CM KCR | బెల్లంపల్లి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై కేసీఆర్ సెటైర్లు వేశారు. చెన్నూరులో చెల్లని రూపాయి.. బెల్లంపల్లిలో చెల్లుతదా? అని ప్రశ్నించారు కేసీఆర్.
ఇవాళ డబ్బు కట్టలు పట్టుకొని దిగుతున్నరు. ఎన్నికలు అయిపోతే మళ్లీ కనడబరు.. చెన్నూరు ప్రజలు ఈ మనిషిని నాలుగుసార్లు ఓడగొట్టారు. ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ మనిషిని. మరి చెన్నూరులో చెల్లని రూపాయి.. బెల్లంపల్లిలో చెల్లుతుదా..? చెన్నూరులోనే చెల్లకపాయే వాళ్లే తీసికొట్టిరి. మరి బెల్లంపల్లిలో ఉన్న మనం తెలివి తక్కువ వాళ్లమా..? చెన్నూరు కంటే మనం తెలివి గల వాళ్లమే కదా..? మరి రుజువు చేయాలి. అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ ఎట్ల చెల్లుతది. వాళ్లు తిరస్కరించిన తర్వాత మనం ఎట్ల గెలిపిస్తాం. ఎలక్షన్ల తర్వాత ఉంటారా..? కడుపునొచ్చినా.. కాళ్లు నొచ్చినా కనబడుతారా..? ఎన్నికలు రాగానే సూట్కేసులు పట్టుకోవాలా..? డబ్బు సంచులు పట్టుకోవాలా..? దిగాలా.? వాన్ని వీన్ని కొని గోల్ మాల్ చేయాలా.. ఇదే వారి పని. మంచిగున్న ప్రజా ప్రతినిధులను కొందరిని కొంటున్నారు అని కేసీఆర్ మండిపడ్డారు.
చిన్నయ్య నువ్వేం ఫికర్ చేయకు. అమ్ముడుపోతే వాడొక్కడే గడ్డపారలాగా అమ్ముడుపోతడు. ఇవాళ ప్రజల్లో చైతన్యం ఉంది. ప్రజలు నీ పక్షాన ఉంటారు. ప్రజలు న్యాయం చెప్తారు. ఎవడో నలుగురు అమ్ముడుపోయినంత మాత్రాన వాడు తలమాసినోడు అయితడు గానీ మనం కాము. ఈ ప్రజలే మనల్ని కాపాడుతారు. ప్రజల ఆశీర్వాదమే మనకు శ్రీరామరక్ష. కాంగ్రెస్, బీజేపోళ్లకు సెల్ఫ్ ఉండదు. ఢిల్లీలో కట్క వేస్తేనే ఇక్కడ లైట్ వెలుగుతది. మాకు ఎవ్వరూ బాసులు లేరు.. తెలంగాణ ప్రజలే మా బాసులు. మీ అవసరాలు, మంచి చెడు గురించి, మీ ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా మేం పని చేస్తున్నామని కేసీఆర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.