ఢిల్లీ: బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఢిల్లీ చేరుకున్నారు. దేశ రాజధానిలోని వసంత్ విహార్లో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ భవన్ను (BRS Bhavan) మధ్యాహ్నం 1.05 గంటలకు ప్రారంభించనున్నారు. అంతకుముందు యాగశాల, సుదర్శనపూజ, హోమం, వాస్తుపూజల్లో పాల్గొంటారు. ముహూర్తానికి కార్యాలయాన్ని ప్రారంభించిన తరువాత మొదటి అంతస్థులోని తన చాంబర్కు చేరుకుంటారు. అనంతరం పార్టీ సమావేశపు హాలులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో దాదాపు గంటసేపు తొలి సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ ఆఫీసులో ఉదయం నుంచి జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ పాల్గొన్నారు.
ఢిల్లీ వసంత్ విహార్లో బీఆర్ఎస్ ఆఫీసు నిర్మాణానికి 2021, సెప్టెంబర్ 2న సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. మొత్తం నాలుగు అంతస్థులతో 11 వేల చదరపు అడుగుల స్థలంలో దీనిని నిర్మించారు. లోయర్గ్రౌండ్లో మీడియా హాల్, సర్వెంట్ క్వార్టర్స్ ఉన్నాయి. ఇక గ్రౌండ్ఫ్లోర్లో క్యాంటీన్, రిసెప్షన్ లాబీ, 4 ప్రధాన కార్యదర్శుల చాంబర్లు, మొదటి అంతస్థులో బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ చాంబర్, ఇతర చాంబర్స్, కాన్ఫరెన్స్ హాల్స్, 2వ, 3వ అంతస్థుల్లో మొత్తం 20 గదులు ఉన్నాయి. వీటిలో పార్టీ ప్రెసిడెంట్ సూట్, వర్కింగ్ ప్రెసిడెంట్ సూట్పోగా మిగతా 18 ఇతర రూములు అందుబాటులో ఉంటాయి.