హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మరో హామీ నిలబెట్టుకున్నారు. మొత్తం 40 ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 5,544 మంది ఉద్యోగులను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. ఇందుకు సంబంధించిన ఫైళ్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం నూతన సచివాలయంలో సంతకం చేశారు. ఆ వెంటనే ఆర్థికశాఖ జీవో-38 జారీచేసింది. ప్రపంచ కార్మికులంతా ఘనంగా నిర్వహించుకునే మేడేకు సరిగ్గా ఒక్కరోజు ముందు కాంట్రాక్టు వ్యవస్థలోని ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జీవోలను జారీచేయడం విశేషం. ఇందుకు అనుగుణంగా ఆయా ప్రభుత్వ శాఖలు తమ పరిధిలోని ఉద్యోగులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు జారీచేయనున్నాయి.
అంచెలంచెలుగా.. అడ్డంకులు అధిగమించి..
తెలంగాణ ఉద్యమంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా భాగస్వామ్యులయ్యారు. అప్పట్లోనే ఉద్యమ నేత కేసీఆర్ స్వరాష్ట్రంలో కాంట్రాక్ట్ వ్యవస్థకు చరమగీతం పాడుతామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆ దిశగా చర్యలు చేపట్టారు. క్యాబినెట్ మీటింగ్లో ఈ అంశాన్ని ఆమోదించి, లెక్చరర్లను క్రమబద్ధీకరిస్తూ 2016 ఫిబ్రవరి 26న జీవో-16ను విడుదల చేశారు. అయితే, కొంతమంది ప్రతిపక్ష నేతలు నిరుద్యోగులను రెచ్చగొట్టి కోర్టు కెళ్లి క్రమబద్ధీకరణను నిలిపివేయించారు. క్రమబద్ధీకరణ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో కాంట్రాక్ట్ ఉద్యోగులకు న్యాయం చేయాలన్న తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచి లాభం చేకూర్చింది.
క్రమబద్ధీకరణ వల్ల కలిగే లాభాలు
లెక్చరర్లకు అనేక ప్రయోజనాలు
సీఎం కేసీఆర్ నిర్ణయంతో కాంట్రాక్ట్ లెక్చరర్లు అనేక ప్రయోజనాలు పొందారు. గతంలో రూ.18 వేలుగా ఉన్న వేతనాన్ని తెలంగాణ ప్రభుత్వం రూ.37,100కు పెంచి బేసిక్ పే మంజూరు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త కాలేజీలు మంజూరుచేసినా, పోస్టులు మంజూరుచేయలేదు. ఇది క్రమబద్ధీకరణకు కీలక అడ్డంకిగా మారింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆయా పోస్టులను మంజూరు చేస్తూ 2017 నవంబర్ 21న జీవో జారీ చేసింది.
గతంలో కాంట్రాక్ట్ లెక్చరర్లకు 10 నెలలకు మాత్రమే వేతనం మంజూరయ్యేది. దీంతో రెండు నెలలపాటు అధ్యాపకులకు వేతనాలు ఉండేవి కావు. కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం గౌరవాధ్యక్షుడిగా ఉన్న మంత్రి హరీశ్రావు చొరవతో 12 నెలల వేతనం మంజూరు చేస్తూ 2018 సెప్టెంబర్ 5న జీవో-222 విడుదలైంది.
తెలంగాణ ప్రభుత్వం చరిత్రలో తొలిసారిగా శాశ్వత ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్ ఉద్యోగులకు పీఆర్సీని వర్తింపజేసింది. 2021 జూన్ 17న జీవో-105 ద్వారా పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచింది. దీంతో ఇంటర్ అధ్యాపకుల వేతనం రూ.37, 100 నుంచి రూ.54,220కు పెరిగింది. డిగ్రీ అధ్యాపకులకు జీవో-104 ద్వారా, పాలిటెక్నిక్ అధ్యాపకులకు జీవో-106 ద్వారా వేతనాన్ని రూ.40,270 నుంచి రూ.58,850కి పెంచింది.
