నమస్తే తెలంగాణ న్యూస్నెట్వర్క్ నవంబర్ 15: ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం బోధన్, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి, మెదక్ నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన మూడు సభలు వేటికవే పోటీ అన్నట్టుగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కొక్క సభలో దాదాపు గంటసేపు గడిపారు. ఈ సభలు విజయవంతం కావడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది.
ఆయా సభలకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్న దృశ్యాలు కనిపించాయి. అందుబాటులో ఉన్న వాహనాలను ఎక్కి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. పిల్లాపాపలతో మహిళలు, వృద్ధులు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆయా సభల్లో ‘జై కేసీఆర్.. జై బీఆర్ఎస్.. జై కిసాన్’ నినాదాలు మార్మోగాయి. ‘జై కేసీఆర్.. జయహో కేసీఆర్’ అంటూ యువత నినదించారు. తొమ్మిదిన్నరేండ్లలో సాధించిన ప్రగతి, సంక్షేమ ఫలాల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించినప్పుడు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
ఇందూర్ పులకింత
ప్రజా ఆశీర్వద సభతో ఇందూర్ గడ్డ పులకించింది. ఈ సభ ప్రతిపక్ష పార్టీల్లో వణుకు సృష్టించింది. కేసీఆర్ సభతో పోల్చుకుంటే అక్టోబర్ 3న ప్రధాని మోదీ నిర్వహించిన సభ వెలవెలబోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మోదీ సభకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలను తరలించగా.. కేవలం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ప్రజలతోనే ప్రజా ఆశీర్వాద సభ కిక్కిరిసింది. మైనార్టీలు సైతం ఈ సభకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తొమ్మిదిన్నరేండ్లలో తెలంగాణలో మైనార్టీలు సాధించిన అభివృద్ధిని కండ్లకు కట్టారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని కేసీఆర్ వివరించడంతో అంతా శ్రద్ధగా విన్నారు. కేసీఆర్ బతికున్నంత కాలం సెక్యులరిజాన్ని కాపాడతానంటూ చెప్పడంతో సభికులంతా చప్పట్లు కొట్టారు.
ఎల్లారెడ్డి పరవశం
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గులాబీ పార్టీ పరవశించి పోయింది. ప్రజా ఆశీర్వాద సభకు గిరిజనులు, కాయితి లంబాడీలు భారీగా వచ్చారు. పూర్తిగా గ్రామీణ నేపథ్యం ఉన్న ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నిర్వహించిన సీఎం సభ గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. అత్యధికులు బైకులపై సభకు తరలిరావడం విశేషం. పొడవాటి జెండాలను చేత పట్టుకుని కేసీఆర్కు అడుగడుగునా అభివాదం చేస్తూ అభిమానులు సంబురపడ్డారు. ఎల్లారెడ్డి సభలో కాయితి లంబాడీల రిజర్వేషన్ డిమాండ్ కోసం తాను కూడా పోరాటం చేస్తానంటూ కేసీఆర్ చెప్పడంతో ఆ వర్గంలో ఆనందం వెల్లివిరిసింది.
బోధన్ జనమయం
దారులన్నీ బోధన్ వైపే అన్నట్టుగా బోధన్ నియోజకవర్గ సభ విజయవంతమైంది. ఈ సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కేసీఆర్ కటౌట్లు, భారీ గులాబీ జెండాలను ప్రదర్శిస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు ర్యాలీగా తరలివచ్చి సభలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ఆద్యంతం ఆసక్తిగా ఆకలించారు.
కిటకిటలాడిన మెదక్ సభ
మెదక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి అధ్యక్షతన మెదక్లోని సీఎస్ఐ చర్చి కాంపౌండ్లో నిర్వహించిన సీఎం ప్రజా ఆశీర్వాద సభకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మెదక్ పట్టణానికి వచ్చే రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. మధ్యాహ్నం 3 గంటలకే సభా ప్రాంగాణానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, సీఎం రాక కోసం ఓపికగా నిరీక్షించారు. సాయంత్రం 5 గంటలకు సీఎం కేసీఆర్ వేదిక మీదకు రావడంతోనే ఈలలు, కేకలతో సంతోషం వ్యక్తం చేశారు. ‘జై కేసీఆర్.. జై తెలంగాణ’ అంటూ సభలో యువకులు, మహిళలు నినదించారు. కేసీఆర్, హరీశ్రావు, పద్మాదేవేందర్రెడ్డి చిత్రాలతో కూడిన ప్లకార్డులు పట్టుకుని మహిళలు, యువకులు నృత్యాలు చేశారు. సభలో మంత్రి హరీశ్రావు, బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, శేరి సుభాష్రెడ్డి, వెంకట్రాంరెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.