హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): ఆగస్టు 8 నుంచి 22 వరకు 15 రోజులపాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం సమీక్ష నిర్వహించనున్నారు. కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన కార్యాచరణ, విధి విధానాలతోపాటు ఇతర అంశాలపై కే కేశవరావు నేతృత్వంలోని కమిటీతో సీఎం సమావేశమవుతారు. కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి కమిటీ ఇప్పటికే రెండుసార్లు సమావేశమైంది. ఈ చర్చల సారాంశాన్ని ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్కు వివరాలు అందజేసింది. ఈ క్రమంలో సోమవారం నాటి సమావేశంలో వజ్రోత్సవాల కార్యాచరణకు తుదిరూపు ఇవ్వనున్నారు.
ముగిసిన సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన
ఐదు రోజులపాటు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తన పర్యటనను ముగించుకొని ఆదివారం సాయంత్రం హైదరాబాద్కు చేరుకొన్నారు. సీఎం కేసీఆర్ తన వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఇతర ఉన్నతాధికారులు వెళ్లారు. రాష్ట్రంలోని పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలకు రాష్ట్ర అధికారుల ద్వారా నివేదించారు. మరోవైపు రాష్ట్రంపై కేంద్రం అనుసరిస్తున్న వివక్షాపూరిత వైఖరిని పార్లమెంట్ వేదికగా ఎండగట్టాలని ఎంపీలకు సూచించారు. మరోవైపు జాతీయ రాజకీయాలపై మేధావులతో చర్చించారు. ఈనెల 29న సమాజ్వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్గోపాల్ యాదవ్తో భేటీ అయ్యారు.