తొలి సంతకంతో సంక్షేమ ముద్ర
బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవమైన ఆదివారం మంత్రులు తొలి సంతకంతో సంక్షేమ ముద్ర వేశారు. ప్రత్యేక పూజల అనంతరం తమ చాంబర్లలో ఆసీనులైన మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఎంతో ప్రాధాన్యం కలిగిన ప్రజోపయోగమైన పనుల ఫైళ్లపై మొదటి సంతకం చేసి ప్రభుత్వ పారదర్శకతను చాటారు. జీహెచ్ఎంసీలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపుపై మంత్రి కేటీఆర్ సంతకం చేయగా, జంటనగరాల్లోని హిందూ దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాల దస్త్రంపై మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, రెండోవిడత దళితబంధు పథకంపై కొప్పుల ఈశ్వర్, కొత్త మండలాలకు ఐకేపీ భవన నిర్మాణాల అనుమతిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, వ్యవసాయ విద్యుత్తు మే నెల సబ్సిడీ కింద రూ.958 కోట్లు మంజూరుపై మంత్రి జీ జగదీశ్ రెడ్డి సంతకాలు చేశారు.
కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చరిత్రాత్మకం;వివిధ ఉద్యోగ సంఘాల నేతల హర్షం
రాష్ట్రంలోని 5,544 కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడం చరిత్రాత్మకమని వివిధ ఉద్యోగ సంఘాల నేతలు కొనియాడారు. ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నిలుపుకొన్నారని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, టీజీవో అధ్యక్షురాలు వీ మమత వేర్వేరు ప్రకటనల్లో హర్షం వ్యక్తం చేశారు. యావత్తు ఉద్యోగుల పక్షాన సీఎం కేసీఆర్కు, మంత్రులకు వారితో పాటు ఉద్యగ సంఘాల నేతలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో రాష్ట్ర పురోభివృద్ధికి మరింత కష్టపడుతామని వారంతా ప్రతినబూనారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై తెలంగాణ పారిశ్రామిక శిక్షణ సంస్థ సహాయ శిక్షణాధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లంబు సుధాకర్రెడ్డి, సంఘం ఉపాధ్యక్షురాలు శ్రీదేవి, తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి కన్వీనర్ మాచర్ల రామకృష్ణగౌడ్, ప్రభుత్వ కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేశ్, కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడార్ల శ్రీనివాస్, కాంట్రాక్ట్ అధ్యాపకుల జేఏసీ నేత కనకచంద్రం, టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుస్సేని, టీజీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు ఎంబీ కృష్ణాయాదవ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
రూ.603 కోట్లతో రూపొందించిన బీసీ, ఎంబీసీ కార్పొరేషన్ల యాక్షన్ ప్లాన్పై మంత్రి గంగుల కమలాకర్ నూతన సచివాలయంలో తొలి సంతకం చేశారు. తన చాంబర్లో ఆదివారం ఆసీనులయ్యారు. అనంతరం పలు కీలక ఫైళ్లపై సంతకాలు పెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బీసీ కొర్పొరేషన్ యాక్షన్ ప్లాన్కు రూ.303 కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్ యాక్షన్ ప్లాన్కు రూ.300 కోట్లు కేటాయించారు.
రానున్న సీజన్లో ఉచిత చేప పిల్లల పంపిణీకి సంబంధించిన ఫైల్పై పశుసంవర్ధక, మత్స్యశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ నూతన సచివాలయంలో తొలి సంతకం చేశారు. రావిర్యాలలో అత్యాధునిక టెక్నాలజీతో చేపట్టిన మెగా డెయిరీ నిర్మాణ పనుల కోసం రూ.75 కోట్ల గ్రాంట్ను విడుదలతోపాటు గొర్రెల పంపిణీకి సంబంధించిన మరో ఫైల్పై చేస్తూ మరో ఫైల్పై సంతకం పెట్టారు.
హైదరాబాద్ అబిడ్స్లో ఆదివాసీ యోధుడు రాంజీగోండు మ్యూజియాన్ని రూ.15 కోట్లతో నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించిన ఫైల్పై గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదివారం నూతన సచివాలయంలోని తన చాంబర్లో తొలి సంతకం చేశారు. సంప్రదాయాల పరిరక్షణలో దేశంలో సీఎం కేసీఆర్కు మించిన మరో నాయకుడు లేరని కొనియాడారు.
రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న 19,800 మంది ఉపాధ్యాయులకు రూ.34.25 కోట్లతో ట్యాబ్లను అందజేయనున్నారు. 5 వేల ప్రాథమిక పాఠశాలల్లో రూ.7.53 కోట్లతో లైబ్రరీ కార్నర్లు ఏర్పాటుచేయనున్నారు. విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆదివారం నూతన సచివాలయంలో ని తన చాంబర్లో సంబంధిత ఫైల్పై తొలి సంతకం చేశారు.