జగిత్యాల, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని దేశంలోనే అతి గొప్ప క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. దేశంలో గొప్ప హనుమాన్ ఆలయం ఎక్కడున్నదని ఎవరు అడిగినా కొండగట్టు పేరు చెప్పేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. అయ్యప్ప దీక్ష విరమణ అంటే కేరళలోని శబరిమలై అయ్యప్ప ఆలయం ఎలా గుర్తుకు వస్తున్నదో, అంజన్న దీక్ష విరమణ అంటే కొండగట్టు అలా గుర్తుకు వచ్చేలా రూపొందిస్తామని పేర్కొన్నారు. ఆలయ పునర్నిర్మాణానికి ఇటీవల రూ.100 కోట్లు కేటాయించామని, ఆలయాన్ని వైభవోపేతంగా నిర్మించేందుకు మరో రూ.1000 కోట్లయినా ఖర్చుచేస్తామని చెప్పారు. పక్కా వాస్తుతో, ఆగమశాస్ర్తాల ప్రకారం ఆలయ పునర్నిర్మాణం మూడేండ్లలో పూర్తి చేస్తామని వెల్లడించారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయస్వామిని సీఎం బుధవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ సమీపంలోని సమావేశ మందిరంలో కొండగట్టు ఆలయ అభివృద్ధిపై రెండు గంటలకుపైగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణంపై వివిధ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. క్షేత్ర ప్రాశస్త్యాన్ని స్వయంగా వివరించిన సీఎం, పునర్నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. ఆలయ విస్తరణ కోసం సేకరించాల్సిన భూములు, ఇతర అంశాలపై లొకేషన్ మ్యాపులను సీఎం పరిశీలించారు.
‘హనుమంతుడు రామభక్తుడు, భక్తి విశ్వాసాలకు మాత్రమే ఆయన ప్రతీక కాదు. ఆయన గొప్ప వక్త. హనుమంతుడు వాచస్పతి, గొప్ప జ్ఞాని, గొప్ప వ్యవహారకర్త. ఇదే విషయాన్ని రాముడు సైతం పలువురికి తెలియజేసినట్టు పురాణాలు చెప్తున్నాయి. హనుమంతుని గొప్పతనాన్ని అన్ని కోణాల్లో వివరిస్తూ, దేశంలో ఎక్కడా లేని విధంగా ఆయన గుణగణాలను, విశేషాలను ప్రదర్శించేలా కొండగట్టు క్షేత్రాన్ని తీర్చిదిద్దాలి.
– సీఎం కేసీఆర్
ఆగమ శాస్త్ర నియమాలను అనుసరించి కొండగట్టు గర్భాలయం, మూలవిరాట్ మినహా ఆలయాన్ని సంపూర్ణంగా విస్తరించాలని అధికారులకు, వాస్తు శాస్త్ర నిపుణులకు సీఎం కేసీఆర్ సూచించారు. ప్రధాన ఆలయ ప్రాకారం రెండెకరాల విస్తీర్ణంలో ఉండాలని తెలిపారు. వాస్తు నియమాల ప్రకారం ఏ నిర్మాణాన్ని ఎకడ చేపట్టాలో వాస్తు నిపుణులు నిర్ణయించాలని కోరారు. దేశంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఏటా లక్షల మంది దీక్ష చేపడతారని, వారికి మాలధారణ, విరమణ సమయంలో ఈ ఆలయంలో సకల సౌకర్యాలతో వసతులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ‘దేశంలో అయ్యప్ప మాల విరమణ అంటే శబరిమలై ఎలా గుర్తుకు వస్తుందో, అంజన్న దీక్ష విరమణ అంటే కొండగట్టు అలా మదిలో మెదలాలి. కొండగట్టుకు అనాదిగా మంగళ, శని, ఆదివారాల్లో భక్తులు ఎక్కువగా వస్తారు. సెలవు రోజుల్లోనూ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. హనుమాన్ చిన్న జయంతి, పెద్ద జయంతి సందర్భాల్లోనూ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అందుకు అనుగుణంగా నిర్మాణాలు ఉండాలి. ఎంతమంది భక్తులు వచ్చినా ఇబ్బందులు కలుగకుండా క్యూలైన్ల నిర్మాణం, రవాణా సౌకర్యాలు, విశాలమైన ప్రధాన ద్వారం ఏర్పాటు చేయాలి. హనుమాన్ జయంతికి సగం భారతదేశం కొండగట్టు అంజన్న వైపు మరలేలా నిర్మాణాలు ఉండాలి. వరదకాలువ ద్వారా కాళేశ్వరం నీటి ఎత్తిపోతలతో కొండగట్టు దిగువన ఉన్న సంతలోల్ల లొద్దికి తరలించాలి. అక్కడి నుంచి కొండగట్టు గుట్టపైకి నీటిని తీసుకోవాలి’ అని సీఎం ఆదేశించారు. రెండు మూడు నెలల్ల్లో కొండపైన అభివృద్ధి పనులు ప్రారంభమయ్యే నాటికే నీటి తరలింపు పనులు పూర్తి కావాలని, నిర్మాణాలకు నీటి కొరత లేకుండా చూడాలని సూచించారు. కొండపైన విద్యుత్తు సబ్స్టేషన్, దవాఖాన, బస్టాండు, పారింగ్ స్థలం, రోడ్ల నిర్మాణం, పుషరిణి, వాటర్ ట్యాంకులు, నీటివసతి, కాటేజీల నిర్మాణం, దీక్షాపరుల మంటపం, పోలీస్స్టేషన్, కల్యాణకట్ట తదితర మౌలిక వసతులను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్మించాలని ఆదేశించారు. పార్కింగ్కు కనీసం 84 ఎకరాల స్థలం ఉండాలని సూచించారు.
