Rains | హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో పరిస్థితిని సీఎం కేసీఆర్ నిరంతరం సమీక్షిస్తున్నారు. మరికొద్ది రోజులు భారీ వర్షాలు కొనసాగుతాయన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు శుక్ర, శనివారాల్లో సెలవులు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో అన్ని శాఖల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ సూచనతో రాష్ట్రంలోని ఐటీ కంపెనీలు ఉద్యోగులకు శుక్రవారం వర్క్ ఫ్రమ్ హోం చేసేందుకు అనుమతులిచ్చాయి.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ శాంతికుమారి వర్షాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్యారోగ్య తదితర శాఖల ఉన్నతాధికారులు, జీహెచ్ఎంసీ కమిషనర్ తదితరులు హాజరై రాష్ట్రంలోని పరిస్థితిని వివరించారు. భారీ వర్ష సూచన ఉన్న ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
రంగంలోకి మంత్రులు
వర్షాల నేపథ్యంలో మంత్రులు తమ పరిధిలోని శాఖలపై సమీక్షించి, సూచనలు జారీ చేశారు. మంత్రి కేటీఆర్ మున్సిపాలిటీల్లో పరిస్థితులపై ఆరా తీశారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో సూచించారు. నీరు నిలిచే (వాటర్ లాగింగ్ పాయింట్స్) ప్రాంతాలపై ప్రధానంగా దృష్టిపెట్టాలని ఆదేశించారు. చెరువుల పరిస్థితిని నిరంతరం గమనించాలని, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు. అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వైద్యశాఖ సన్నద్ధతపై మంత్రి హరీశ్రావు సమీక్ష జరిపారు. అన్ని జిల్లాల్లో కాల్సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వ్యాధులు, పాము, తేలుకాటు వంటి సంఘటనలు నమోదయ్యే అవకాశం ఉండటంతో సబ్ సెంటర్ నుంచి సూపర్ స్పెషాలిటీ దవాఖానల వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పంటల పరిస్థితిపై మంత్రి నిరంజన్రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు అందుబాటులో ఉండి, పంట యాజమాన్య పద్ధతులపై మార్గనిర్దేశం చేయాలని కోరారు. రైతులు పొలం పనుల్లో నిమగ్నమైన నేపథ్యంలో రైతు వేదికల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు సమావేశాలను వాయిదా వేశారు. గ్రామాల్లోని పరిస్థితిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమీక్ష నిర్వహించి, పారిశుద్ధ్యం, క్లోరినేషన్పై దృష్టి పెట్టాలని సూచించారు. రహదారుల పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించాలని ఆదేశించారు. రోడ్లు ఎక్కడైనా దెబ్బతింటే వెంటనే మరమ్మతులు చేయాలని, తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. రోడ్ల పరిస్థితిపై మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆర్ అండ్ బీ శాఖ అధికారులతో చర్చించారు. ఇప్పటివరకు ఎక్కడా నష్టం కలగలేదని అధికారులు ఆయనకు వివరించారు.
రాష్ట్ర సచివాలయంతోపాటు, కలెక్టరేట్, ఎమ్మార్వో కార్యాలయాల్లో కంట్రోల్ రూంలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సహాయక చర్యల కోసం హెలికాప్టర్లను, ఎన్డీఆర్ఎఫ్ దళాలను అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్యారోగ్యశాఖ, విపత్తు నిర్వహణ సహా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. భారీ వర్షాలతో ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదురొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని సీఎం తెలిపారు. సీఎం ఆదేశాలమేరకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. హెలికాప్టర్లను అందుబాటులో ఉంచారు.
అత్యవసర పరిస్థితుల్లో సహాయపడేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేక సహాయ బృందాలను సిద్ధం చేసింది. హైదరాబాద్, వరంగల్, ములుగు, కొత్తగూడెంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచింది. జీహెచ్ఎంసీలో ప్రత్యేకంగా 426 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను, 157 స్టాటిక్ టీమ్లను రంగంలోకి దింపింది. రాజధానిలో నీళ్లు నిలిచే ప్రాంతాల్లో వీరు సేవలు అందించనున్నారు. మరోవైపు జలవనరుల రక్షణపైనా ప్రభుత్వం దృష్టిపెట్టింది. చెరువులు, రిజర్వాయర్లకు భారీగా వరద రానున్న నేపథ్యంలో ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించింది. చెరువుల పటిష్ఠతపై ఎలాంటి సందేహం లేదని, అయితే మత్తళ్లు దుంకినప్పుడు వరద పరిస్థితిపై ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించింది.
భద్రాచలం వద్ద పొంగుతున్న గోదావరి
భారీ వర్షాలతో గోదావరిలో నీటిమట్టం ప్రమాదకరంగా పెరుగుతున్నది. నదీ పరివాహక ప్రాంతంలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో ప్రభుత్వం గురువారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో చేపట్టవలసిన అత్యవసర చర్యలపై సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఆదేశాలు జారీచేశారు. భద్రాచలంలో ముంపునకు గురయ్యే అవకాశాలున్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. గతంలో వరదల సందర్భంగా సమర్థంగా పనిచేసిన అధికారుల సేవలను వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుత హైదరాబాద్ కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ను తక్షణమే బయలుదేరి భద్రాచలం వెళ్లి అకడి పరిస్థితులను బట్టి సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
నేడు, రేపు సెలవు
ఎడతెరిపిలేని వర్షాల కారణంగా జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వం శుక్ర, శనివారాల్లో సెలవు ప్రకటించింది. వైద్యం, పాల సరఫరా తదితర అత్యవసర సేవలు కొనసాగుతాయని తెలిపింది. ప్రైవేట్ సంస్థలు కూడా కార్యాలయాలకు సెలువులు ప్రకటించేలా చర్యలు చేపట్టాలని కార్మికశాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు. గురువారం, శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు మంత్రి సబితాఇంద్రారెడ్డి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.