ్ కొలాప్స్ కావొద్దంటే హెవీ ట్రాన్స్మిషన్ లైన్ల మీద 50 సైకిల్స్ మెయింటెన్ చేయాల్సి ఉంటుంది. 48 సైకిల్స్ కన్నా కిందికి రావొద్దు, 52 సైకిల్స్కు మించొద్దు. ఏమాత్రం తేడా వచ్చినా గ్రిడ్ కొలాప్స్ అవుతుంది. అనుకోకుండా లోడ్ వచ్చినప్పుడు అధికారులు రెండు, మూడు ప్రాంతాలకు విద్యుత్తు కట్ చేస్తరు. రెండు, మూడు గంటల్లో బ్యాలెన్స్ చేసుకొని, మళ్లీ కరెంటు సరఫరా చేస్తరు’ అని వివరించారు. అలా జరగొద్దంటే ఏం కావాలని తాను అడగ్గా, బడ్జెట్ పెంచాలని అధికారులు కోరారని చెప్పారు. దీంతో ఈ ఏడాది రూ.1,500 కోట్లు పెంచామని గుర్తు చేశారు.
‘అది సరిపోదు.. రోజుకు రూ.28 కోట్లు కావాలని అడిగితే, రూ.38 కోట్లయినా ఇస్తా ఒక్క నిమిషం కూడా కరెంటు పోవద్దని చెప్పిన. వెయ్యి కోట్లు ఎక్కువ ఖర్చయినా పర్లేదు కానీ ఒక్క నిమిషం కూడా పోనివ్వం. ప్రతిపక్షాలు ఆశపడుతున్నట్టు కానీయం. ఇప్పుడు కేసీఆర్ వచ్చిండు కదా మళ్లా కరెంటు పోదు’ అని స్పష్టం చేశారు. ఇటీవల 14,649 మెగావాట్ల అత్యధిక లోడ్ వచ్చిందని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో డిమాండ్ లేదని గుర్తు చేశారు. మార్చి వరకు ఇంకా పెరుగుతుందని, 16 వేల మెగావాట్లకు సిద్ధంగా ఉండాలని చెప్పానని అన్నారు. ‘ఎన్నో రాష్ర్టాల్లో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఉన్నయి. అక్కడ 24 గంటలు ఇస్తున్నరా? ఇక్కడ అద్ద గంట పోతెనే లొల్లి చేస్తున్నరు’ అంటూ ప్రతిపక్షాలకు చురకలు అంటించారు.