కొండగట్టు గుట్ట చుట్టూ విస్తరించి ఉన్న అభయారణ్యాన్ని మరింత అభివృద్ధి చేయాలని అటవీశాఖ అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. గుట్ట చుట్టు ఉన్న చెరువుల గురించి ఇరిగేషన్ అధికారుల నుంచి వివరాలు సేకరించారు. మిషన్ భగీరథ వచ్చిన తర్వాత కొండగట్టులో నీటి బాధ తప్పిందని అధికారులు వివరించగా, ఏడాది పొడువునా 24 గంటలూ నీటి సౌకర్యం ఉండేలా చూడాలని సీఎం సూచించారు. గుట్ట మీద కాటేజీల నిర్మాణానికి దాతలను ఆహ్వానించాలని ఆదేశించారు. ఇప్పటికే శ్వేత గ్రానైట్స్ సంస్థ నిర్మించిన కాటేజ్ ఆలయ విస్తరణలో పోతున్నందున, దాన్ని తిరిగి నిర్మిస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. దీంతో తగిన స్థలాన్ని కేటాయించాలని అధికారులకు సీఎం సూచించారు. కల్యాణకట్ట దగ్గర పుషరిణులు ఉండాలని.. స్త్రీలు, పురుషులకు ప్రత్యేక పుషరిణులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ‘తెలంగాణ పుణ్యక్షేత్రాలన్నింటిలోకెల్లా గొప్ప అటవీ సంపద, ప్రకృతి రమణీయత కొండగట్టులోనే ఉన్నది. ఇక్కడి నీళ్లు తాగితే రోగాలు నయమవుతాయన్న నమ్మకం ఉన్నది. కొండగట్టు ఆలయానికి ఇక్కడి అడవే ఆయువుపట్టు. అలాంటి అడవిని అభివృద్ధి పనుల కోసం కూడా ముట్టుకోవద్దు. మరొకరిని ముట్టుకోనీయవద్దు. ఈ అభయారణ్య ప్రాంతం అద్భుతంగా ఉన్నది. దీన్ని మైసూరు – ఊటీ రహదారిలోని నీలగిరి కొండల్లో ఉన్న బందీపూర్ అభయారణ్యం మాదిరిగా అభివృద్ధి చేయాలి’ అని సూచించారు. కొండగట్టు స్థల పురాణంతోపాటు రాష్ట్రంలోని అన్ని ఆలయాల స్థల పురాణాలకు సంబంధించిన పుస్తకాలను ముద్రించి అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను అదేశించారు.
