హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): అగ్రవర్ణ పేదలకు గురుకులాల ఏర్పాటు నిర్ణయం భేష్ అని కామారెడ్డికి చెందిన రెడ్డి ఐక్యవేదిక నాయకులు హర్షం వ్యక్తంచేశారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున అగ్రవర్ణ పేదల కోసం గురుకుల పాఠశాలు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ పార్టీ మ్యానిఫెస్టోలో చేర్చడం చాలా మంచి నిర్ణయమని పేర్కొన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లాకు చెందిన రెడ్డి ఐక్యవేదిక నాయకులు హైదరాబాద్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సమావేశమయ్యారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం తోడ్పడుతామని తెలిపారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో అగ్రవర్ణ పేదల పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. అగ్రవర్ణ పేదల పిల్లల చదువు గురించి ఆలోచించి తొలి అడుగు వేసిననేత సీఎం కేసీఆరేనని ప్రశంసించారు. రైతుబీమాతో ఎన్నో పేద కుటుంబాలను ఆదుకుంటున్నారని, అన్ని వర్గాలు బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను ఆమోదిస్తున్నాయని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ గెలుపు అభివృద్ధికి మలుపు అని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారని ప్రకటించగానే ప్రజలు, కార్యకర్తల్లో ఉత్సాహం వచ్చిందని, కేసీఆర్ రాకతో తమ ప్రాంతం అభివృద్ధిలో మరింత దూసుకెళ్తుందని ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నట్టు చెప్పారు. కేసీఆర్ గెలుపు కామారెడ్డికి శక్తినిస్తుందని, ఆ ప్రాంతం ఊహించలేనంత అభివృద్ధి చెందుతుందని అన్నారు. కామారెడ్డి ప్రాంతం రూపురేఖలు మారుతాయని, కామారెడ్డి జిల్లానే కాకుం డా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతోపాటు పొరుగు జిల్లాలు శాశ్వతంగా అభివృద్ధి చెం దుతాయని తెలిపారు. పరిశ్రమలు, సంస్థ లు వస్తాయని, ఉపాధి అవకాశాలకు ఢోకా ఉండబోదని తెలిపారు. సాగునీటి వనరులు పెరిగి రైతులెంతో లాభపడుతారని చెప్పా రు.
సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేసి గెలవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని రెడ్డి ఐక్యవేదిక నాయకులను కోరారు. సీఎం కేసీఆర్ దూరదృష్టి వల్ల అన్ని వర్గాలకు మేలు కలిగిందని పేరొన్నారు. అగ్రవర్ణాలతో సహా అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తుస్తున్నారని తెలిపారు. కామారెడ్డిలో భారీ మెజార్టీతో సీఎం కేసీఆర్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. కామారెడ్డిలో ని రాజబహద్దూర్ వెంకట్రామిరెడ్డి ట్రస్టుకు రెండెకరాలకు బదులు ఐదెకరాలు కేటాయిస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని రెడ్డి ఐక్యవేదిక నాయకులు ప్రస్తావించారు. భూ విస్తీర్ణాన్ని పెంచినందుకు సీఎం కేసీఆర్కు వారు కృతజ్ఞతలు తెలిపారు. భూకేటాయింపు త్వరితగతిన జరిగేలా తాను చొరవ తీసుకుంటానని కవి త సానుకూలంగా స్పందించారు. కవితను కలిసినవారిలో రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు సంతోష్రెడ్డి, కామారెడ్డి రాజబహద్దూర్ వెంకట్రామిరెడ్డి ట్రస్టు చైర్మన్ నాగర్తి చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ నల్లవెల్లి కరుణాకర్రెడ్డి, నాయకులు గంగారెడ్డి, రమేశ్రెడ్డి, రాంరెడ్డి, మల్లారెడ్డి, భీం రెడ్డి, నర్సారెడ్డి, రాజ్కుమార్రెడ్డి, ఏలేటి రాంరెడ్డి వెల్మ మల్లారెడ్డి, నవీన్రెడ్డి, నర్సారెడ్డి, మధుసూదన్రెడ్డి, లింగారెడ్డి పాల్గొన్నారు.