హైదరాబాద్ : ప్రగతి పథంలో దూసుకుపోతున్న నిజామాబాద్ నగరంలో అభివృద్ధి మరింత ద్విగుణీకృతమై కండ్లకు కట్టాలి అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రెండున్నర నెల్లల్లో ప్రణాళికాబద్దంగా పనులను పూర్తిచేయాలనీ, తాను పర్యటించి పనులను పరిశీలిస్తానని తెలిపారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, మున్సిపల్ శాఖ, తదితర అన్ని శాఖలు సమన్వయంతో నిజామాబాద్ అభివృద్ధి పనులను పూర్తి చేసేలా పనుల్లో నిమగ్నం కావాలని, స్థానిక ఎమ్మెల్యే గణేశ్ బిగాలను సీఎం ఆదేశించారు. నిజామాబాద్ అభివృద్ధికి నిధుల కొరత లేదని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే విడుదలైన నిధులతో పాటు నిజామాబాద్ నగరాభివృద్ధికి అవసరమైన మరిన్ని నిధులను విడుదల చేయాలని ఫైనాన్స్ సెక్రటరీకి సమావేశం నుండే సీఎం ఫోన్ చేసి ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ శాఖ చేపట్టిన అభివృద్ధి పనుల సమీక్షతో పాటు నిజామాబాద్ నగరంలో మౌలిక వసతులను మరింత మెరుగుపరచడం, ప్రజలకు సౌకర్యవంతంగా అన్ని రంగాలను అభివృద్ధి పరిచి నగరాన్నిసుందరంగా తీర్చిదిద్దడం అనే అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో ఆదివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఒకనాడు గందరగోళంగా వున్న ఖమ్మం నగరం ప్రభుత్వ కృషితో నేడు సుందర నగరంగా మారింది. ఖమ్మాన్ని సుందరంగా తీర్చిదిద్దినట్టు నిజామాబాద్ను కూడా తీర్చిదిద్దాలె. మీరంతా కలిసి ఖమ్మం టూరు వెళ్లండి. అక్కడ జరిగిన అభివృద్ధిని పరిశీలించి రావాలని నిజామాబాద్ అధికారులను, ఎమ్మెల్యేను సీఎం ఆదేశించారు.
నిజామాబాద్ నగరంలో రోడ్ల నిడివి ఎంత వున్నదో అంచనా వేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. గ్రావెల్ రోడ్లను బీటీ రోడ్లుగా మార్చాలని చెప్పారు. స్మశాన వాటికలు, బరీయల్ గ్రౌండ్లు ఎన్ని కావాల్సి వున్నది..? సమీకృత మార్కెట్లు ఎన్ని కావాల్సి వున్నయి.? కమ్యునిటీ హాల్లు ఎన్ని కావాలి..? డంప్ యార్డులు.. వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను అత్యంత వేగంగా పూర్తి చేయాలన్నారు. నిజామాబాద్లో మొత్తం దోభీ ఘాట్లు, సెలూన్లను అంచనా వేసి మోడ్రన్ దోభీఘాట్లను, మోడ్రన్ సెలూన్లను నిర్మించాలన్నారు. నిజామాబాద్ నగరంలో గార్డెన్ల పరిస్థితిని సీఎం అడిగి తెలసుకున్నారు. పబ్లిక్ గార్డెన్లను తక్షణమే మెరుగు పరచాలన్నారు. తాను చిన్ననాడు నాటి తిలక్ గార్డెన్లో వెళ్లి కూర్చేనే వాడినని సీఎం గుర్తచేసుకున్నారు. తిలక్ గార్డెన్ను పునరుద్ధరించాలన్నారు. మొక్కలను నాటడం, పచ్చదనం పెంచే కార్యక్రమాలను చేపట్టాలన్నారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ను సుందరీకరించాలని సీఎం ఆధికారులను ఆదేశించారు.
నిజామాబాద్ నగరంలో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలు తీయాలన్నారు. వాటిల్లో ప్రజావసరాల కోసం వినియోగించుకోవాడనికి ఎన్ని అనువుగా వున్నాయో ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు. సమీకృత కలెక్టరేట్ నిర్మాణం తర్వాత పలు శాఖలు వారి కార్యాలయాలను ఖాళీ చేశాయని, ఆయా శాఖల భవనాల పరిస్థితి ఏంది? వాటి స్థలాలను, కార్యాలయ భవనాలను ప్రజావసరాలకు ఏ విధంగా వినియోగించుకోవచ్చునో ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.
నిజామాబాద్ పట్టణాభివృద్ధి కోసం అనుసరించాల్సిన పద్దతులను ఈ సందర్భంగా సీఎం అధికారులకు వివరించారు. పౌరులకు కల్పించాల్సిన సౌకర్యాలను రూపొందించుకుని వాటికోసం చేపట్టాల్సిన నిర్మాణాత్మక పనుల ప్రణాళికలను సిద్దం చేసుకోవాలన్నారు. దాంతో పాటు నగరాన్ని సుందరీకరించే అంశాలేమిటో పరిశీలించి అందుకు అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన అలంకారాలేమిటి అనే ప్రణాళికలను సిద్దం చేసుకోవాల్సి వున్నదని సీఎం తెలిపారు. నేను రెండు నెల్లల్లో నిజామాబాద్ వస్తాను. మీరు చేసిన పనులను పరిశీలిస్తాను. అందమైన నిజామాబాద్ను తీర్చిదిద్దాలె అని సీఎం అన్నారు.
రాష్ట్రంలో మున్సిపల్ శాఖ చేపట్టిన అభివృద్ధి పనులను ఆ శాఖ మంత్రి కేటీఆర్ సీఎంకు వివరించారు. దేశంలోనే ఆదర్శవంతమైన పట్టణాలను తీర్చిదిద్దడంలో మున్సిపల్ శాఖ కృషిని వివరించారు. నిజామాబాద్ నగరంలో ఆడిటోరియం నిర్మాణానికి సంబంధించిన వివరాలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ సందర్భంగా కేసీఆర్కు వివరించారు. నిజామాబాద్ నగరంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి ఎమ్మెల్సీ కవిత సీఎంను అభ్యర్థించారు. నగరంలో బస్టాండ్ నిర్మాణానికి విశాలమైన స్థలం, పిల్లలు ఆడుకోవడానికి క్రీడా ప్రాంగణ నిర్మాణానికి సంబంధించి ఎమ్మెల్సీ కవిత సీఎంకు వివరించారు. హజ్ భవన్ నిర్మాణం చేపట్టాలని సీఎంను కోరారు.