CM KCR | మెదక్ : రాజకీయాలు అంటే సులభంగా తీసుకోవద్దు.. ఓటును సులభంగా వేయొద్దు అని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. రాజకీయం అంటే చాలా గంభీరమైన విషయం.. ఇదేమీ సినిమా మ్యాట్నీ షో కాదు. ఎవడో చెప్పిండని ఓటేస్తే ఆ ఓటే మనల్ని కాటేస్తది. అందుకే జాగ్రత్త అని మనవి చేస్తున్నా అని కేసీఆర్ పేర్కొన్నారు. మెదక్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ సరిపోతది. 10 హెచ్పీ మోటారు పెట్టుకోవాలని రేవంత్ రెడ్డి అంటుండు. రైతుల వద్ద ఈ మోటార్లు ఉంటాయా..? మన రైతుల వద్ద 3, 5 హెచ్పీ మోటార్లు ఉంటాయి. మరి 10 హెచ్పీ మోటార్లు పెట్టాలంటే.. మన వద్ద 30 లక్షల పంపు సెట్లు ఉన్నాయి. 30 లక్షల పంపు సెట్లకు 10 హెచ్పీ మోటార్లు కొనాలంటే ఎవడు డబ్బులివ్వాలి..? అని కేసీఆర్ ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తామని అంటున్నరు. రైతుబంధు విడుదలైతే టింగ్ టింగ్ మని సెల్ఫోన్ మోగుతది. మీ ఖాతాలో డబ్బులు పడుతున్నాయి. ఏ ఆఫీసు తిరగకుండా, లంచం ఇవ్వకుండా డబ్బులు వస్తున్నాయి. రైతుబీమా కూడా అదే తరహాలో వస్తుంది. ధాన్యం కొనుగోలు చేశాక నాలుగైదు రోజుల్లో డబ్బు పడుతుంది. ధరణి బంగాళాఖాతంలో వేస్తే ఈ డబ్బులు ఎలా వస్తాయి. మీ ఓటుతోనే మీ వేలితోనే మీ కన్ను పొడిపించాలని చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. ధరణి తీసేస్తే చాలా ప్రమాదాలు వస్తాయి. లంచాలు, దళారీలు, పైరవీకారుల రాజ్యం వస్తది. కాంగ్రెస్ పార్టీ అనాలోచితంగా, అవగాహన లేకుండా మాట్లాడుతోంది. ధరణి ఎత్తేస్తాం, 3 గంటల కరెంట్ ఇస్తాం.. ఇది మా పాలసీ అని చెబుతున్నారని కేసీఆర్ తెలిపారు.
డీకే శివకుమార్ కర్ణాటక నుంచి వచ్చి మా రాష్ట్రంలో మేం 5 గంటల కరెంట్ ఇస్తున్నాం అని చెబుతుండు. అరే సన్నాసి మా దగ్గర 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పిన. ఐదు గంటలు ఇచ్చేటోడు వచ్చి 24 గంటలు ఇచ్చేకాడ వచ్చి చెబుతుండ్రు. ఇది కాంగ్రెస్ విధానం. అదే కర్ణాటకలో 20 గంటల కరెంట్ ఇస్తమని చెప్పారు. కర్ణాటక రైతులు వచ్చి గొడగొడ ఏడుస్తుండ్రు. దొంగ కాంగ్రెస్ను నమ్మి మోసపోకండి.. మా బతుకు పోయిందని అంటున్నారు కర్ణాటక రైతులు. కాబట్టి ఎవడో చెప్పిండని ఓటేస్తే ఆ ఓటే మనల్ని కాటేస్తది అని కేసీఆర్ తెలిపారు.