రాజన్న సిరిసిల్ల : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో కరీంనగర్ జిల్లా ఇవాళ ఒక సజీవ జలధారల అమృతవర్షిణిలా తయారైందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణం అనంతరం జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ.. నాలుగు జలధారలతో కరీంనగర్ నేడు అమృతవర్షిణిలా మారిందన్నారు. పశ్చిమభాగం, దక్షిణ భాగం కవర్ చేసేది మానేరు నది అన్నారు. అప్పర్మానేరు నుంచి గోదావరిలో కలిసేదాక మానేరు ఒక సజీవ జలధార అన్నారు. ఎస్ఆర్ఎస్పీ నుంచి ఉండేటటువంటి వరద కాల్వ రెండో సజీవ జలధార అన్నారు. వరద కాల్వ రిజర్వాయర్ అయితదని ఎవరూ కూడా అనుకోలేదన్నారు.
మూడవ సజీవ జలధార కాకతీయ కాలువ అన్నారు. కాళేశ్వరం మహత్యంతోని ఏడాదంతా ఈ కాలువలో నీళ్లు పారుతాయన్నారు. ఇక నాల్గొవ జలధార మన గోదావరి నది అన్నారు. లక్ష్మీబ్యారేజీ, సరస్వతి బ్యారేజీ, పార్వతీ బ్యారేజీ, ఎల్లంపల్లి బ్యారేజీ, కొత్తగా నిర్మించిన సబర్మాట్తో దాదాపు 180 కిలోమీటర్ల మేర గోదావరి నది సజీవమైనట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. వీటివల్ల నీళ్లు వచ్చినకాడ నీళ్లు వస్తయని.. రానికాడ భూగర్భ జలం పెరుగుతుందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మనదగ్గర 30 లక్షల కరెంట్ మోటార్లు ఉన్నట్లు తెలిపాన సీఎం భూగర్భ జల మట్టాల పెరుగదలతో రైతాంగానికి ఎంతో ప్రయోజనం చేకూరుంతుందన్నారు.
గత ఆరేడేండ్లలో వ్యవసాయంలో అద్భుతం జరిగిందని సీఎం అన్నారు. వలస పోయిన రైతులు ఊళ్లల్లకు వాపస్ వస్తున్నట్లు తెలిపారు. ఎమైనా గాని ఊరిలో మనకొక ఇళ్లు ఉండాలి అనుకుంటున్నరు. ఇది ఒక అద్భుతమైన మార్పు అన్నారు. తెలంగాణ తన పునాది తాను మళ్లి ఒకసారి బలంగా తయారు చేసుకుంటుందనేదానికి ఇది ఒక ఉదాహరణ అన్నారు.
తెలంగాణ సాధన క్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్, విద్యాసాగర్ రావు వంటి మేధావులతో అనేక అంశాలపై ఎంతో మేధోమథనం జరిగిందన్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఏర్పడినంక ఎక్కడినుంచి మొదలుపెట్టాలే అని యోచిస్తే సమైక్య పాలకులు తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన్రు. అక్కడి నుంచే మొదలు పెట్టాలని యోచించి కాకతీయ రెడ్డిరాజులు నిర్మించిన అద్భుత మైనర్ ఇరిగేషన్ నుంచే మొదలు పెట్టినట్లు ఈ క్రమంలో ఉద్భవించిందే మిషన్ కాకతీయ అని సీఎం తెలిపారు. ఈ పెద్ద యాదవ సమాజం ఉన్న ఉన్న తెలంగాణలో గొర్రెల దిగుమతి సిగ్గుచేటని తలచి రూ. 8 వేల కోట్లతో రెండు విడుతలుగా గొర్రెల పంపిణీని చేపట్టినట్లు తెలిపారు. అదేవిధంగా మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ ఇలా ప్రతీ కుల వృత్తికి చేయూతనిస్తూ ముందుకు వెళ్తున్నట్లు వివరించారు. కాళేశ్వరం కరెంట్ బిల్లు ఐదు వేల కోట్లు, ఏడు వేల కోట్ల రూపాయలు అని కొంతమంది అంటున్నరు. గతంలో అసెంబ్లీలోనే చెప్పా, తెలంగాణ రైతుల ఇండ్లు బంగారు వాసం అయ్యేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు కరెంట్ బిల్లు రూ.10 వేల కోట్లు అయినా ప్రభుత్వం కడతదని సీఎం పేర్కొన్నారు.