హైదరాబాద్ : 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర, దేశ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సమానత్వంతో కూడిన సమర్థవంతమైన ప్రజాస్వామిక పాలన ద్వారానే దేశ రాజ్యాంగం ఆశించిన లక్ష్యం పరిపూర్ణంగా సిద్ధిస్తుందని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధ పాలనకు అంకురార్పణ జరిగిన రోజు పౌరులందరికీ పండుగ రోజు అని పేర్కొన్నారు.
ప్రపంచంలోనే అతి పెద్దదైన మహోన్నత రాజ్యాంగాన్ని రూపొందించిన భారత రాజ్యాంగ నిర్మాతల కృషిని ఈ దేశ ప్రజలు స్మరించుకుంటారు. గుల్ దస్తా మాదిరి విభిన్న సామాజిక సంస్కృతులు, సాంప్రదాయాలు, భాషలు, ఆచారాలతో భిన్నత్వంలో ఏకత్వమే దేశ ప్రధాన లక్షణం అని కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో ఫెడరల్ స్ఫూర్తి పరిఢవిల్లితేనే ప్రగతిపథంలో పయనిస్తాం అని చెప్పారు. పవిత్ర రాజ్యాంగాన్ని ప్రతీ పౌరుడు క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలి. ఆశయాలను సాధించేందుకు మరింతగా కృషి చేయాలి అని కేసీఆర్ పిలుపునిచ్చారు.