CM KCR | రాష్ట్ర ఆవిర్భావం జరిగిన వెంటనే దశాబ్దాల తరబడి ప్రజలను పీడిస్తున్న అనేక గడ్డు సమస్యలను ప్రభుత్వం శాశ్వతంగా పరిష్కరించిందని సీఎం కేసీఆర్ అన్నారు. అస్తవ్యస్తంగా తయారైన గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సంపూర్ణ పరివర్తనను సాధించేందుకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరుతో సమగ్ర ప్రణాళిలను ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ ప్రణాళికలు అద్భుతమైన ఫలితాలను సాధించాయని గుర్తు చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను సీఎం కేసీఆర్ లాంఛనంగా ఆరంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
‘ ఒకప్పుడు తెలంగాణ పల్లెలు, పట్టణాల్లో ఎక్కడ చూసినా చెత్తా చెదారం పేరుకుపోయి కనిపించేది. పరిసరాలు అపరిశుభ్రంగానూ, దుర్గంధ భూయిష్టంగానూ ఉండేవి. పాడుబడిన ఇళ్ల శిథిలాలు నిరుపయోగమై, ప్రమాదకరంగా ఉన్న బావులు, పసిపిల్లలు పడిపోయే విధంగా బోరు పొక్కలు వంగి, మెలికలు తిరిగిన, విరిగి పోయిన విద్యుత్ స్తంభాలు, జారిపోయి ఎక్కడ షాక్ కొడతాయో అనేలా వేలాడుతూ భయపెట్టే విద్యుత్ తీగెలు, గుంతలమయమైన రోడ్లు, బురదమయమైన వీధులు, పిచ్చిచెట్ల పొదలు, మురుగు పేరుకుపోయిన కాల్వలు, మిణుకు మిణుకుమనే వీధిలైట్లతో, పల్లెలు మురికికూపాల్లా ఉండేవి, పట్టణాలు నరకానికి నకళ్లుగా కనిపించేవి. చివరికి ఎవరైనా మరణిస్తే, వారికి గౌరవప్రదంగా అంత్యక్రియలకు కూడా స్థలం వెతుక్కోవాల్సిన అనాగరిక స్థితి ఆనాడు ఆవరించి ఉండేది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా, పల్లెలు, పట్టణాల సమగ్రాభివృద్ధి కోసం చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు గ్రామాల, పట్టణాల రూపురేఖలనే మార్చివేశాయి.’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
‘ నేడు పల్లెలు, పట్టణాలు మౌలిక వసతులతో పరిశుభ్రతతో, పచ్చదనంతో ఆహ్లాదకరంగా రూపొందాయి. ఈ పరిణామం అంత సులభంగా జరగలేదు. పటిష్టమైన చట్టాలు, సమగ్రమైన ప్రణాళిక, యుద్ధ ప్రాతిపదికన మౌలిక వసతుల నిర్మాణం చేయడం వల్లనే ఈ అద్భుతమైన పరివర్తన సాధ్యమైంది. 2014 ముందు స్థానిక సంస్థలకు తమ బాధ్యతలు, విధులకు సంబంధించి సరైన మార్గనిర్దేశనం ఉండేది కాదు. జవాబుదారీతనం లేని స్థానిక నాయకత్వం రాజకీయాలకు, పైరవీలకే పరిమితమయ్యేది. దీంతో పల్లెలు, పట్టణాల పరిస్థితి అధ్వాన్న దశలో ఉండేది. స్థానిక సంస్థల పనితీరును మార్చేందుకు ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని, పురపాలక చట్టాన్ని ప్రవేశ పెట్టింది. నాయకులు, ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉంటూ, పారదర్శకంగా, బాధ్యతాయుత పాలన అందించే విధంగానూ, పన్నులు సమర్థవంతంగా వసూలు చేయడంతోపాటూ, పారిశుద్ధ్యం, పచ్చదనం పెంచే విధంగానూ వారికి స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించింది. లక్ష్యాల సాధనలో అలసత్వం ప్రదర్శించిన, నిర్లక్ష్యం వహించిన ఉద్యోగులతోపాటూ, ప్రజాప్రతినిధులపై సైతం కఠిన చర్యలు తీసుకునే నిబంధనలను ఈ చట్టంలో పొందుపరిచింది. దీంతో స్థానిక సంస్థల పనితీరులో అద్భుతమైన మార్పు వచ్చింది.’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.
‘ గతంలో మూడు నాలుగు గ్రామాలకు కలిపి ఒక కార్యదర్శి ఉంటే గొప్ప. తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శిని నియమించింది. పారిశుద్ధ్య నిర్వహణకు, మొక్కల పెంపకానికి కావాల్సిన సాధనాలను సమకూర్చింది. ఈ రోజు తెలంగాణలోని ప్రతి గ్రామం ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ను కలిగి ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకూ ఈ రకమైన వసతులు లేవు. గ్రామ, పట్టణ పరిపాలనను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రభుత్వం లోకల్ బాడీ కలెక్టర్లను కూడా నియమించింది. ఈ చర్యల ఫలితంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలు కొత్తరూపును సంతరించుకున్నాయి. మన రాష్ట్రానికి దేశస్థాయిలో కీర్తి, ప్రతిష్టలను సమకూర్చి పెట్టాయి. ఈ కార్యక్రమాల ద్వారా పల్లెలు, పట్టణాలలో పరిశుభ్రత, మంచినీటి వసతి, చెట్ల పెంపకం, అంతర్గత రహదారుల నిర్మాణం, మురుగుకాల్వల నిర్వహణ, హరితహారం, వైకుంఠధామాలు, రైతు కేంద్రాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలిగాం. ఉత్తమ పంచాయతీలకు ఉండవలసిన అన్ని అర్హతలు మనం కల్పించుకోగలిగాం.’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
‘ తెలంగాణలోని 12,769 గ్రామాలను అంటే 100 శాతం గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వం ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలుగా తీర్చిదిద్ది దేశంలోనే టాప్ ర్యాంక్ను సాధించింది. ఇటీవల న్యూఢిల్లీలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మన పల్లెలకు 13 జాతీయ అవార్డులు లభించాయి. వీటిని రాష్ట్రపతి చేతులమీదుగా ఆయా స్థానిక సంస్థల ప్రతినిధులు అందుకోవడం మనందరికీ ఎంతో గర్వకారణం. నేడు తెలంగాణ గ్రామాలను చూసిన వారెవరైనా ఇవి ఒకప్పటి గ్రామాలేనా? ఇంతలో ఎంత మార్పు? అని ఆశ్చర్యపోయే విధంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి జరిగింది. తెలంగాణలోని పురపాలికలు భారీ సంఖ్యలో జాతీయ అవార్డులను పొందడం పట్టణ ప్రగతి విజయానికి నిదర్శనం. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 అవార్డుల్లో రాష్ట్రంలోని 23 పట్టణ స్థానిక సంస్థలు అవార్డుల్ని గెల్చుకున్నాయి.’ అని సీఎం కేసీఆర్ అన్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన జీవనాన్ని, రాష్ట్రానికి ఎనలేని కీర్తిని ఆర్జించి పెట్టిన గ్రామ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, మండల అధ్యక్షులకు, జిల్లా పరిషత్ ఛైర్మన్లకు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లకు, కార్పొరేషన్ల మేయర్లకు, కార్పోరేటర్లకు, పంచాయతీరాజ్, మున్సిపల్ మున్సిపల్ ఉద్యోగులకు హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి