హైదరాబాద్: పరిశ్రమలకు అనుమతి మంజూరు ప్రక్రియలో అలసత్వానికి, అవినీతికి అవకాశం లేకుండా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ఐపాస్ (TS-iPASS) చట్టం దేశానికే మార్గదర్శకంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. 24 గంటల నిరంతర విద్యుత్ పారిశ్రామిక రంగంలో నూతనోత్తేజాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా, పరిశ్రమలకు తెలంగాణ స్వర్గధామంగా మారిందన్నారు. 2.51 లక్షల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు వచ్చాయని, పారిశ్రామిక రంగంలో గత తొమ్మిదిన్నరేండ్లలో 17.21 లక్షల మందికి ఉపాధి లభించిందన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గోల్కొండ కోటపై ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐటీ రంగంలోనూ తెలంగాణ మేటిగా నిలుస్తుందన్నారు. తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో 3 లక్షల 23 వేల 39 మంది ఐటీ ఉద్యోగులు ఉండగా, రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 6 లక్షలకుపైగా ఉద్యోగాలు సృష్టించబడ్డాయని చెప్పారు.
2014 నాటికి ఐటీ ఎగుమతులు రూ.57 వేల 258 కోట్లు కాగా, 2014 నుంచి 2023 నాటికి 2 లక్షల 41 వేల 275 కోట్లకు పెరిగాయి. ఐటీ రంగాన్ని ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్నగర్, సిద్దిపేట వంటి ద్వితీయశ్రేణి నగరాలకు కూడా విస్తరింపజేస్తూ, ప్రభుత్వం ఐటీ టవర్స్ను నిర్మించిందని తెలిపారు. తద్వారా గతానికి భిన్నంగా అభివృద్ధిని సైతం వికేంద్రీకరిస్తున్నదని చెప్పారు.
‘సంపద పెంచు-ప్రజలకు పంచు’ అనే సదాశయంతో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా తెలంగాణలో పేదరికం తగ్గుతున్నదని, తలసరి ఆదాయం పెరుగుతున్నదని నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన బహుముఖీయ పేదరిక సూచీ స్పష్టం చేసిందన్నారు. జాతీయ స్థాయిలో నమోదైన సగటు పేదరికంతో పోల్చిచూస్తే తెలంగాణలో పేదరికం అందులో మూడోవంతుగా నమోదైందని చెప్పారు. ఈ నివేదిక ప్రకారం 2015-16 నాటికి తెలంగాణలో 13.18 శాతంగా ఉన్న పేదరికం, 2019-21 నాటికి 5.88 శాతానికి దిగివచ్చిందని తెలిపారు. అంటే, ఏకంగా 7.3 శాతం పేదరికం కనుమరుగైందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర, సమ్మిళిత, సమీకృత అభివృద్ధిని సాధిస్తూ పురోగమిస్తున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ, నగర ప్రాంతాల్లోనూ ఏకకాలంలో మౌలిక వసతుల కల్పన చేస్తూ సమగ్ర దృక్పథాన్ని అవలంభిస్తున్నదని వెల్లడించారు. దళిత బడుగు, బలహీన వర్గాలు, రైతాంగం మొదలుకొని అగ్రవర్ణ పేదల వరకూ అందరికీ సంక్షేమ ఫలాలను అందజేస్తూ, సమ్మిళిత అభివృద్ధిని సాధిస్తున్నదని చెప్పారు. వికేంద్రీకరణను ఒక విలువగా పాటిస్తూ పరిపాలనలో సంస్కరణలు చేసిందన్నారు. అదే విధంగా పరిశ్రమలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజేస్తూ అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నదని వెల్లడించారు. అభివృద్ధికి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యతనిస్తూ పేదవర్గాలను ఆదుకుంటున్నదని తెలిపారు. అందుకే నేడు దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం తెలంగాణ అభివృద్ధి నమూనాకు జై కొడుతున్నారని చెప్పారు. అతి పిన్న రాష్ట్రం తెలంగాణ అభివృద్ధి మోడల్ గురించి ఇప్పుడు దేశమంతటా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉండటం మనందరికీ గర్వకారణం. ఇది తెలంగాణ ప్రభుత్వ ప్రతిభకు, పటిమకు తిరుగులేని నిదర్శనమని వెల్లడించారు.