ఆలయానికి వచ్చిన భక్తుల దర్శన విధానాన్ని సీఎం అడిగి తెలుసుకొన్నారు. అదే పద్ధతిలో పునర్నిర్మాణాలను చేపట్టాలని సూచించారు. ‘మొదట మూల విరాట్టును దర్శించుకొన్న తర్వాత అమ్మవారిని, ఆ తర్వాత వేంకటేశ్వరస్వామిని, అటునుంచి గుట్ట కింద భేతాళస్వామిని, రాములవారి పాదుకలను, సీతమ్మవారి ధారను, కొండలరాయుడి గుట్టను దర్శించుకొనేలా సర్యూట్ను అనుసరించి నిర్మాణాలు చేపట్టాలి. తిరుమలలో ఉన్నట్టుగా కొండపైకి వచ్చేందుకు ఒక దారి, కొండ దిగేందుకు మరో దారిని నిర్మించాలి. ప్రస్తుతం దొంగలమర్రి నుంచి ఉన్న రోడ్డును విస్తరించి దానిని గుట్టపైకి వచ్చేందుకు మాత్రమే వినియోగించాలి. ఈ రహదారిని వాస్తుకు అనుగుణంగా రూపొందించాలి. క్షేత్రానికి నైరుతి భాగం నుం చి కాకుండా తూర్పు వైపు నుంచి చేరుకొనేలా మార్పు చేయాలి. అలాగే, ఘాట్రోడ్డును గుట్ట దిగేందుకు వినియోగించాలి. ప్రస్తుతం ఉన్న ఘాట్రోడ్డును విస్తరించాలి. అందుకోసం తక్షణమే రూ.30 కోట్లు మంజూరు చేస్తాం. కొండగట్టుపైకి దర్శనం కోసం వచ్చే వీవీఐపీల కోసం యాదగిరిగుట్టలో నిర్మించినట్టుగా ప్రెసెడెన్షియ ల్ సూట్, వీవీఐపీ సూట్ల నిర్మాణానికి స్థలాన్ని ఎంపిక చేసి, వాస్తు నియమాలను అనుసరించి నిర్మాణాలు చేపట్టాలి’ అని ఆదేశించారు.
‘కొండగట్టు ప్రాంతం వేములవాడ, ధర్మపురి మధ్యలో ఉన్నది. మిడ్మానేరు, వేములవాడ, ధర్మపురిని దర్శించుకొనే భక్తులు, పర్యాటకులు.. రెండుమూడు రోజులు తమ కుటుంబాలతో ఇక్కడ గడపాలని కోరుకుంటారు. కుటుంబంతో వచ్చేవారికి మంచి వసతులను కల్పించాలి. వారి కోసం కాటేజ్లు నిర్మించాలి. భక్తులు, పర్యాటకుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయాలి.
– సీఎం కేసీఆర్
ఆలయ పునర్నిర్మాణంలో హనుమంతుడి గుణగణాలు ఉట్టిపడాలని, అందుకు నిపుణులైన శిల్పులను సమకూర్చాలని ఆలయ స్థపతి ఆనంద్సాయికి సీఎం కేసీఆర్ సూచించారు. ‘హనుమంతుడు రామభక్తుడు, భక్తి విశ్వాసాలకు మాత్రమే ఆయన ప్రతీక కాదు. ఆయన గొప్ప వక్త. హనుమంతుడు వాచస్పతి, గొప్ప జ్ఞాని, గొప్ప వ్యవహారకర్త. ఇదే విషయాన్ని రాముడు సైతం పలువురికి తెలియజేసినట్టు పురాణాలు చెప్తున్నాయి. హనుమంతుని గొప్పతనాన్ని అన్ని కోణాల్లో వివరిస్తూ, దేశంలో ఎక్కడా లేని విధంగా ఆయన గుణగణాలను, విశేషాలను ప్రదర్శించేలా కొండగట్టు క్షేత్రాన్ని తీర్చిదిద్దాలి’ అని సీఎం సూచించారు. ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి కనీసం మూడు సంవత్సరాలు పడుతుందనీ, అప్పటి దాకా ఆగమశాస్త్రం ప్రకారం బాలాలయాన్ని నిర్మించాలని ఆదేశించారు. క్షేత్రంలో అంజనాద్రి పేరుతో వేద పాఠశాలను నిర్మించాలని, అందుకు తగిన స్థలం ఎంపిక చేయాలని సూచించారు. ‘బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలతో రాష్ట్రంలో రోజురోజుకూ ఆధ్యాత్మిక శోభ పెరిగిపోతున్నది. భక్తులు దేవాలయాలను గొప్పగా ఆదరిస్తున్నారు. రాష్ట్రంలోని ఆలయాలు స్వయం సమృద్ధి సాధించాలి. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక వనరులు, వస్తున్న విరాళాలు, ఇతర ఆర్థిక వనరులను ఆలయాల పునరుద్ధరణకు వినియోగించుకొనేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి’ అని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డికి సీఎం సూచించారు. ఈ మహాకార్యం పూర్తయ్యే వరకు పలుమార్లు కొండగట్టుకు వస్తూనే ఉం టానని సీఎం తెలిపారు. కొండగట్టు అభివృద్ధి బాధ్యతలను సీఎంవో కార్యదర్శి స్మితా సబార్వల్, దేవాదాయశాఖ కమిషనర్, జగిత్యాల కలెక్టర్, రోడ్లు భవనాలు, విద్యుత్తు శాఖ, అటవీ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పగించారు. సమీక్ష సమావేశంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్రెడ్డి, గంగుల కమలాకర్, ఎంపీ దీవకొండ దామోదర్రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, దాసరి మనోహర్రెడ్డి, డాక్టర్ సంజయ్, జీవన్రెడ్డి, కోరుకంటి చందర్, మండలి చీఫ్ విప్ భానుప్రసాదరావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మా జీ ఎమ్మెల్సీ నారదాసు లక్షణ్రావు, ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, డీసీఎమ్మెస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, సీఎంవో అధికారులు భూపాల్రెడ్డి, స్మితా సబర్వాల్, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్రెడ్డి, కలెక్టర్ యాస్మిన్ బాషా, ఆలయ స్థపతి ఆనంద్సాయి, వాస్తు సలహాదా రు సుధాకర్ తేజ తదితరులు పాల్గొన్నారు.
