CM KCR | మహబూబాబాద్ : రాష్ట్రంలోని ప్రతి మారుమూల గోండు, కోయ, ఆదివాసీ గూడేలకు, ప్రతి లంబాడీ తండాకు, వ్యవసాయానికి త్రీ ఫేజ్ కరెంట్ ఇవ్వాలని ఆదేశించాం.. రూ. 300 కోట్లతో పనులు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. మహబూబాబాద్ నియోజవకర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
బీఆర్ఎస్ సర్కార్ ఉంటే ప్రగతి కంటిన్యూగా ఉంటుంది.. లాభం జరుగుతదని కేసీఆర్ తెలిపారు. 50 ఏండ్ల కాంగ్రెస్ రాజ్యం ఎలా ఉండే..? ఈ పదేండ్ల నుంచి ప్రజారాజ్యం ఎలా నడుస్తుందని ఆలోచించి, ఓటు వేయాలి. ఎమ్మెల్యే శంకర్ నాయక్ నాయకత్వంలో 20 వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చాం. పోడు భూముల సందర్భంగా జరిగిన ఆందోళన కేసులను రద్దు చేశాం. పోడు పట్టాలతో పాటు రైతుబంధు కూడా ఇచ్చాం. రైతుబీమా కూడా చేయించాం. గిరిజన ఆవాసాల్లో త్రీ ఫేజ్ కరెంట్ లేని చోటకు లైన్లు వేయించాం. ప్రతి మారుమూల గోండు, కోయ, ఆదివాసీ గూడెలకు, ప్రతి లంబాడీ తండాకు, వ్యవసాయానికి త్రీఫేజ్ కరెంట్ ఇవ్వాలని ఆదేశించాం. రూ. 300 కోట్లతో పనులు జరుగుతున్నాయి. దళారీలు, పైరవీకారులు లేరు. పల్లెలు, తండాలు ప్రశాంతంగా ఉన్నాయి అని కేసీఆర్ తెలిపారు.
గిరిజన బిడ్డల కోసం గురుకులాలు స్థాపించామని కేసీఆర్ గుర్తు చేశారు. మహబూబాబాద్కు ఇంజినీరింగ్ కాలేజీ కూడా వచ్చింది. భవిష్యత్లో మరిన్ని విద్యాసంస్థలు వస్తాయి. మహబూబాబాద్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. పుష్కలంగా నీళ్లు వస్తున్నాయి. అద్భుతమైన అభివృద్ధి జరిగింది. ఈ అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ కచ్చితంగా గెలవాలి. కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ఊడగొట్టి 60 ఏండ్లు ఏడిపించింది. ఇప్పుడు మళ్లీ మోసం చేసేందుకు వస్తున్నారు.ఆగం కాకుండా ఆలోచించి ఓటు వేయాలని మానుకోట ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.