CM KCR | ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలపై సీఎం కేసీఆర్ సైటైర్లు వేశారు. ఓ వ్యక్తికి పిలిచి మంత్రి ఇచ్చి జిల్లాను అప్పగిస్తే సాధించిన ఫలితం గుండుసున్నా అని.. ఆ ఇద్దరి పీడ ఖమ్మం జిల్లాకు వదిలిపోయి శుభ్రంగా ఉందని.. భవిష్యత్లో మంచి ఫలితాలు రాబోతున్నాయని సీఎం అన్నారు. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఖమ్మంలో ఎన్నికల్లో నిలబడ్డ వ్యక్తుల గుణగణాలు మీకు తెలుసు. ఒకాయన అయితే చాలా గొప్పవాడు. పోయినసారి ఓడిపోతే మంత్రి పదవి ఇచ్చిన అని నేను చెబితే.. నాకే మంత్రి పదవి ఇచ్చిన అని చెప్పిండు. అదంత చరిత్ర మీ కండ్ల ముందున్నది. మీ సాక్షిగా జరిగింది. ఇదే అజయ్ కుమార్ చేతిలో ఓడిపోయి మూలకుపడి ఉంటే.. మంత్రిని చేసి జిల్లా అప్పగిస్తే ఆయన సాధించిన ఫలితం గుండుసున్నా. ఒక్క అజయ్ తప్ప ఎవరూ గెలువలేదు’ అంటూ గుర్తు చేశారు.
‘మొన్న సత్తుపల్లి సభలో చెప్పాను. ఈ జిల్లాలో ఇద్దరు కరకట ధమనకులు ఉన్నరు. చిన్నయ్యసూరి కథ చదివితే కరకట ధమనుల కథ, చరిత్ర తెలుస్తుంది. వీరిద్దరి పీడ వదిలించిన ఖమ్మానికి. శుభ్రంగా ఉన్నది. మంచి ఫలితాలు ఖమ్మంలో రాబోతున్నయి. ఎవరికి కూడా అనుమానం అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో మాటలకు కూడా పద్ధతి ఉంటది. మాటలు అందరికీ వస్తయ్. తిట్టాలంటే తిట్లు తక్కువ ఉన్నయా? రేపు గియ్యాళ్లదాక తిట్టొచ్చు. అదికాదు కదా రాజకీయం అంటే.. అరాచకంగా మాట్లాడకూడదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్లను ఒక్కరినిగూడ.. అసెంబ్లీ గడప తొక్కనియ్య అని ఒక అర్భకుడు మాట్లాడుతున్నడు. నువ్వు ఖమ్మం ప్రజలను గుత్తపట్టినవా? జిల్లాకు జిల్లానే కొనేసినవా? ఖమ్మం జిల్లా ప్రజలు దీన్ని సహిస్తరా? ప్రజాస్వామ్యవాదులు దీన్ని సహిస్తరా? ఎంత వరకు ఇది ధర్మం. ఇది చైతన్యవంతమైన జిల్లా. పోరాటాల ఖిల్లా. కమ్యూనిస్ట్ పార్టీలు ఎంతో చైతన్యం తీసుకువచ్చాయి. అందుకే మొదట మీతో ప్రార్థించింది.. విక్షణాయుతంగా ఎవరు గెలిస్తే ఈ రాష్ట్ర ప్రయోజనాలకు మంచిదో.. ఎవరి చేతుల్లో తెలంగాణ సురక్షితంగా ఉంటదో మీ అందరికీ తెలుసు’నన్నారు.
‘బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ జెండా ఎత్తినయా? తెలంగాణ ఉద్యమాన్ని ఎప్పుడన్నా భుజానికి ఎత్తుకున్నరా? మనం ఎత్తుకున్నప్పుడు మనల్ని అవమానించారు.. కాల్చి చంపారు.. జైళ్లలో పెట్టారు తప్పా వాళ్లకు ఎందుకు ప్రేముంటదు. కాంగ్రెస్ నాయకులకు సొంతం కథ ఉండదు. ఢిల్లీలో స్విఛ్ వస్తేనే ఇక్కడ లైట్ వెలుగుతుంది. మరి ఢిల్లీ గులామ్ల కింద ఉండి.. మనం కూడా గులామ్ అవుదామా? ఈ రోజు ఖమ్మంలో చెబుతున్నా.. కేసీఆర్ అన్నట్లే నిజమైందని అంటరు. రాబోయే రోజంతా కూడా ప్రాంతీయ పార్టీల యుగం రాబోతున్నది. ఎక్కడి వారు అక్కడ ఉంటేనే.. ఆ రాష్ట్రం ప్రయోజనాలు కాపాడుతారు. వాళ్లకు కడుపు నొప్పి ఉంటది.. కాళ్ల నొప్పి ఉంటది.. చేసుకుంటరు.. ఎలా ఉన్న ఖమ్మాన్ని.. ఐదారేళ్లలో ఎలా చేసుకున్నాం మీ కండ్ల ముందే ఉన్నది. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటన్నింటిపై విచారం చేసి, ఆలోచించి అమూల్యమైన ఓటును కారు గుర్తుకు ఓటేసి పువ్వాడ అజయ్ కుమార్ను గెలిపించాలని కోరుతున్నా’అంటూ పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్.