CM KCR | హాలియా : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. రెండేండ్లలో కాదు.. నాలుగేండ్లలో 24 గంటల కరెంట్ ఇస్తే.. నేను కాంగ్రెస్ పార్టీ కండువా తీసి, గులాబీ కండువా కప్పుకుంటానని జానారెడ్డి చెప్పారు. ఏడాదిన్నరలోనే 24 గంటల కరెంట్ ఇచ్చాం. కానీ జానారెడ్డి మాట మీద నిలబడలేదు.. ఆయన పార్టీ మారలేదు.. గులాబీ కండువా కప్పుకోలేదు అని కేసీఆర్ గుర్తు చేశారు. హాలియాలో ఏర్పాటు చేసిన నాగార్జున సాగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నుడూ కూడా ధైర్యంతో పని చేసి అన్ని వర్గాలను ఆదుకునే పని చేయలేదు. జానారెడ్డి పెద్ద నాయకుడిగా ఉండే. మినిస్టర్గా ఉండే. అపోజిషన్ లీడర్గా ఉండే. నేను సీఎం అయిన ప్రారంభంలో కరెంటో కష్టాలు ఘోరంగా ఉండే. మీకు అప్పుడప్పుడు సాగర్ నీళ్లు వచ్చేవి. మహబూబ్నగర్, మెదక్ జిల్లాల ప్రజలు వలసపోయారు. పశువులకు గడ్డి లేక కబేళాలకు అమ్మేసి అన్నమో రామచంద్ర అని పొట్ట చేతబట్టుకుని బతుకపోయేది. దుర్భరంగా ఉండే. చాలా కష్టపడి మూడు నాలుగు నెలలు ఆర్థిక నిపుణులతో చర్చించి ముందుకు వెళ్లామని కేసీఆర్ తెలిపారు.
కచ్చితంగా కరెంట్ విషయంలో మంచి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించాం. నేనే అసెంబ్లీలో మాట్లాడుతూ.. రెండేండ్లలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తానని ప్రకటన చేశాను. ఆనాడు జానారెడ్డి అపోజిషన్ లీడర్గా ఉండే. కేసీఆర్ రెండేండ్లలో కాదు.. నాలుగేండ్లలో కరెంట్ ఇచ్చినా నేను కాంగ్రెస్ కండువా తీసి గులాబీ కండువా కప్పుకుని మీ కార్యకర్తలా పని చేస్తానని మాట్లాడిండు. కానీ ఏడాదిన్నర లోపే 24 గంటల కరెంట్ ఇచ్చాను. నేను సక్సెస్ అయ్యాను. జానారెడ్డి మాట మీద నిలబడలేదు. ఆయన పార్టీ మారలేదు, గులాబీ కండువా కప్పుకోలేదు. గత ఎన్నికల్లో ఉల్టా భగత్ మీద నిలబడ్డారు. మీరంతా జానారెడ్డికి తగిన బుద్ధి చెప్పారు. ఇప్పుడు కూడా పార్టీల వైఖరి గురించి ఆలోచించి నిర్ణయం చేయాలి. అప్పుడే మేలు జరుగుతది. నిజంగా ఎవరి చేతుల్లో ఈ రాష్ట్రం ఉంటే బాగుంటుందో ఆలోచించాలి. మీ నిర్ణయం చాలా జాగ్రత్తగా ఉండాలి అని కేసీఆర్ సూచించారు.
జానారెడ్డి మంత్రిగా ఉండే.. పెద్ద నాయకుడిగా ఉండే.. ఇక ఇప్పుడు కూడా కల కంటున్నాడు ముఖ్యమంత్రి అయితా అని. కానీ ఆయన హయాంలో నాగార్జున సాగర్లో ఓ డిగ్రీ కాలేజీ కూడా దిక్కు లేకుండే. నోముల భగత్ ఎమ్మెల్యే అయ్యాక డిగ్రీ కాలేజీ మంజూరు చేశాను. హాలియాలో 50 పడకల దవాఖానా దిక్కు లేకుండే. అది కూడా భగత్ చేయించారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం పరిధిలో రెండు లిఫ్ట్ గిరిగేషన్ పనులు ప్రారంభమయ్యాయి. ఎనిమిది నెలల్లో పూర్తవుతాయి. నేనే వచ్చి ప్రారంభం చేస్తాను అని కేసీఆర్ తెలిపారు.