మునుగోడులో ఇప్పుడు ఉపఎన్నిక రావలసిన అవసరం ఏముంది? మరో ఏడాది ఆగితే ఎన్నికలు జరిగేవి కదా? దీని వెనుక ఉన్న మాయామశ్చీంద్ర ఏంటి? అని తెలంగాణ సీఎం కేసీఆర్ నిలదీశారు. మునుగోడులో ప్రజాదీవెన సభ సందర్భంగా కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మునుగోడులో ఇప్పుడు ఉపఎన్నిక రావలసిన అవసరం ఏంటి? దీని వెనుక ఉన్న మాయామశ్చీంద్ర ఏంటి? అని గుర్తించకపోతే చాలా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందుకే సీపీఎం, సీపీఐ నాయకులతో ఒకటే చెప్పా. కేవలం తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రగతిశీల శక్తులన్నీ ఏకం కావాలనే అభిప్రాయాలు పంచుకున్నాం.
పల్లా వెంకటరెడ్డి గారు చెప్పినట్లు చిన్న చిన్న విషయాలు పక్కనపెడితే.. దేశం జీవిక దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే సీపీఐ పార్టీలో చర్చలు జరిపి, వాళ్లు పోటీ చేయకుండా మన టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. అందుకోసం వారికి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ పోరాటం ఈరోజుతో ముగిసేది కాదు. మునుగోడు నుంచి ఢిల్లీ దాకా మన స్నేహం కొనసాగాలి. దేశంలోని పేదలు, రైతుల బతుకులు బాగుపడే వరకూ దేశంలోని సీపీఐ, సీపీఎం, టీఆర్ఎస్ వంటి ప్రగతిశీల శక్తులన్నీ కలిసి పోరాడతాయని మాటిస్తున్నా.
దేశంలో కొత్త రాష్ట్రం ఏర్పడితే మన హక్కులు మనకు రావాలి. అన్నదమ్ములు విడిపోతే పంచుకోరా? ఇప్పుడు మన రాష్ట్రం ఏర్పడి 8 ఏండ్లు అవుతోంది. అయ్యా.. ఈ కృష్ణా నదిలో మా వాటా తేల్చండి అని అడిగితే సమాధానం చెప్పరు. ఎన్ని ఇస్తే అన్నే ఇవ్వు. కానీ వాటా చెప్పు అంటే నరేంద్ర మోదీ చెప్పడు. మా నీళ్లలో వాటా ఇవ్వనందుకే రేపు మునుగోడుకు వస్తున్నావా అమిత్ షా? సమాధానం చెప్పు. నీ బొమ్మలు కాదు. నీ తాత జేజమ్మల బొమ్మలు కూడా మేం చూశాం. కొట్లాటలు తెలంగాణకు కొత్త కాదు. కొట్లాట మొదలైతే ఎంత దూరమైనా పోతాం. ఇలాంటి బొమ్మలు కాదు. ఎందుకు కృష్ణా జలాల్లో మా వాటా తేల్చడం లేదు? సమాధానం చెప్పు’’ అని అమిత్షాను ప్రశ్నించారు.
‘‘పంద్రాగస్టును ప్రధాని మాట్లాడితే మైకులు పగిలిపోయాయి. నీళ్ల వాటా తేలిస్తే చకచకా నీళ్లు తెచ్చుకుంటాం. తేలిన చోట గోదావరి నుంచి తెచ్చుకున్నాం. తుంగతుర్తి, కోదాడల్లో గోదావరి నీళ్లు పారి లక్షల టన్నుల దిగుబడి వస్తోంది. బసవాపురం ప్రాజెక్టు పూర్తయింది. ఆలేరు, భువనగిరి, రామన్నపేటలకు కూడా వర్షాకాలం తర్వాత నీళ్లు వస్తాయి. ఇక్కడ కూడా రావాలని పనులు మొదలుపెడితే.. ఎందుకు అడ్డంకులు పెడుతున్నారు? పెద్ద పెద్ద మాటలు మాట్లాడే రాజగోపాల్ రెడ్డినో, కేంద్ర మంత్రో, ఇంకో పెద్ద మనుషో ఢిల్లీకి పోయి మా కృష్ణా జలాలా వాటా ఏంటి? మా శివన్నగూడెం ప్రాజెక్టు ఎప్పుడు నింపుకోవాలి? అని అడగరట.
