హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానిది (PRLIS) ఒక పోరాట చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. ఈ ప్రాజెక్టుతో ఆరు జిల్లాలు సస్యశ్యామలమవుతాయని చెప్పారు. పాలమూరు (Palamuru) పరిధిలో నాటి పాలకులు మొదలుపెట్టి పెండింగులో పెట్టిన ప్రాజెక్టులకు స్వరాష్ట్రంలో యుద్ధప్రాతిపదిక పూర్తిచేశామని తెలిపారు. దీనిద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లా పచ్చబడటం ప్రారంభమమైందని తెలిపారు. జాతీయ సమైక్యతా దినోత్సం వేడుకల్లో భాగంగా హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలమూరు జిల్లాది ఒక విషాద గాథ. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానిది ఒక పోరాట చరిత్ర. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటంవల్ల అధికంగా నష్టపోయిన జిల్లా పాలమూరు జిల్లా. ఫజల్ అలీ కమిషన్ సిఫార్సుల మేరకు హైదరాబాద్ రాష్ట్రం కొనసాగి ఉంటే, అప్పర్ కృష్ణా, తుంగభద్ర, బీమాఎడమ కాలువ ద్వారా ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అంది ఉండేది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటువల్ల ఈ అవకాశం పోగొట్టుకున్నాం. పాలమూరు జిల్లాలో అప్పట్లో వ్యవసాయయోగ్యమైన భూమి 35 లక్షల ఎకరాలుకాగా, ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి సౌకర్యం ఉన్న భూమి కేవలం 4.5 లక్షల ఎకరాలు మాత్రమే. దీంతో పాలమూరు ప్రజలకు బతుకుతెరువుకోసం వలసలే గతయ్యాయి. 60 ఎకరాలు భూమి ఉన్నరైతు కూడా పొట్టచేతబట్టుకొని పట్నానికి వలస వచ్చి కూలి పనులు చేసుకునే దుస్థితికి మనందరం కన్నీటి సాక్షులమే.
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిన సందర్భంలో తెలంగాణ రిటైర్డు ఇంజనీర్లు 2005లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రూపకల్పనచేసి అప్పటి ఉమ్మడి రాష్ట్రప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అయితే ఆనాటి పాలకులు దాన్ని బుట్టదాఖలు చేశారు. జిల్లా నాయకుల్లో దాన్ని పట్టించుకున్నవారే లేరు. తలాపున కృష్ణమ్మ పారుతున్నా, నాటి ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో, వివక్షతో తాగునీరు, సాగునీటికి నోచుకోక దశాబ్దాలపాటు ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలు అనేక కష్టాలు, నష్టాలు, బాధలు అనుభవించాయి. కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులను పేరుకు మొదలు పెట్టాలె, ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా ఆపేసి పెండింగులో పెట్టాలె. ఇదీ ఆనాటి ఉమ్మడి రాష్ట్ర పాలకుల వైఖరి. ఒకనాడు సుసంపన్నంగా వెలుగొందిన పాలమూరులో గంజికేంద్రాలు నడపాల్సిన దుర్గతి పట్టించిన నీచ చరిత్ర ఆనాటి ఉమ్మడి రాష్ట్ర పాలకులది.
ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తరువాత తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల మీద ప్రధానంగా దృష్టి సారించింది. పాలమూరు పరిధిలో నాటి ఉమ్మడి పాలకులు మొదలుపెట్టి పెండింగులో పెట్టిన నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి, కోయిల్ సాగర్ వంటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసింది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లా పచ్చబడటం ప్రారంభమైంది. వలస పోయినోళ్లు వాపస్ రావడమేకాదు, పాలమూరులో జోరుగా సాగుతున్న వ్యవసాయ పనులకు బయటి రాష్ట్రాల నుంచి కూలీలు వలసొచ్చే స్థాయికి పాలమూరును అభివృద్ధి చేసుకున్నం.