కొండగట్టు దర్శనానికి వచ్చిన సీఎం కేసీఆర్ కొండగట్టు క్షేత్రాన్ని హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. కొండగట్టుకు చేరుకొనే ముందే చాపర్లోనే క్షేత్రాన్ని పరిశీలించారు. కొండ చుట్టూ ఉన్న ప్రాంతాలు, అటవీక్షేత్రం, మంచినీటి వసతి సౌకర్యాలు, పక్కనే ఉన్న రైల్వేట్రాక్, వరద కాలువ, తదితర ప్రాంతాలన్నింటినీ పరిశీలించి జేఎన్టీయూకు చేరుకొన్నారు. సమీక్షా సమావేశం ప్రారంభంలోనే కొండగట్టు క్షేత్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్న విషయంపై తాను ఒక ఊహచిత్రాన్ని మనసులో నిర్మించుకున్నానని తెలిపారు. హెలికాప్టర్లో పరిశీలిస్తున్న సమయంలోనే క్షేత్రం ఎలా ఉండాలో ఒక ఇమేజ్ను తనకు మనసులో ఆ భగవంతుడు కల్పించాడని వెల్లడించారు.
కొండగట్టు అంజన్న ఆలయాన్ని సకల సౌకర్యాలతో కూడిన మహా పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘కష్టాల్లో ఉన్నవారికి, మానసిక ఆందోళనతో సతమతమయ్యే భక్తులకు కొండగట్టు అంజన్న భరోసాగా నిలిచాడు. కొండగట్టు అంజన్నను దర్శించుకొంటే కష్టాలు తొలుగుతాయని ప్రజలు విశ్వసిస్తారు. 300 ఏండ్ల క్రితం కొండ మీదికి వచ్చిన ఒక భక్తునికి కలలో దర్శనమిచ్చిన స్వామివారు ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించగా, ఆనాటి దేశ్ముఖ్కు ఈ విషయాన్ని భక్తుడు తెలియజేశాడు. అప్పటి పరిస్థితుల దృష్ట్యా స్వామి వారి ఆలయ నిర్మాణం జరిగింది. తదనంతర కాలంలో క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. నేడు సాధారణ భక్తులతోపాటు, హనుమాన్ మాలధారుల సంఖ్య భారీగా పెరిగింది. భవిష్యత్తులో ఇంకా పెరుగుతుంది. అందుకు తగ్గట్టుగా వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి చేపడుతాం. నిధులకు ఎలాంటి కొరతా లేదు. కొండగట్టు అభివృద్ధికి ఇటీవల రూ.100 కోట్లు మంజూరు చేస్తూ జీవో ఇచ్చాం. ఆలయ అభివృద్ధికి అవసరమైతే రూ.1000 కోట్లయినా ఇస్తాం. గతంలో ఇక్కడ నీటి కొరత ఉండేది. మిషన్ భగీరథ పథకం వల్ల నీటి కరువు తీరింది. యాదగిరి గుట్ట ఆలయ నిర్మాణం సమయంలో చేపట్టిన సూక్ష్మ పరిశీలన, విసృ్తతస్థాయి సమావేశాల మాదిరిగా అంజన్న ఆలయ పునర్నిర్మాణ పనులు చేపడుతాం’ అని సీఎం తెలిపారు.