CM KCR | కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిని బంగాళాఖాతం వేస్తామంటోందని.. ప్రజలు ఓటు ఆయుధంతో ఆ పార్టీనే బంగాళాఖాతంలో వేయాలని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఆశీర్వాద సభలో పాల్గొని మాట్లాడారు. ‘ఒక్కటే విషయం మనవి చేసేందుకు వచ్చాను. పైళ్ల శేఖర్రెడ్డి గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయనను వరుస విజయాలు అందిస్తూ.. సేవలు పొందుతూ చాలా అద్భుతంగా ముందుకుపోతున్నరు. ముఖ్యంగా నేను మనవి చేసేది ఒక్కటే. కరువు ప్రాంతంగా ఉన్న భువనగిరిలో నేడు అద్భుతమైన పంటలు పండుతున్నయ్. ఇక్కడ ఉన్న కాలువలు, గోదావరి జలాలు ఈ ప్రాంతానికి రావాలని ఎన్నో కలలు కన్నాం. కాలువల పనులు జరుగుతున్నయ్. త్వరలోనే కంప్లీట్ అవుతాయి’ అని తెలిపారు.
‘అన్నింటికి మించి ఈ జిల్లాకు భగవంతుడి పేరును కలిపి యాదాద్రి భువనగిరి జిల్లా అని పేరుపెట్టుకున్నాం. లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో తెలంగాణకాకపోతే భువనగిరి జిల్లానే కాకపోతుండే. జిల్లా అయ్యిందంటే మీ అందరి పోరాట ఫలితం.. తెలంగాణ రాష్ట్రం పుణ్యమా అని భువనగిరి జిల్లాను చేసుకోగలిగాం. మంచి కలెక్టరేట్ను నేనే వచ్చి ప్రారంభించుకోవడం జరిగింది. మీ అందరి సహకారంతో.. మళ్లీ శేఖర్రెడ్డిని గెలిపిస్తారు కాబట్టి.. ఆయన ఆధ్వర్యంలోనే నేనే స్వయంగా వచ్చి దాదాపు 98శాతం పూర్తయినటువంటి బస్వాపూర్ రిజర్వాయర్ అయిన నృసింహసాగర్ దేవుని పేరే పెట్టుకున్నాం. దాన్ని ప్రారంభించుకుంటే లక్ష ఎకరాలకు నియోజకవర్గం అంతా బ్రహ్మాండంగా నీళ్లు వస్తయ్. కలల కూడా అనుకోలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని బస్వాపూర్ ప్రాజెక్టు దాదాపు పూర్తయ్యింది’ అన్నారు.
‘గత కాంగ్రెస్ ప్రభుత్వం భువనగిరి అరాచక శక్తులను పెంచి పోషించింది. వారు ప్రజలను గోసబుచ్చుకున్నరు. అరాచక, కిరాతక మూకలను ఏ విధంగా టీఆర్ఎస్ ఏరిపారేసిందో మీ అందరికీ తెలుసు. ఇవాళ భువనగిరి ప్రజలు బ్రహ్మాండంగా శాంతియుతమైన జీవనం సాగిస్తున్నరు. దానికి మీ అందరినీ అభినందిస్తున్నా. ఈ రోజు ఎన్నికలు వచ్చినప్పుడు ఆగం కావొద్దు. వాస్తవమేంటో గుర్తించాలి. మంచి చెడు ఆలోచించి ఓటు వేయాలి. ఉద్వేగంలో కొట్టుకొనిపోయి ఓటేస్తే మన జీవితాలను తలకింద చేసే పరిస్థితి ఉంటది. ధరణిని అనే పోర్టల్ తెచ్చాం. రైతులకే హక్కులు ఉండాలని.. తరతరాల నుంచి ఉన్నయ్ ఉంటయ్. ఎన్నో కష్టాలు పడి వాటిని కాపాడుకుంటారు’ అన్నారు.
‘గవర్నమెంట్లో వేరియస్ లెవల్స్లో వీఆర్వో నుంచి మొదలుకొని సీఎం వరకు అధికారం ఉండేది. ఎవరో ఒకరికి కోపం వచ్చినా రైతుపేరు తీసి ఒంకొకల పేరు పెట్టేది. ఎన్ని బాధలు పెట్టినారో మనకు తెలుసు. రిజిస్ట్రేషన్కు ఎన్ని పాట్లు పడ్డామో తెలుసు. ధరణి పోర్టల్ వల్ల ఒకల భూములను లాక్కునే పరిస్థితి లేదు. ఇవాళ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నరు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తామంటున్నరు. ఒకసారి ధరణి పోతే మళ్లీ వీఆర్వోలు, అధికారుల రాజ్యం వస్తుంది. మళ్లీ భూములు కిందమీద అవుతయ్. మళ్లీ తహసీల్దార్ ఆఫీసులు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుంది. నీ భూమిని మార్చే హక్కు నీ బొటనవేలి ముద్రతో మాత్రమే అధికారాన్ని మార్చి.. ప్రభుత్వం మీ వద్దకు తీసుకువచ్చింది. భూమి మారాలంటే మీ వేలి ముద్ర పడితే తప్పా.. వేలిముద్ర పడితే తప్ప.. ముఖ్యమంత్రి కూడా అధికారం లేదు. ఈ అధికారాన్ని ప్రభుత్వం మీకు అప్పగించింది. దాన్ని ఉంచుకోవాల్నా.. పోడగొట్టుకోవాల్నా ఆలోచించాలి’ అన్నారు.