దృఢ సంకల్పంతో, చిత్తశుద్ధితో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తిచేయాలని సంకల్పిస్తే, ప్రతీఘాతుక శక్తులు అడుగడుగునా అడ్డంకులు కల్పించాయి. స్వయానా పాలమూరు జిల్లా ప్రతిపక్ష నాయకులే కొందరు, తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వందలాది కేసులు పెట్టారు. అయినా మొక్కవోని పట్టుదలతో, దృఢ సంకల్పంతో పనులు కొనసాగించినం. చివరికి ధర్మమే గెలిచింది. ఎంతో న్యాయపోరాటం తరువాత పర్యావరణ అనుమతులను కూడా సాధించి ప్రాజెక్టును ప్రారంభించుకోగలిగాం.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్ ఇన్ టేక్ నుంచి నిన్ననే బాహుబలి పంపుద్వారా కృష్ణా జలాలలను ఎత్తిపోసే పంపులను ప్రారంభించుకున్నాం. తెలంగాణ సాగునీటిరంగ చరిత్రలో ఇది మరో సువర్ణాధ్యాయం. నిన్నటిరోజు ఆరు జిల్లాల ప్రజల ఆశలు తీరిన నిజమైన పండుగరోజు. ప్రపంచంలో మరెక్కడాలేని అత్యంత భారీ పంపులతో నిర్మితమైన ఈ ప్రాజెక్టు నుంచి దక్షిణ తెలంగాణ ప్రజలకు తాగు, సాగునీటి అవసరాలు తీరనున్నాయి. మనం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల సాకారంచేసుకోగలిగాం. కరువు జిల్లాల రైతాంగం కష్టాలు తీరిన పర్వదినంగా నిన్నటి రోజు చరిత్రలో నిలిచిపోతుంది. ఈ పండుగను గ్రామగ్రామాన పెద్దఎత్తున సంబురాలతో జరుపుకుంటున్నాం. కృష్ణా జలాలతో ఆయా గ్రామాల్లోని దేవతల పాదాలను అభిషేకించి మొక్కులు చెల్లించుకుంటున్నాం.
పర్యావరణ అనుమతులతోపాటు అనేక అడ్డంకులను అధిగమించి చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కాల్వల పనుల కోసం ఇప్పటికే ఆదేశాలిచ్చాం. మిగిలిన పనులను చకచకా పూర్తిచేసుకోబోతున్నాం. దీంతో నాగర్ కర్నూల్, మహబూబ్నగర్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ జిల్లా.. మొత్తం 6 జిల్లాల్లోని 12 లక్షల 30 వేల ఎకరాల భూములకు సాగునీరు, 1226 గ్రామాలకు తాగునీరు అందుతుంది. పాలమూరులో ఇప్పటికే పూర్తి చేసిన కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకాల ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరందుతున్నది.
మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల పునరుద్ధరణ చేసి నీటి నిల్వ సామర్థ్యాన్ని గణనీయంగా అభివృద్ధి చేసుకున్నాం. రాష్ట్రంలోని వాగులు వంకల మీద పెద్దసంఖ్యలో చెక్ డ్యాములు నిర్మించడంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. రాష్ట్రంలో సుభిక్షమైన పరిస్థితులు నెలకొన్నాయి.
గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మిగిలిన పనులు పూర్తిచేసి మొత్తం 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించుకుంటాం. ఖమ్మం జిల్లాలో 36 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణమవుతున్న సీతమ్మ సాగర్ బ్యారేజీ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దీని నుంచి నీటిని ఎత్తిపోసే సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్త, పాత ఆయకట్టు కలిపి 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. సమ్మక్క సాగర్ బ్యారేజీ నిర్మాణం పూర్తయింది. కనుక దేవాదుల ఎత్తిపోతల ద్వారా త్వరలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5 లక్షల ఎకరాలకు నికరంగా సాగునీరు అందించుకోబోతున్నాం. అంటే రాష్ట్రంలో ప్రధానమైన ఎత్తిపోతల పథకాల ద్వారా 75 లక్షల ఎకరాలకు సాగునీరు లభించనున్నది. ఇతర భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు, చెరువుల ద్వారా మరో 50 లక్షల ఎకరాలకు సమృద్ధిగా సాగునీరు లభిస్తున్నది. రాష్ట్రంలో ఇప్పటికే 85 లక్షల ఎకరాలకు సాగునీరందుతున్నది. రానున్న మూడు నాలుగేళ్లలో మొత్తం 1 కోటి 25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించాలనే లక్ష్యం నెరవేరుతుంది.
తెలంగాణ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయి. తెలంగాణ రైతన్నల లోగిళ్లు బంగరు పంటలతో తులతూగుతాయి. “ధ్యేయమును బట్టి ప్రతీ పనీ దివ్యమగును” అన్నదానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో సాధిస్తున్న అద్భుత ఫలితాలే ఉదాహరణ’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.