హైదరాబాద్ : సీపీఐ తెలంగాణ రాష్ట్ర నూతన కార్యదర్శిగా ఎన్నికైన కూనంనేని సాంబశివరావుకు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ఫోన్ చేశారు. రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైనందుకు కూనంనేనికి కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పదవికి ఆ పార్టీ నేత పల్లా వెంకట్రెడ్డి, సాంబశివరావు పోటీ పడ్డారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో నిర్వహించిన సీపీఐ 3వ రాష్ట్ర మహాసభల్లో బుధవారం ఈ ఎన్నికపై అర్ధరాత్రి వరకూ వాడీవేడి చర్చలు జరిగాయి. ఇద్దరు నేతలూ పట్టువీడకపోవడంతో హైడ్రామా నడుమ ఓటింగ్ నిర్వహించారు. మొత్తం 110 ఓట్లు పోలయ్యాయి.
ఇందులో సాంబశివరావుకు 59, పల్లా వెంకట్రెడ్డికి 45 ఓట్లు రాగా, మరో ఏడు ఓట్లు చెల్లకుండా పోయాయి. దీంతో కూనంనేని సాంబశివరావు విజయం సాధించినట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. సీపీఐ 3వ మహాసభ వరకు రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పనిచేసిన కూనంనేని సాంబశివరావు గతంలో కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండుసార్లు చాడ వెంకట్రెడ్డి పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. పార్టీ నియమావళి ప్రకారం మూడు సార్లు మాత్రమే కొనసాగే అవకాశముంది. మూడోసారీ తనకే అవకాశం ఇవ్వాలని చాడ కోరినట్లు తెలిసింది. అయితే ఈసారి తనకు అవకాశం కల్పించాలని కూనంనేని పట్టుబట్టినట్లు సమాచారం. దీంతో ఇద్దరి మధ్య పోటీకి దారితీసింది. అయితే ఏకగ్రీవమైతేనే తాను కొనసాగుతానని, పోటీ అనివార్యమైతే తప్పుకుంటానని చాడా ప్రకటించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పల్లా వెంకట్రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. పార్టీ అధిష్ఠానం బుజ్జగించినప్పటికీ ఇద్దరు నేతలు వినకపోవడంతో ఓటింగ్ అనివార్యమైంది.