ప్రజలపై పెరిగిన పన్నుల భారంపై కూడా కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేనిపై పన్నులు విధిస్తారు? ప్రజలు భరించగలరా? ఈ విషయాన్ని నీతి ఆయోగ్లో చర్చించారా? ఇదేనా సహకార స్ఫూర్తి? అని మండిపడ్డారు. ‘‘దేనిపై జీఎస్టీ వేశారో కూడా మాకు తెలీదు. బయటకు వచ్చాక తెలిసింది. పాల మీద పన్ను, స్మశానాల మీద పన్ను.. ఇదేనా టీమిండియా అంటే? ఈ కారణాల వల్లనే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా. ఇలాగైనా మెజార్టీ ప్రజల భావాలు ప్రధానికి అర్థమవుతాయని ఆశించి ఈ నిర్ణయం తీసుకున్నా’’ అని కేసీఆర్ వివరించారు.
ఏ దేశంలోనైనా ‘జాతి పిత’ అని పేరు పెట్టుకున్న వ్యక్తిని.. అహింసామార్గంలో స్వాతంత్ర్యం తెచ్చిన వ్యక్తిని అవమానిస్తారా? అని అడిగారు. ప్రధాన మంత్రేమో నీతి ఆయోగ్ లోగోలో గాంధీ కళ్లద్దాలు పెడితే.. బీజేపీ సంఘాలేమో గాంధీని దూషిస్తుంటారు.. గాంధీకి లేని అవలక్షణాలు ఉన్నట్లు చెప్తున్నారు. ఇలా ఎక్కడైనా ఉంటుందా?
ఇష్టమొచ్చినట్లు ధరలు పెంచి ప్రజలపై భారం మోపిందే కాకుండా.. ఇప్పుడు కొత్తగా ఉచితాలు బంద్ చెయ్యాలని చెప్తున్నారు. రైతాంగం బాధలో ఉందని, ఒక ఎకరమో గుంటనో భూమి ఉన్న రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడుతుందన్న ఉద్దేశ్యంతో రైతు బంధు ఇస్తే అది ఉచితమా? అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవి ఉచితాలు అయితే ఎన్పీయేలు ఎందుకు ఇస్తున్నారు? అని అడిగారు. ఈ విషయం దేశానికి చెప్పాలని డిమాండ్ చేశారు.
‘‘వేలాది మందికి ఉద్యోగాలు కల్పించే కంపెనీలు.. సడెన్గా నష్టాల బాటపట్టి, మూసివేయాల్సి వస్తే ఎంతో మంది రోడ్డున పడతారు. ఇలా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చాలా చోట్ల జరిగింది. ఈ పరిస్థితిని రిపీట్ కాకుండా ఉండేందుకు ప్రభుత్వాలు ఉద్దీపన కోసం ఆర్థిక సాయం అందించి, మళ్లీ ఆ కంపెనీలు గాడిన పడేంత వరకూ సహాయం అందిస్తాయి. వాటినే ఎన్పీయేలు అంటారు’’ అని కేసీఆర్ వివరించారు. అయితే ఈ ఎన్పీయేలు కూడా ఎన్డీయే ప్రభుత్వంలో పెద్ద స్కాంగా మారిందని విమర్శించారు.
‘‘2004-05లో నాన్ పర్ఫామెన్స్ అసెట్స్ (ఎన్పీయే)లు రూ.58 వేల కోట్లు ఉండేవి.. ఇది 2014 నాటికి 2 లక్షల 63 వేల కోట్ల రూపాయలకు చేరింది. ఇప్పుడు ఇది ఎంత ఉందో తెలుసా? 20 లక్షల 7 వేల కోట్ల రూపాయలు. ఎన్డీయే ప్రభుత్వంలో ఇదొక దందా అయిపోయింది. ప్రభుత్వ పెద్దలు, ఎన్పీయే వాళ్లు చేతులు కలిపి పెద్ద స్కాం చేస్తున్నారు. వాళ్లు ఎన్పీయే డిక్లేర్ చెయ్యగానే.. ప్రభుత్వం నుంచి భారీగా నిధులు మంజూరు చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 12 లక్షల కోట్లు ఇచ్చింది’’ అని తెలియజేశారు.
మేకిన్ ఇండియా, నీతి ఆయోగ్ మేధో సంపత్తి, మహత్తరమైన ప్రభుత్వ విధానాలు ఉంటే ఎన్పీయేలు తగ్గాలి కదా. వీళ్ల పాలనలో పది రెట్లు ఎలా పెరిగింది? ఇది ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం కాదా? అని ఎద్దేవా చేశారు. బ్యాంకుల్లో రుణ ఎగవేతలు కూడా లక్షల కోట్లకు చేరాయి. ఇది ప్రగతికి సంకేతమా? అని సూటిగా ప్రశ్నించారు. ‘‘మేకిన్ ఇండియా అని ప్రధాని చెప్తారు. కానీ గాలిపటాలు ఎగరేసే మాంజా నుంచి షేవింగ్ చేసుకునే బ్లేడ్లు, దీపావళి టపాసులు అన్నీ చైనా నుంచి వస్తున్నాయి. మేకిన్ ఇండియా అంటే ఇదేనా?’’ అని విమర్శలు గుప్పించారు.
భారత్లో 83 కోట్ల ఎకరాలు ఉంటే.. దానిలో 40 కోట్లపైగా భూమి వ్యవసాయినికి అనుకూలమని, దానికి సరిపోయే నీరు కూడా నదుల ద్వారా లభిస్తుందని కేసీఆర్ చెప్పారు. ఇది ప్రపంచంలో మరే దేశానికీ లేని విలక్షణమైన లక్షణమని చెప్పిన ఆయన.. కానీ మన దేశం మాత్రం కంది పప్పు, పామాయిల్ వంటి నిత్యావసరాలను కూడా దిగుమతి చేసుకుంటోందని, ఇదేనా నీతి ఆయోగ్ సమర్థత? కేంద్ర ప్రభుత్వ బహుముఖ ప్రజ్ఞ ఇదేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.