కానీ రేపు డోల్ బాజా పట్టుకొని అమిత్షాను తీసుకొస్తారట. ఎవడికి కావాలి నీ డోల్ బాజా, భజంత్రీ, నీ పెద్దపెద్ద బొమ్మలు? మునుగోడు చైతన్యవంతమైన గడ్డ. కృష్ణా జలాల వాటా ఎందుకు తేల్చరో? కేంద్ర ప్రభుత్వ పాలసీ ఏంటో? మీ దద్దమ్మ చేతగానితనమేంటో మునుగోడులో చెప్పాలని సవాల్ చేస్తున్నా. ఒక్క విషయం ఆలోచించండి.. బీజేపీ ప్రభుత్వం వచ్చి 8 ఏండ్లు అయింది. రైతులకు కానీ, మహిళలకు కానీ, దళితులకు కానీ, కార్మికులకు కానీ ఎవరికైనా ఒక్క మంచి పని జరిగిందా? వాళ్లకు మేలు జరిగితే మాకు కనిపించదా? అవి లేవుకానీ.. ఎయిర్పోర్టులు, విమానాలు, బ్యాంకులు, రైళ్లు, రోడ్లు, గ్యాస్ కంపెనీలు అన్ని వరుసపెట్టి అమ్మడం మొదలు పెట్టారు.
ఇక మిగిలింది ఏంటి? రైతులు, భూములు, వ్యవసాయ పంటలు. దీని గురించి మునుగోడు ప్రజలు ఆలోచించాలి. బావి దగ్గర మీటర్ పెట్టు కేసీఆర్.. పెడతావా? పెట్టవా? అని నన్ను అడిగారు. నేను చచ్చినా పెట్టను అని తేల్చిచెప్పా. దీని వెనుక చాలా మతలబు ఉంది. ఎరువులు, కరెంటు ధరలు పెంచాలి. పండిన పంటలు కొనద్దు.. రైతులు మా వల్ల కాదంలూ తట్ట, పార పక్కన పెట్టేయాలి. ఇలా చేస్తే ఏమవుతుంది? మోదీ దోస్తులు సూట్ కేసులు పట్టుకొని రెడీగా ఉన్నారు. మీ వల్ల కాదు. కార్పొరేట్ వ్యవసాయం చేద్దాం అని చెప్పి రైతుల పొలాల్లో రైతులనే కూలీలుగా పనిచేయించే కుట్ర జరుగుతోంది. తస్మాత్ జాగ్రత్త.
చిన్నరైతు, పెద్ద రైతు అని లేకుండా అందరికీ లక్షమందికిపైగా రైతు బంధు పథకం అందుతోంది. లక్షమంది రైతులకు ఎంత భూమి ఉంటే అంత అందుతోంది. అది కూడా ఎలా వస్తుంది? ఎవరికీ ఒక్క రూపాయి లంచం ఇచ్చే పని లేదు. దరఖాస్తులు లేవు మేం హైదరాబాద్లో బ్యాంకులో వేస్తే ఇక్కడ మీకు టింగ్ టింగ్ అంటూ మొబైల్లో మెసేజ్ వస్తుంది. ఇది బంద్ చెయ్యాలట. వడ్లు కొనుగోలు గురించి గొడవ జరిగే సమయంలో జగదీశ్వర్ రెడ్డి, మేం ఎమ్మెల్యేలంతా వెళ్లి ఢిల్లీలో గొడవ చేసినా వడ్లు కొనం అన్నారు. అడిగితే మే క్యా కర్ నా? (నేనేం చెయ్యాలి?) అని అడిగారు. ఫుడ్ కార్పొరేషన్ను చేతులో పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే మేం ఏం చెయ్యాలి?
విలేకరులు లేకుండా చూసి తలుపు పెట్టి పైసలు బర్బాద్ చేస్తున్నారు? రైతులకు ఎందుకు ఇస్తున్నారు? వికలాంగులకు, చేనేతకార్మికులకు, గీత కార్మికులకు, ముసలోళ్లకు ఇవ్వొద్దు అంటారు. వీళ్లందరి నోరు కొట్టి బడా బడా షావుకార్లకు ఇవ్వాలి. ఇదే దేశంలో జరుగుతోంది. నేను చెప్పేది నిజమో కాదో మీ గ్రామంలోకి వెళ్లి ఆలోచించండి. రైతు బంధు అని చెప్పా అందరికీ వస్తోంది. రైతు బీమా అందరికీ వస్తోంది. ఎవరైనా రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడేది. కానీ ఇప్పుడు రైతు ఏ కారణం వల్ల చనిపోయినా పది రోజులు కూడా తిరగకుండానే వాళ్ల ఖాతాలో రూ.5 లక్షలు పడుతోంది’’ అని కేసీఆర్ ధ్వజమెత్తారు.